కేంద్రప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన జిల్లాల విభజన సంగతి పూర్తిగా తెలిసినట్గుగా లేదు. ఇంకా పాత ఉమ్మడి జిల్లాల మాదిరిగానే కేంద్రంలోని మంత్రిత్వశాఖలకు చెందిన అధికారిక వెబ్ సైట్లలో పాత జిల్లాల పేర్లనే అలాగే ఉంచేసింది. దేశంలోని ఏదైనా రాష్ట్రంలో చట్టం చేసి, దానికి గెజిట్లు ముద్రించి చేసిన జిల్లాల విభజన విషయాన్ని రాష్ట్రభుత్వానికి చెందిన జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్ మెంట్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తుంది. ఎందుకంటే రాష్ట్రాల్లో పనిచేసే సివిల్ సర్వీస్ అధికారులందరూ కేంద్ర పరిధిలోనే పనిచేస్తారు. వారికి ఉద్యోగాలు, హోదాలు, సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినా.. వారి జీతభత్యాలు, పదోన్నతులు అన్నీ కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుంది. ఇదే సమయంలో ఏపీలో చేసిన జిల్లాల విభజనకు సంబంధించి 26 జిల్లాలకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అధికారులను కేటాయించిన ప్రభుత్వం విభజన చేసిన కొత్త జిల్లాల పేర్లను మాత్రం కేంద్రప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లోని వెబ్ సైట్లలోమాత్రం నేటికీ మార్పు చేయలేదు.
ఉమ్మడి జిల్లాల ద్రుష్టిలోనే ఉన్న కేంద్రం
ఏపీలో కొత్తగా 26 జిల్లాలు ఏర్పాటై అక్కడ జిల్లాయంత్రాంగాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటైనా ఇంకా కేంద్రం మాత్రం ఆంధ్రప్రదేశ్ లో కేవలం 13 జిల్లాలు మాత్రమే ఉన్నట్టుగా భావిస్తుంది. ఈ విషయం రాష్ట్రప్రభుత్వానికి తెలిసినా కేంద్రం ద్రుష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు. దీనితో కేంద్రంలో కీలక శాఖలకు వున్న వెబ్ సైట్లలో కొత్త జిల్లాల పేర్లు, ఆయా కొత్త జిల్లాలకు లాగిన్ లు ఏర్పాటు చేయలేదు. కేంద్రప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు కాలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గానే కేంద్రం సుమారు రెండేళ్ల వరకూ వ్యవహరించింది. మళ్లీ ఇపుడు ఏపీలోని కొత్తజిల్లాలు ఏర్పాటు చేసినా వాటికి గెజిట్లు విడుదల చేసి పరిపాలన ప్రారంభించినా ఉమ్మడి జిల్లాలుగానే కేంద్రం భావిస్తున్నది. దానివలన కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన చాలా పనులు పెండింగ్ లో ఉండిపోతున్నాయి. నిధులు కూడా పూర్తిస్థాయిలో ఖర్చుచేయడానికి సైతం వీలు లేకుండా పోతుంది. పాలనా పరమైన ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉత్పన్నమవుతున్నాయి.
ఆర్ఎన్ఐ వెబ్ సైట్ లో నేటికీ లాగిన్ కి నోచుకోడి ఆర్డీఓలు
ఆర్ఎన్ఐ(రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా-OFFICE OF REGISTRAR OF NEWSPAPERS FOR INDIA) దీని ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ దిన, వార, పక్ష పత్రికలు ప్రభుత్వం గుర్తించిన అన్ని భాషల్లో ఏర్పాటు చేస్తారు. దానికోసం ఆ అధికారం డివిజన్ కేంద్రంలోని ఆర్డీఓ(రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్)లకు ప్రభుత్వం ఇచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, విభజన ఆంధ్రప్రదేశ్ లోనూ ఈ శాఖకు చెందిన వెబ్ సైట్ లాగిన్ ఐడీలు పాత 13 జిల్లా కేంద్రాల్లోని ఆర్డీఓలకు మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. వాస్తవానికి రాష్ట్రంలోని అన్నిడివిజన్ లలోని ఆర్డీఓలకు ఈ లాగిన్ ఏర్పాటు చేయాల్సి వుంటుంది. ఆ విషయాన్ని రాష్ట్రప్రభుత్వం, జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓ ల ద్వారా సమాచారం సేకరించి కేంద్ర ప్రభుత్వానికి పంపాలి. కానీ పాత జిల్లాల కలెక్టర్లు మాత్రమే అరకొరగా ఈ వ్యవహారం చేపట్టడంతో పాత జిల్లాలతోపాటు, విభజన జిల్లాల్లోని ఆర్డీఓలకు సైతం ఆర్ఎన్ఐ లాగిన్లు ఏర్పాటు చేయలేదు ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ. దీనితో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆర్ఎన్ఐ కి సంబంధించి ఏ పని కావాలన్నా ఆర్డీఓ కార్యాలయాలు, జిల్లా కేంద్రంంలోని ఆర్డీఓ కార్యాలయాలను సంప్రదించాల్సి వస్తున్నది.
మురిగి వ్రుధాగా పోతున్న కేంద్ర పథకాల నిధులు
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ పథకాలు, కార్యక్రమాలకు చెందిన నిధులను రాష్ట్రప్రభుత్వానికి చెందిన ప్రభుత్వశాఖల ద్వారా పూర్తిస్థాయిలో ఖర్చుచేయాలంటే ఆయా మంత్రిత్వశాఖలకు చెందిన శాఖలకు రాష్టప్రభుత్వశాఖలతో అనుసంధానం ఉండాలి. దానికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా అధికారులను, పర్యవేక్షణ చేపట్టాలి. కానీ అటు రాష్ట్రప్రభుత్వం కూడా కొన్ని కేంద్రప్రభుత్వ ప్రాజెక్టులు, పథకాలకు చెందిన నిధులకు సంబంధించి పూర్తిస్థాయి అధికారులను నియమించకపోవడం, పాలనా పరమైన చర్యలు చేపట్టకపోవడంతో చాలా పథకాలకు చెందిన నిధులు ఖర్చుకాకుండా వ్రుధాపోతున్నాయి. ఈ విషయాన్ని కేంద్రప్రభుత్వమే ప్రతీ ఏటా మంత్రిత్వ శాఖల ద్వారా ప్రత్యేకంగా మీడియాకి ప్రకటన విడుదల చేస్తున్నది. అలా కాకుండా ఉండాలంటే రాష్ట్రాల్లో ఏం జరుగుతోందో ఆ విషయాన్ని లిఖిత పూర్వకంగా కేంద్రానికి తెలియజేయడంతోపాటు, ఆయా ప్రభుత్వశాఖలకు చెందిన మంత్రిత్వశాఖల కార్యదర్శిలకు కూడా ప్రత్యేకంగా తెలియజేయాల్సి వుంటుంది. అలా చేసినపుడు మాత్రమే కేంద్రం మంత్రిత్వశాఖలకు చెందిన వెబ్ సైట్లలో మార్పులు, చేర్పులు చేయడానికి ఆస్కారం వుంటుంది. లేదంటే కార్యకలాపాలు ఉమ్మడి జిల్లాల ద్రుష్టిలోనే జరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఏడేళ్లకు గానీ ఏర్పాటు కానీ పీఐబీ
విభజన ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం పీఐబీ(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) కేంద్రాన్ని కేంద్రం ఏడేళ్ల తరువాత ఏపీకి కేటాయిచింది. ఇదొక్కటే కాదు కేంద్రప్రభుత్వ శాఖలకు సంబంధించిన రాష్ట్ర కార్యాలయాలను చాలావాటిని కేంద్రం ఏర్పాటు చేయలేదు. అలా ఏర్పాటు చేయాలంటే విభజన చట్టంలోని అంశాలను ఉటంకిస్తూ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎప్పటికప్పుడు కేంద్రానికి లేఖలు రాయడంతోపాటు, ఆయా ప్రభుత్వశాఖల మంత్రుల ద్వారా రాయబారాలు నడపాల్సి వుంటుంది. అటు కేంద్రం కూడా రాష్ట్రాల నుంచి అధికంగా ఆదాయం వచ్చే ఆదాయపన్నుశాఖలాంటి శాఖలకు సంబంధించిన మార్పులు చేర్పులు, కేంద్ర మంత్రిత్వశాఖకు చెందిన వెబ్ సైట్ లలో పొందుపరిచింది తప్పితే ఇతర ప్రభుత్వశాఖలకు చెందిన సమాచారాన్ని అందుబాటులో ఉంచలేదు. మార్పులను, అధికారులకు లాగిన్ సౌకర్యాలను ఏర్పాటు చేయలేదు. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి రాష్ట్రంలోని జిల్లాల విభజన, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలకు చెందిన వెబ్ సైట్ లలో కొత్త జిల్లాలను చేర్చడం, ప్రభుత్వ పథకాలు, స్కీములకు సంబంధించిన రాష్ట్ర కార్యాలయాల ఏర్పాటుపై ద్రుష్టి సారించి విషయాన్ని తీసుకెళ్లకపోతే ఎప్పటికీ కేంద్రంలో మార్పు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు..!