భారత గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణ మందిరాన్ని దర్శించుకున్నారు. మందిరం వద్దకు చేరుకున్న గౌరవ రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ఎవి ధర్మారెడ్డి, జేఈవో సదా భార్గవి, సీవీఎస్వో నరసింహ కిషోర్ స్వాగతం పలికారు. అర్చకులు సంప్రదాయ బద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి శ్రీ వేణుగోపాల స్వామిని దర్శించుకున్నారు. అర్చకుల ఆశీర్వాదం అనంతరం ఆమె గో ప్రదక్షిణ చేశారు. గోవులకు అరటిపళ్ళు, మేత తినిపించి వాటికి నూతన వస్త్రాలు సమర్పించి నమస్కరించారు. అనంతరం గో తులాభారంలో గోవును ఉంచి దాని బరువుకు సరిపడేలా 435 కిలోల సమగ్ర దాణాను విరాళంగా అందించారు. ఇందుకు సంబంధించిన రూ 6 వేల రూపాయలను రాష్ట్రపతి గో మందిరం అధికారులకు అందజేశారు.
ఉప ముఖ్యమంత్రులు నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ , కేంద్ర కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి
ఆర్ కె రోజా , జిల్లా కలెక్టర్ వెంకటరమణా రెడ్డి, సప్త గో ప్రదక్షిణ మందిరం నిర్మాణ దాత, చెన్నె టీటీడీ స్థానిక సలహా మండలి చైర్మన్ శేఖర్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వర రావు, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.