భారత రైల్వే కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు అనేక ప్రత్యేకతలను కలిగివున్నాయి. సాధారణ రైలుప్రయాణం చేసిన వారికి ఈ రైలు సరికొత్త అనుభూతిని కలుగజేస్తుంది. ఈ రైలు భోగీలను, కోచ్ లను దేశంలోని చెన్నై కోచ్ ఫ్యాక్టీరీలోనే తయారు చేస్తున్నారు. ఈ రైలుకి మొత్తం 16 బోగీలు ఉండగా, అత్యాధునిక సౌకర్యాలతో ఆకట్టుకునేలా ఉంది. 1,128 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఈ రైలులో వుంది. అవసరాన్ని బట్టి కోచ్ లు పెంచే సౌలభ్యాన్ని భారత రైల్వే పరిశీలస్తున్నది. కోచ్ పొడవు 23 మీటర్లు. ప్రత్యేకంగా స్లైడింగ్ డోర్లు, రీడింగ్ లైట్స్, అటెండెంట్ కాల్ బటన్లు, ఆటోమెటిక్ ఎగ్జిట్, ఎంట్రీ డోర్లు, సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. పుష్ బ్యాక్ సీట్ల వలన అదే సీటులో పడుకునే సౌకర్యం కూడా వుంది. జీపీఎస్ ఆధారిత ప్రయాణికుల సమాచారం, బయోవాక్యూమ్ మరుగుదొడ్లు ఉన్నాయి. మొత్తానికి ఈ వందే భారత్ రైళ్లు ప్రయాణం ఖరీదు కాస్త ఎక్కువే అయినా నిత్యం విమానాల్లో ప్రయాణాలు చేసే ప్రయాణీకులు ఈ తరహా రైళ్లను అధికంగా ఇష్టపడటానికి అవకాశం వుంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. కాగా 52 మంది కూర్చునే ఫస్ట్ క్లాస్ కోచ్లు మొత్తం రైలులో రెండింటిని ఏర్పాటు చేశారు. సాధారణ ఫస్ట్ క్లాస్ రైలుతో పోల్చుకుంటే వందేభారత్ రైలు అత్యాధునిక వసతులతో వీటిని తయారు చేయడంతో వీటిలో ప్రయాణానికి డిమాండ్ అధికంగా వుంటుందని కూడా రైల్వే వర్గాలు చెబుతున్నాయి.