టిటిడిలో దేశీయ గోజాతులను అభివృద్ధి చేసేదిశగా


Ens Balu
19
Pune
2023-02-21 12:02:47

 శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి రోజువారి అవసరమయ్యే పాలు,పెరుగు, నెయ్యి సొంతంగా తయారు చేసుకోవడానికి కార్యాచరణకు దిగిన టీటీడీ దేశంలోని అత్యుత్తమ దేశీయ గోశాలలు, డెయిరీల పనితీరును పరిశీలిస్తోంది. ఇందులోభాగంగా జేఈవో సదా భార్గవి నేతృత్వంలో బృందం మంగళవారం సాయంత్రం పూణె కు సమీపంలోని మంచార్ లో పర్యటించింది. ఆ గ్రామంలో ఉన్న పరాగ్ డెయిరీ కి చెందిన భాగ్యలక్ష్మి డెయిరీ ఫామ్ ను పరిశీలించారు. ఈ డెయిరీ లోని  గో జాతుల ద్వారా అత్యధిక పాల ఉత్పత్తికి అనుసరిస్తున్న విధానాలను వీరు క్షేత్ర స్థాయిలో తెలుసుకున్నారు. ఆ డెయిరీ  యాజమాన్యం సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తక్కువ మంది సిబ్బందితో  మంచి ఫలితాలు సాధిస్తున్న తీరును అధికారుల బృందం అధ్యయనం చేసింది. యంత్రాల సాయంతో  గోవులకు కష్టం లేకుండా ఒకే సారి 50 గోవుల నుంచి సులువుగా పాలు పితికే విధానాన్ని పరిశీలించి అక్కడి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.  డెయిరీ నిర్వహణ, సాంకేతిక వ్యవస్థ, ఖర్చు తదితర వివరాలన్నింటితో తమకు ఒక నివేదిక అందించాలని జేఈవో సదా భార్గవి భాగ్యలక్ష్మి డెయిరీ యాజమాన్యాన్ని కోరారు. వీలైనంత త్వరగా నివేదిక అందించడానికి వారు అంగీకరించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథరెడ్డి, పశువైద్య విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ వెంకటనాయుడు పాల్గొన్నారు.
సిఫార్సు