మన భారతదేశం ఎన్నో అద్భుత ఆలయాలకు నెలవు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆలయం భక్తులకు ఆకట్టుకుంటుంది. అలాంటి అద్భుత ఆలయాల్లో అరుదైన ఈ గణపతి ఆలయం కూడా ఒకటిగా చెబుతారు. బ్రిటిష్ కాలంలో అప్పటి గవర్నర్ ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట చేస్తుంటే వచ్చి రాతికి ప్రాణం ఉంటుందా అని హేళన చేశారట. ఒక సిద్ధయోగి దాన్ని రుజువుచేయడంతో ఆ గవర్నర్ స్వయంగా వచ్చి గణపతికి నమస్కరించి మరీ వెళ్లాడట. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది...? ఆ ఆలయంలో విగ్రహ ప్రతిష్టప్పుడు ఏం జరిగిందనే విషయాల గురించి తెలుసుకుంటే దేవుళ్ల ఆలయాలకు అంతటి శక్తి ఉందా అని ఆశ్చర్యపోవడం ఖాయం. తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేలి జిల్లాలో కుర్తాళం ఉంది. ఇక్కడే మౌనస్వామి మఠం, కుర్తాల పీఠం, గణపతి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ అద్భుత జలపాతం ఉండగా ఇందులోని మూలికలు ఎన్నో రకాల వ్యాధులను నయం చేస్తాయని నమ్ముతారు. అంతేకాదు చాలా పరిశోధనలలో కూడా రుజువు అయింది. ఇక్కడ ఉన్న చిత్రావతి జలపాతం దాదాపుగా అరవై అడుగుల ఎత్తు నుండి చాలా వేగంగా క్రిందకు దూకుతుంది. ఇక్కడ అనేక రకాల మూలికలు దొరకడమే కాదు మానసిక వికలాంగులు ఈ నీటిలో స్నానం చేస్తే మానసిక రుగ్మతతో పాటు ఎన్నో శారీరక సమస్యలు తొలగిపోతాయని చెబుతారు.
ఇక గణపతి ఆలయ విషయానికి వస్తే, ఇక్కడ ఉన్న గణపతిని ‘నాడి గణపతి’ అని పిలుస్తారు. ఇలా నాడి గణపతి అని పిలవడానికి కారణం ఏంటంటే, మహా సిద్ధయోగి మౌనస్వామి తపస్సు చేయడానికి ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ఇక్కడ ఒక మఠాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ముందుగా శ్రీ సిద్దేశ్వరి అమ్మవారిని ప్రతిష్టించారు. ఆ తరువాత ఇక్కడ గణపతి దేవుడిని ప్రతిష్టించి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయాలని భావించగా, అది తెలిసిన మద్రాస్ గవర్నర్ ఎడ్వార్డ్ రాతికి ప్రాణ ప్రతిష్ట ఏంటి అంటూ హేళనగా అనడంతో, ఆ సిద్ద యోగి ఒక వైద్యుడిని పిలిపించమని చెప్పాడు. వెంటనే అతడు వైద్యుడిని పిలిపిస్తాడు, మౌనస్వామి వైద్యుడితో విగ్రహానికి నాడి పరీక్షించమని చెప్పగా... అతడు కూడా విగ్రహానికి ప్రాణం ఉండదు కదా అంటూనే, పరీక్షించి నాడి చప్పుడు లేదని చెప్తాడు. అప్పుడు మౌనస్వామి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేసి ఇప్పుడు చూడండి అని చెబుతాడు. వైద్యుడి మెడలోని స్టెతస్కోప్ తో పరిశీలించగా ఆ వైద్యుడిలో ఒక ఆశ్చర్యం గణపతి విగ్రహానికి మనిషి వలె నాడి కొట్టుకుంటుందని చెప్పాడు. అందరూ ఒక్కసారిగా బిత్తరపోతారు.
దీంతో ఈ అద్భుతాన్ని చూసిన ఆ వైద్యుడు ఇంకా బ్రిటిష్ గవర్నర్ మౌనస్వామి దగ్గర ఆశీర్వాదాన్ని తీసుకొని గణపతికి నమస్కరించి అక్కడి నుండి వెళ్లారు. ఇలా మౌనస్వామి మహిమతో ఇక్కడ వెలసిన గణపతి దేవుడికి నాడి గణపతి అనే పేరు వచ్చినది. అయితే ఇక్కడ స్వామివారి తొడల నుండి శబ్దం వచ్చినదని అందుకే స్వామివారి విగ్రహానికి తొడలు కనిపించకుండా ధోవతి కడతారని చెబుతారు. నాటి నుంచి నేటి వరకూ ఈ నాడి గణపతి ఆలయాన్ని దర్శించడానికి, ఆలయ చరిత్రను తెలుసుకోవడానికి వేలు, లక్షల సంఖ్యలో భక్తులు వెళుతుంటారు. దైవం లేదని అనుకునేవారికి ఈ నాడి గణపతి ఒక ప్రత్యేక నిదర్శమని ఇక్కడి వారు చెబుతుంటారు. గణపతి ఆలయాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటాయి. కానీ ఇక్కడి ఆలయం మాత్రం ప్రపంచంలోనే ప్రశిద్ధి చెందిన ఆలయంగా చరిత్రకెక్కింది. అయితే స్వామివారి విగ్రహంలో నుంచి నాడి ఎందుకు కొట్టుకుంటుంది అనే విషయం నేటికీ ఎవరూ గుర్తించలేకపోయారంటే అది ఇక్కడి వెలసిన స్వామివారి మహిహ అనే భక్తుల నమ్మిక..!