జమ్మూలోని మజీన్ గ్రామంలో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 8న జరుగనున్న మహాసంప్రోక్షణ ఏర్పాట్లను మంగళవారం టీటీడీ జెఈవో వీరబ్రహ్మం పరిశీలించారు. గర్భాలయం, యాగశాల, వేదిక వద్ద ప్రముఖులు కూర్చునేందుకు ఏర్పాట్లు, విచ్చేసే భక్తులకు అన్నప్రసాద వితరణ, పార్కింగ్ తదితర ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ పరిసరాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జమ్ములో చేపట్టే కార్యక్రమం స్థానికులకు తెలియజేసే విధంగా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్ఇలు సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, విజివోలు మనోహర్, గిరిధర్ రావు, డెప్యూటీ ఈవోలు గుణభూషణ్ రెడ్డి, శివప్రసాద్, ఇఇ సుధాకర్, డెప్యూటీ ఇఇలు రఘువర్మ, చెంగల్రాయలు, ఏఈవో కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.