నాగలాపురం శ్రీ వేద నారాయణ స్వామివారి ఆలయంలో గురువారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 11 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేద నారాయణస్వామివారి ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5.30 గంటల వరకు ఆలయంలోని రాములవారి మండపంలో అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది. తులసి, చామంతి, గన్నేరు, మల్లెలు, రుక్షి, కనకాంబరాలు, రోజా, తామర, కలువ, మొగలిరేకులు వంటి 10 రకాల పూలు, 3 రకాల ఆకులతో స్వామి, అమ్మవార్లకు యాగం నిర్వహించారు. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి
ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.పుష్పయాగం అనంతరం రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో నాగరత్న, ఏఈఓ మోహన్, సూపరింటెండెంట్ ఏకాంబరం, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.