భారత సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆదివారం రాత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న మాజీ ప్రధాన న్యాయమూర్తికి టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఎవి ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో జస్టిస్ రమణకు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఆ తరువాత శ్రీ బేడి ఆంజనేయ స్వామివారిని జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి మహాద్వారానికి నమస్కరించారు. అంతకు ముందు జస్టిస్ ఎన్వీ రమణ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట జేఈవో వీరబ్రహ్మం, డెప్యూటీ ఈవో గోవిందరాజన్ స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు.