యువతలో హైందవ సనాతన ధర్మ వ్యాప్తి కోసం శ్రీవారి ఆలయం నుండే తొలి అడుగు వేస్తున్నామని, ఇందులో భాగంగా రామకోటి తరహాలో గోవింద కోటి రాసిన 25 ఏళ్ల లోపు వారికి వారి కుటుంబ సభ్యులతో కలిసి ఒకసారి తిరుమల స్వామివారి బ్రేక్ దర్శనం కల్పిస్తామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్రెడ్డి వెల్లడించారు. 10 లక్షల 1,116 సార్లు గోవిందనామం రాసినవారికి దర్శన సౌభాగ్యం కల్పిస్తామన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం ధర్మకర్తల మండలి తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తీసుకున్న ముఖ్య నిర్ణయాలను ఛైర్మన్ మీడియాకు తెలియజేశారు. సనాతన ధర్మం పట్ల, మానవీయ, నైతిక విలువల పట్ల అవగాహన కల్పించేందుకు ఎల్కెజి నుండి పిజి వరకు చదువుతున్న విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా 20 పేజీల్లో భగవద్గీత సారాంశాన్ని పుస్తక ప్రసాదంగా కోటి పుస్తకాలు ముద్రించి పంపిణీ చేస్తామన్నారు.