సింహ‌ వాహనంపై యోగ‌ న‌ర‌సింహుడిగా శ్రీ‌ మలయప్ప


Ens Balu
30
Tirumala
2023-09-20 04:33:02

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన బుధ‌వారం ఉదయం శ్రీ మలయప్పస్వామి సింహ‌ వాహనంపై యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. సింహ వాహనం - ధైర్య‌సిద్ధి  శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహ‌నాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో 'సింహదర్శనం' అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంత‌మ‌వుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజ‌య‌స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు. 

   బ్ర‌హ్మోత్స‌వాలకు విచ్చేసే చిన్న‌పిల్ల‌లలు త‌ప్పిపోకుండా టీటీడీ ఛైర్మ‌న్  భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి, ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో  స‌దా భార్గ‌వి, తిరుమ‌ల అద‌న‌పు ఎస్పీ శ్రీ మునిరామ‌య్య‌తో క‌లిసి జియో ట్యాగింగ్ క‌ట్ట‌డం ప్రారంభించారు.  రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ముత్య‌పుపందిరి వాహనంపై స్వామివారు అభ‌య‌మిస్తారు. వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, డిల్లీ స్థానిక స‌ల‌హామండ‌లి అధ్య‌క్షులు  వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి, జెఈవో  వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో  న‌ర‌సింహ కిషోర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.