ప్రతీ పదేళ్లకొకసారి జనాభా గణన జరుగుతున్నట్టుగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందిన మీడియా గణన కూడా జరిగితే వాస్తవ మీడియా లెక్కతేలుతుంది. లేదంటే ఏది మీడియానో.. ఏది సోషల్ మీడియానో తెలియక అన్ని వర్గాల ప్రజలు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఫలితంగా వాస్తవ మీడియాలో పనిచేస్తున్నవారికి గుర్తింపు లేకుండా పోతున్నది. సాధారణంగా అయితే ఆర్ఎన్ఐ నుంచి గుర్తింపు పొంది, లైసెన్సు పొందిన దిన పత్రికలు అనునిత్యం పత్రికలు ముద్రించి డాక్యుమెంటేషన్ పక్కాగా చేస్తేనే వాటికి గుర్తింపు వుటుంది. రాష్ట్రాల్లో అయితే ముద్రించిన పత్రికను సమాచారశాఖకు ఆధారంగా చూపించడంతోపాటు, బయట మార్కెట్ లో కూడా కొద్దోగొప్పొ కనిపించినపుడు సదరు మీడియాకి గుర్తింపు వుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా అగ్రభాగన రాజ్యమేలుతుండటంతో.. నిజంగా వున్న మీడియా ఏదో.. లేని మీడియా ఏదో ఎవరికీ తెలియడం లేదు. రెగ్యులర్ గా మీడియా సంస్థలు రన్ చేస్తూ.. డాక్యుమెంటేషన్ రాష్ట్రాల సమాచారశాఖ కార్యాలయాలకు అందేజేస్తున్నవారు.. లైసెన్స్ తీసుకొని పత్రికలు ముద్రించిన వారు కూడా కూడా పీడీఎఫ్ లో రాజ్యమేలుతున్నారు.
ఫలితంగా కొన్ని రాష్ట్రాల్లో సమాచారశాఖ అధికారులు వద్ద చులకన అవ్వాల్సి వస్తున్నది. సాధారణంగా ఒక మీడియా సంస్థను రన్ చేయాలంటే సాధారణ విషయం కాదు. ఒక దిన పత్రికనే తీసుకుంటే ఒక చీఫ్ ఎడిటర్, ఇద్దరు సబ్ ఎడిటర్లు, ఒక పేజ్ డిజైనర్, ఒక ఫోటో గ్రాఫర్, కార్యాలయ సిబ్బంది, కార్యాలయం, ప్రింటర్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్, స్కానర్లు, రిపోర్టర్ల నెట్వర్క్, కొన్ని ప్రాంతాల్లో లేకపోతే న్యూస్ ఏజెన్సీల నెట్వర్క్ సహాయంతో పత్రికలు బయటకు తీయాల్సి వుంటుంది. అందులోనూ సొంతంగా ప్రింటింగ్ యూనిట్లు ఉంటే ఒకలా.. లేదంటే అద్దె ప్రింటింగ్ యూనిట్ల ద్వారా నైనా పత్రికలు ముద్రణ చేసుకొని మేము పత్రికలు రెగ్యులర్ గా బయటకు తీస్తున్నామని చెప్పుకోవాల్సి వచ్చినపుడు ముద్రించిన పత్రికలను సమాచారశాఖ కార్యాలయంలో అటెండెన్సుకి ఇవ్వాల్సి వస్తున్నది. ఇపుడు ఆర్ఎన్ఐ(పీఆర్జీఐ) కూడా ఒక్క అడుగు ముందుకి వేసి ఏరోజు పత్రిక ముద్రిస్తే ఆ రోజు పత్రికను ఆన్ లైన్ లో అప్లోడ్ చేయమని పత్రికలకు ఆర్డరు వేసింది. వాస్తవానికి ఆర్ఎన్ఐ వెబ్ సైట్ పూర్తిస్థాయిలో లేకపోయినా.. పత్రికల సౌలభ్యం కోసం దానిని అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం.
ఇదే సమయంలో ఇబ్బడి ముబ్బడిగా పత్రికలు రిజిస్ట్రేషన్లు చేసిన వారంతా వారు కూడా పత్రికలు రన్ చేస్తున్నామని చెప్పుకోవడానికి తయారు చేసిన పత్రికల పీడీఎఫ్ లతో హల్ చల్ చేస్తున్నారు. ప్రస్తుతం రాజకీయ నాయకులు, అధికారులు, ఇతర వర్గాలకు సమాచారం తక్షణమే రావడం, అది కూడా పత్రికలైతే పీడీఎఫ్ లు, టివి ఛానల్ అయితే యూట్యూబ్ లింక్, యాప్, వెబ్ సైట్, ఇలా అనేక సోషల్ మీడియా మార్గాల్లో సత్వరమే కోరుతున్నారు. దీనితో ఆర్ఎన్ఐ వద్ద రిజిస్ట్రేషన్లు చేసుకున్నవారంతా లైసెన్స్ నెంబర్లు పత్రికపైన వేసి పీడీఎఫ్ లతోనూ, ప్రధాన వార్తల క్లిప్పింగులతోనూ రాజ్యమేలుతున్నారు. వీరందరినీ కట్టడి చేయడానికి మీడియా గణన చేయడానికి ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా(పిఆర్జీఐ)(గతంలో ఆర్ఎన్ఐ-రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా గా ఉండేది) నడుంబిగించింది. ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్న పత్రికలు ముద్రణ చేస్తే 48 గంటల్లో వాటిని ఆన్ లైన్ ప్రెస్ సేవా పోర్టల్ లో అప్లోడ్ చేయాలి. అలా చేసిన పత్రికలనే పీఆర్జీఐ(ఆర్ఎన్ఐ) సక్రమంగా వచ్చే పత్రికలుగా గుర్తించాలని నిర్ణయించింది. దీనితో సక్రమంగా పత్రికలు నడుపుతున్నవారంతా పత్రిక ముద్రిస్తే ఆన్ లైన్ లో ఫోటో అప్లోడ్ చేస్తున్నారు. లేదంటే అలాగే వదిలేస్తున్నారు.
ఒక్కోసారి పీఆర్జీఐ వెబ్ సైట్ సాంకేతిక సమస్య ఎదురైతే వారికి మెయిల్స్ పెట్టి సమస్య పరిష్కారం అయిన తరువాతనైనా వాటిని రన్ చేస్తున్నారు. కానీ ఇవేమీ తెలియకుండా కేవలం గతంలో ఆర్ఎన్ఐ సర్టిఫికేట్ పొంది పత్రికలు నిర్వహణ చేయకుండా, అవసరం ఉన్నపుడు మాత్రమే బయటకు తీసేవారికి గత ఆర్ఎన్ఐ, ప్రస్తుతీ పీఆర్జీఐ లక్షణ రేఖ విధించినట్టుగానే బావించాలి. ఒక రకంగా ఇదే మీడియా గణన అధికారికంగా రూపాంతరం చెందే అవకాశాలు కూడా లేకపోలేదు. అపుడు సక్రమంగా పత్రికలు నడిపేవారి లైసెన్సులు మాత్రమే ఉంటాయని.. నిర్వహణ చేయని వారి లైసెన్సులు రద్దు అయ్యే అవకాశాలు లేకపోలేదని కూడా అధికార వర్గాలు చెబుతున్నాయి. తొలుత నిర్లక్ష్యం వహించే వారికి తొలుత అపరాద రుసుము విధించిన తరువాత. రెండవ చర్యగా లెసెన్సులు రద్దు చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తారట. కాగల కార్యం గందర్వులకెరుక. అదే సమయంలో రాష్ట్రసమాచారశాఖ కూడా రెగ్యులర్ గా వచ్చే పత్రికలకు గుర్తింపు ఇవ్వడం, రెగ్యులారిటీని చూడటం ప్రారంభిస్తే తద్వారా రాని రిజిస్ట్రేషన్ పత్రికలు నియంత్రణ ప్రారంభం అవుతుంది. ఆర్ఎన్ఐ మీడియా గణన ఫలితాలను ఇస్తుంది..!