సర్వభూపాల వాహనంపై ఉట్టి కృష్ణుడిగా..
Ens Balu
1
Tirumala
2020-10-19 21:12:21
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సోమవారం రాత్రి 7.00 గంటలకు శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహనంపై ఉట్టి కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు. కాగా బ్రహ్మోత్సవాలలో ఐదో రోజైన మంగళవారం ఉదయం 9 గంటలకు మోహినీ అవతారం, రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, ఈవో డా. కెఎస్.జవహర్రెడ్డి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, డా.నిశ్చిత, శ్రీ చిప్పగిరి ప్రసాద్, గోవిందహరి, డిపి.అనంత, కుమారగురు, రమేష్ శెట్టి, దుస్మంత కుమార్ దాస్, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ రమేష్రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.