ఇక మానవ వనరులశాఖ కాదు కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ


Ens Balu
6
New Delhi
2020-07-29 15:10:01

దేశవ్యాప్తంగా చదువును అందరికీ అందుబాటులోకి తెచ్చే విధంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలులోకి తీసుకురానున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో నూతన జాతీయ విద్యావిధానానికి ఆమోదం తెలిపింది. ఈమేరకు కేంద్రం మానవ వనరుల శాఖ పేరును విద్యా మంత్రిత్వశాఖగా మారుస్తూ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోక్రియల్ చెప్పారు. ఇందులో భాగంగా నాలుగు దశల్లో నూతన జాతీయ విద్యా విధానం అమలు చేస్తామన్న ఆయన 5+3+3+4 విధానంలో విద్యా విధానం అమలులోకి తీసుకువస్తామన్నారు. 3 నుంచి 18 ఏళ్ల వయసున్న వారికి ఉచిత, నిర్భంద విద్యను అందించడమే లక్ష్యంగా కేంద్రం నూతన విద్యా విధానంలో మార్పులు చేశామని వివరించారు. వాటికి అనుగుణంగా కొత్త విద్యా విధానంలో సిలబస్ ను మార్పు చేస్తూ, వృత్తి, ఉపాధి లభించే విధంగా నూతన విద్యా విధానం తయారు చేస్తామని చెప్పారు. నూతన విద్యా విధానంలో మొదటి ఐదేళ్లలో ఫౌండేషన్ కోర్సుగా, ఆ తరువాత మూడేళ్లను ప్రీ ప్రైమరీ స్కూల్ మరియు గ్రేడ్ 1, గ్రేడ్ 2గా పరిగణించాలని భావిస్తున్నట్టు మంత్రి వివరించారు. నూతన విద్యా విధానం కోసం ప్రతి రాష్ట్రంలోనూ రాష్ట్రస్థాయి స్కూల్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేయనున్నారు.