స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లు తెచ్చుకునేందుకు అనుమతి..
Ens Balu
1
Delhi
2020-08-03 17:09:36
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా వ్యాధిగ్రస్థులు తమ వెంట స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లు తెచ్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. వీటి సాయంతో వారు వీడియో సమావేశాల రూపంలో కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడుగలుగుతారని, తద్వారా మానసిక ఒత్తిడి నుంచి విముక్తి పొందగలుగుతారని తెలిపింది. ఈ మేరకు వైద్య సేవల డైరెక్టర్ జనరల్ రాజీవ్ గర్గ్ రాష్ట్రాల వైద్యశాఖల కార్యదర్శులకు లేఖలు రాశారు. ఆరోగ్య పరిస్థితితో పాటు రోగుల మానసిక పరిస్థితి కూడా గమనించేలా వైద్యులకు సూచనలు చేయాలని తెలిపారు. స్మార్ట్ ఫోన్లను తీసుకెళ్లడానికి కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు అనుమతి ఇవ్వకపోతుండడంతో ఆయన ఈ లేఖలు రాశారు. ఆసుపత్రుల్లో చేరిన కరోనా రోగుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేయడానికి భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)..నేషనల్ క్లినికల్ రిజిస్ట్రీని ఏర్పాటు చేసింది. దీంతో చికిత్స విధానాలు, ఏ మందు ప్రభావం ఏ వయసు వారిపై ఎలా ఉంది? తదితర అంశాలను సూక్ష్మంగా విశ్లేషించి అధ్యయనం చేయడానికి వీలు కలుగుతుంది. కరోనా లక్షణాలు ఇంకా స్పష్టంగా వెల్లడికానందున ఇలాంటి విశ్లేషణ ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దిల్లీ ఎయిమ్స్ సహా దేశంలోని 15 ప్రముఖ వైద్య విద్యా సంస్థలను, వంద ఆసుపత్రులను అనుసంధానం చేస్తూ ఈ రిజిస్ట్రీని నెలకొల్పారు.