భారత దేశవ్యాప్తంగా గుడికో గోమాత..
Ens Balu
3
విజయవాడ
2020-12-12 21:24:29
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశంతో హిందూ ధర్మాన్ని విస్తృత ప్రచారం చేయడంలో భాగంగా దేశవ్యాప్తంగా గుడికో గోమాత కార్యక్రమం నిర్వహించబోతున్నామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. పవిత్ర కార్తీక మాసంలో విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ఈ కార్యక్రమం ప్రారంభించామని, అలాగే తిరుపతి, విశాఖపట్నంలో కార్తీక దీపోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించామని ఆయన చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని శ్రీ బాలాత్రిపురసుందరి ఆలయానికి శనివారం ఆవు, దూడను అందించి గుడికో గోమాత కార్యక్రమాన్ని వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవును పూజిస్తే తల్లిని, ముక్కోటి దేవతలను పూజించినట్లేనని, అందుకే టిటిడి గుడికో గోమాత కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఆయన చెప్పారు. దేశంలో భక్తులు ఏ ఆలయానికి వెళ్లినా గోపూజ చేసుకునే ఏర్పాటు చేయడానికి టిటిడి సిద్ధంగా ఉందన్నారు.
దేశంలోని ఆలయాలు, పీఠాలు, వేద పాఠశాలలు ముందుకొస్తే టిటిడి గోవును అందిస్తుందని, వాటి రక్షణ, పోషణ మాత్రం వారే చూసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. త్వరలో కర్ణాటక, తమిళనాడులో గుడికో గోమాత కార్యక్రమాన్ని ప్రారంభించి దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో హిందూ ధర్మప్రచారంలో భాగంగా గిరిజన, దళిత, బలహీన, మత్స్యకారుల కాలనీల్లో హిందూ ధర్మప్రచార పరిషత్ ద్వారా 500 ఆలయాలు నిర్మించడానికి టిటిడి నిర్ణయం తీసుకుందని చెప్పారు. టిటిడి సామాన్య ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కరోనా నుంచి ప్రపంచ ప్రజలను కాపాడాలని శ్రీ వేంకటేశ్వరస్వామివారిని ప్రార్థిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా గత రెండేళ్లుగా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి స్వామివారి దర్శనం చేయిస్తున్నామని ఛైర్మన్ వివరించారు. ఈసారి 26 మంది పీఠాధిపతులు, మఠాధిపతులతో చర్చించి డిసెంబరు 25 నుంచి జనవరి 3వ తేదీ వరకు 10 రోజుల పాటు తిరుమల ఆలయ వైకుంఠ ద్వారం తెరిచి సామాన్య భక్తులకు దర్శనం కల్పించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అయితే, భక్తులు ఆన్లైన్ ద్వారా ముందుగా టికెట్ బుక్ చేసుకుని తిరుమలకు రావాలని, ఆన్లైన్లో టికెట్లు లభించని వారు తిరుపతిలో ముందుగా దర్శనం టికెట్లు పొందాలని సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. టిటిడి వెబ్సైట్ ద్వారా వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల కోసం లక్షలాది మంది ఆన్లైన్లో ఒకేసారి ప్రయత్నించడంతో సాంకేతిక ఇబ్బందులు వచ్చాయన్నారు. టిటిడి ఐటి విభాగం ఈ సమస్యను పరిష్కరించిందన్నారు. కరోనా వ్యాధి పూర్తిగా తొలగిపోయాక సమాచార కేంద్రాలను తిరిగి భక్తులకు అందుబాటులోకి తెచ్చి దర్శనం టికెట్ల బుకింగ్లో ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు.
రాష్ట్ర మంత్రులు కన్నబాబు, విశ్వరూప్, వేణుగోపాలకృష్ణ, ఎంపి వంగా గీత, శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, రాపాక వరప్రసాద్, పెండెం దొరబాబు, మాల కార్పొరేషన్ ఛైర్మన్ పెదపాటి అమ్మాజి, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ బందన హరి, బాలాత్రిపురసుందరి ఆలయ ఛైర్మన్ పెద్ది రత్నాజి పాల్గొన్నారు.