అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలం..
Ens Balu
2
Tirumala
2020-12-16 21:00:11
తిరుమల గిరుల్లోని ఆంజనాద్రి శ్రీ ఆంజనేయస్వామివారి జన్మ క్షేత్రమని పురాణాలు ముక్త కంఠంతో చేబుతున్నాయని పలువురు పండితులు టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డికి వివరించారు. దీనిపై విస్తృతంగా పరిశోధనలు జరిపి ఆధారాలతో నిరూపించాలని ఈవో పండితులను కోరారు. టిటిడి పరిపాలన భవనంలోని ఈవో కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఆయన పండితులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ కొన్ని దేవాలయాల స్థల పురాణాల ఆధారంగా వేరువేరు ప్రాంతాలను హనుమంతుని జన్మ స్థలంగా ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో పౌరాణిక, చారిత్రక, ఆచార వ్యవహార దృష్ఠితో ఆంజనేయస్వామివారు తిరుమలలో జన్మించారని పరిశోధించి నిరూపించడానికి పండితులతో ఒక కమిటి ఏర్పాటు చేశారు.
పురాణాల ఆధారంగా తిరుమల ఆంజనేయస్వామివారి జన్మ స్థలమని సమావేశంలో పాల్గొన్న పండితులు ఈవో దృష్ఠికి తీసుకువచ్చారు. ఆధునిక కాలంలో శ్రీవారి భక్తులందరికి ఆంజనాద్రిపై మరింత భక్తి విశ్వాసాలు ఏర్పడాలని ఈవో సూచించారు. ఆంజనేయస్వామివారి జన్మస్థలం తిరుమల అని నిరూపించడానికి తగిన సమాచారం సిద్ధం చేయవలసిందిగా ఆయన పండితులను కోరారు. స్కంధ పురాణం, వరాహ పురాణం, పద్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, భవిష్యోత్తర పురాణం, వెంకటాచల మహాత్యం మొదలైన పురాణాల్లో ఉన్న శ్లోకాలను పండితులు సమావేశంలో ప్రస్తావించారు. త్వరిత గతిన ఈ అంశాన్ని ఆధారాలతో సహా పరిష్కరించే ప్రయత్నం చేయాలని ఈవో అదనపు ఈవోకు సూచించారు. ఈ సమావేశంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య మురళీధర శర్మ, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు జె.రామక్రిష్ణ, శంకరనారాయణ, ఎస్వీ వేద ఆధ్యయన సంస్థ ప్రత్యేకాధికారి శ్రీ విభీషణ శర్మ పాల్గొన్నారు.