ప్రయాణీలకులంతా ఐఆర్‌సీటీసీ వైపే చూడాలి..


Ens Balu
2
New Delhi
2020-12-25 20:41:17

ఉత్తమ రైలు ప్రయాణం కోసం ప్రయాణీకులకు సమగ్ర సౌలభ్యాన్ని అందించేలా ఈ-టిక్కెటింగ్‌ వెబ్‌సైట్‌ ఉండాలని  రైల్వే శాఖ మంత్రి  పీయూష్‌ గోయల్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఐఆర్‌సీటీసీ ఈ-టిక్కెటింగ్‌ వ్యవస్థ ఆధునీకరణ పనులపై ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,  ప్రజల రైలు ప్రయాణ అవసరాలు తీర్చేలా ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ ఖరారు చేసుకునే అవకాశాన్ని రైల్వేలకు చెందిన ఐఆర్‌సీటీసీ అందించాలన్నారు.  టిక్కెట్ల బుకింగ్‌, ప్రయాణ సౌకర్యాల విషయంలో ప్రజా అనుభవాలను మెరుగుపరిచే అంశానికి 2014 నుంచి ప్రాధాన్యత పెరిగిందన్నారు. రైలు ప్రయాణం చేయాలనుకునేవారు మొదట ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ వైపే చూసేలా చేయాలన్న రైల్వే శాఖ మంత్రి, వారి అనుభవం స్నేహపూర్వకంగా, సౌకర్యవంతంగా ఉండాలని చెప్పారు. 'డిజిటల్‌ ఇండియా'లో భాగంగా, ఎంతోమంది ప్రజలు రైలు టిక్కెట్ల కోసం రిజర్వేషన్‌ కేంద్రాలకు వెళ్లకుండా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటున్నారని, అందువల్ల ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను ఆధునీకరించే ప్రయత్నాలను రెట్టింపు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వెబ్‌సైట్‌ పనితీరు మెరుగుదల కోసం సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేస్తామని రైల్వే అధికారులు  గోయల్‌కు వెల్లడించారు.