ప్రతి భారతీయుడికీ నేషనల్ హెల్త్ కార్డు: ప్రధాని మోడీ
Ens Balu
1
New Delhi
2020-08-15 21:07:07
74వ స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ దేశప్రజలకు ఆరోగ్య కానుక ప్రకటించారు. ఎర్రకోట వేదికగా ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్(ఎన్డీహెచ్ఎం)ను ప్రారంభించిన ఆయన దీని ద్వారా ప్రతి భారతీయుడికి ఒక ఐడీ నంబర్ను కేటాయించి హెల్త్ కార్డ్ ఇస్తామన్నారు. పూర్తిగా టెక్నాలజీ ఆధారితమైన ఈ మిషన్ వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు దోహదం చేస్తుందని ఆయన తెలిపారు. ప్రతి భారతీయుడి సమగ్ర వైద్యసమాచారం ఆ ఐడీ ద్వారా లభిస్తుందని వెల్లడించారు.‘దేశంలోని ప్రతి ఒక్కరికీ ఐడీ కార్డు లభిస్తుంది. వైద్యుడు లేదా ఫార్మసీకి వెళ్లిన ప్రతిసారి జాతీయ స్థాయిలో ఆ సమాచారం మొత్తం కార్డులో నిక్షిప్తమవుతుంది’ అని మోదీ వెల్లడించారు. ఈ ఎన్డీహెచ్ఎం.. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ పీఎం-జేఏవై) పరిధిలోకి వస్తుందని చెప్పారు. ఇది దేశంలో ఆరోగ్య సేవల సామర్థ్యం, పనితీరు, పారదర్శకతను గణనీయంగా మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. దీనికింద మారుమూల ప్రాంతాలకు కూడా టెలీ మెడిసిన్, ఈ- ఫార్మసీలు సేవలు అందనున్నాయి. అలాగే ఇతర ఆరోగ్య సంబంధ ప్రయోజనాలు పొందడానికి వీలు కలగనుంది.