10వ విడత అఖండ పారాయణం..
Ens Balu
4
Tirumala
2021-02-13 13:35:05
కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఫిబ్రవరి 21వ తేదీన 10వ విడత సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుండి సుందరకాండలోని 39వ సర్గ నుంచి 44వ సర్గ వరకు ఉన్న 188 శ్లోకాలను పారాయణం చేస్తారు. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, వేదపారాయణదారులతో పాటు సుమారు 200 మంది ఈ అఖండ పారాయణంలో పాల్గొంటారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రీవారి భక్తులు తమ ఇళ్లలోనే ఈ పారాయణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని టిటిడి కోరుతోంది. తిరుమలలో నిర్వహిస్తున్న సుందరనకాండ పారాయణం ఫిబ్రవరి 15వ తేదీ సోమవారానికి 250 రోజులు పూర్తి అవుతుంది. అంతేకాకుండా పవిత్ర మాఘమాసంను పురస్కరించుకొని ఫిబ్రవరి 14వ తేదీ ఆదివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో మాఘభాను పూజ జరుగనుంది.