పరమ శివుడికి కుంద కుసుమార్చన..
Ens Balu
2
Tirupati
2021-02-15 20:48:32
హిందూ ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం లోని ధ్యానారామంలో సోమవారం రాత్రి పరమశివుడికి కుంద కుసుమార్చన ( మల్లె పూలు) నిర్వహించారు. మాఘ మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ శాంతి, సమస్త మానవులకు మంచి జరగాలని పరమ శివుడిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు. వేద పండితులు ముందుగా లోక క్షేమం, శాంతిని కాంక్షిస్తూ గణపతి పూజ చేసి భక్తులతో కూడా సంకల్పం చేయించారు. మాఘ శుక్ల చతుర్థిని కుంద చతుర్థి అని కూడా పిలుస్తారని వేద పండితులు వివరించారు. ఈ రోజు పరమ శివుడిని మల్లె పూలతో అర్చిస్తే అఖండ ఐశ్వరం సిద్ధిస్తుందని కుంభ పురాణంలో పేర్కొన్నారని చెప్పారు. రుద్రాధ్యాయం లోని మంత్రాలు పఠిస్తూ షోడ సోపచార పూజ చేశారు. త్రిశత నామావళితో ఉమామహేశ్వరుడిని అర్చించారు. వివిధ దళాలు ( ఆకులు) తో పాటు మల్లె పూలతో అభిషేకించారు. అనంతరం స్వామివారికి నీరాజనం, నక్షత్ర హారతి ఇచ్చి, మంత్ర పుష్పం, క్షమా ప్రార్థన చేశారు. చివరగా శ్రీ ఉమామహేశ్వరునికి మంగళ హారతి ఇచ్చారు. శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి దంపతులు, శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం ఉప కులపతి ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ తో పాటు వేద పండితులు, అర్చకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.