జాతీయ అవార్డు విజయనగరం జిల్లాకే గర్వకారణం..
Ens Balu
3
Vizianagaram
2021-03-08 16:43:25
డెంకాడ మండలంలోని ఇందిరా స్వయం సహాయక సంఘం జాతీయ అవార్డుకు ఎంపికవటం పట్ల జిల్లా కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్ హర్షం వ్యక్తం చేశారు. ఆ సంఘం సాధించిన ఘనత జిల్లాకే గర్వకారణమని అభివర్ణించారు. సంఘ సభ్యులు చూపిన చొరవ, సాధించిన విజయం జిల్లా ప్రగతికి తలమాణికంగా నిలిచిందని పేర్కొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ అవార్డుకు ఎంపికైన ఇందిరా గ్రూపు సభ్యులను సోమవారం డీఆర్డీఏ కార్యాలయంలో సత్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ సభ్యులందరినీ అభినందించి శాలువాలతో, పష్పగుచ్ఛాలతో సత్కరించారు. ముందుగా ఢిల్లీ నుంచి ఆన్లైన్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి అవార్డుల లిస్టును ప్రకటించారు. జిల్లాకు చెందిన ఇందిరా గ్రూపు సభ్యుల బృంద చిత్రంతో పాటు, వారు సాధించిన ప్రగతి నివేదికలను డిస్ప్లే చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ డెంకాడ పొదుపు సంఘం సాధించిన విజయం జిల్లాలోని ఇతర మహిళల్లో విశ్వాసం నింపుతుందని పేర్కొన్నారు. దీన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా సంఘాల వారు కూడా విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సాంస్కృతిక, క్రీడల నగరంగా ఉన్న విజయనగరం జిల్లాను చదువుల నగరంగా మార్చడంలో మహిళా సంఘాలు కీలకపాత్ర పోషించాలని ఈ సందర్భంగా కోరారు. భవిష్యత్తులో చదువు లేని గ్రామం ఉండకూడదని తీర్మానించుకొని ముందుకు సాగాలని సూచించారు.
ఇన్ని అవార్డులు రావడానికి కారణం.. మహిళలే
జిల్లాకు ఇప్పటి వరకు 16 జాతీయ అవార్డులు వచ్చాయని.. ఇందిరా సంఘం సాధించిన దానితో 17 జాతీయ అవార్డులు జాబితాలో చేరాయన్నారు. మహిళల్లో ఉన్న పట్టుదలకి, ఏదైనా సాధించాలనే తపనకు ఈ అవార్డులు నిదర్శనమని అభివర్ణించారు. జిల్లాకు ఇన్ని అవార్డుల రావడానికి మహిళా అధికారులే కారణమని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో అత్యధికంగా మహిళా అధికారులు, సిబ్బంది ఉన్నారని చెప్పారు.
అనంతరం సంయక్త కలెక్టర్ జె.వెంకటరావు మాట్లాడారు. ఇది చాలా ఆనందదాయకమైన సంఘటన అని హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డు జిల్లాకు మరో కలికితురాయి అని పేర్కొన్నారు. కలెక్టర్ నాయకత్వంలో మహిళలు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. డీఆర్డీఏ పీడీ సుబ్బారావు, ఎస్.కోట ఏసీ జయశ్రీ, ఏపీడీ సావిత్ర మాట్లాడారు. అనంతరం ఇందిరా స్వయం సహాయక సంఘ సభ్యులను పూలమాలలతో, దుశ్సాలువాలతో సత్కరించారు. సంఘ సభ్యులను ఈ సందర్భంగా పలువురు అభినందించారు. కార్యక్రమంలో ఏపీడీ సావిత్రి, ఏసీలు జయశ్రీ, స్వర్ణకుమారి, ఏజీఏం, ఏపీఎంలు, సీసీలు, డీఆర్డీఏ, వెలుగు సిబ్బంది, వివిధ మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.