దాతల సహకారంతో చిన్నపిల్లల ఆసుపత్రి..
Ens Balu
3
Tirupati
2021-03-12 20:38:28
తిరుపతిలో అత్యాధునిక ప్రమాణాలతో ముంబాయికి చెందిన దాత ఉద్వేగ్ ఇన్ఫ్రాస్టెక్చర్ అండ్ కన్సల్టెన్సి ప్రైవెట్ లిమిటెడ్ (యు.ఐ.సి) ఆధ్వర్యంలో రూ.300 కోట్లతో చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించనుందని టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బరెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం ఉదయం ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి గారు, యు.ఐ.సి.సంస్థ సిఈవో , మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కె. సింగ్లు పరస్పర అవగాహన ఒప్పందంపై టిటిడి ఛైర్మన్ సమక్షంలో సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంరతం ఆంధ్ర ప్రదేశ్లో ప్రత్యేకంగా చిన్న పిల్లలకు ఉన్నత వైద్య సేవలు అందించేందుకు తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలలో చిన్న పిల్లల ఆసుపత్రులు నిర్మించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శ్రీవారి పాదాల చెంత తొలిసారిగా తిరుపతిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని టిటిడి ధర్మకర్తల మండలి తీర్మానించిందన్నారు. శ్రీవారి అనుగ్రహంతో ముంబాయికి చెందిన యు.ఐ.సి. సంస్థ అధినేత రూ.300 కోట్ల విరాళంతో చిన్న పిల్లల ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం యు.ఐ.సి. సంస్థ, టిటిడితో ఎమ్వోయు కుదుర్చుకున్నట్లు వివరించారు.
అనంతరం ఈవో మాట్లాడుతూ ఇప్పటికే విద్య, వైద్య రంగాలలో టిటిడి విశేష సేవలు అందిస్తున్నదన్నారు. తిరుపతిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేయనున్న చిన్న పిల్లల ఆసుపత్రి స్వీమ్స్కు అనుబంధంగా పని చేస్తుందని చెప్పారు. దాత శ్రీ సంజయ్ సింగ్ ఆసుపత్రి నిర్మాణంతో పాటు కొన్ని సంవత్సరాల పాటు నిర్వహణ భాధ్యతలు కూడా చూసుకోనున్నట్లు వివరించారు. త్వరలో ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్వేగ్ ఇన్ఫ్రాస్టెక్చర్ అండ్ కన్సల్టెన్సి ప్రైవెట్ లిమిటెడ్ సిఈవో మరియు మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కె. సింగ్ మాట్లాడుతూ, తిరుపతిలో చిన్న పిల్లల ఆస్పత్రి నిర్మించేందుకు శ్రీవారి ఆశీస్సులతో ప్రపంచ ప్రఖ్యాత హైందవ సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానంతో ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. చిన్న పిల్లలకు వైద్య సేవలందించేందుకు గొప్ప అవకాశంగా భావిస్తున్నామని చెప్పారు. ఇందుకు సహకారం అందించిన టిటిడి ఛైర్మన్, ఈవో, అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వీమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, టిటిడి ఎఫ్ఎ అండ్ సీఏవో బాలాజీ, సిఇ రమేష్రెడ్డి, డిఎల్వో రెడ్డప్పరెడ్డి, సిఎమ్వో డాక్టర్ నర్మద, ఇతర అధికారులు పాల్గొన్నారు.