శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఈనెల 14న అప్పన్న చందనోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అనువంశిక ధర్మకర్త సంచయిత గజపతి, ఈఓ సూర్యకళ, ఆలయ అధికారులు నిర్ణయించారు. కోవిడ్ ప్రభావం, దేశంలో పరిస్థితులు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ఎండోమెంట్ కమిషనర్ ఆదేశాలమేరకు చందనోత్సవం ఏకాంతంగానే నిర్వహించనున్నారు. భక్తుల సౌకర్యార్థం శ్రీస్వామివారి చందనోత్సవ ప్రత్యేక పూజను నిజరూప స్వామి ఎదురుగా నిర్వహించాలని నిర్ణయించారు. సంప్రదాయం ప్రకారం శ్రీ స్వామివారి చందనోత్సవం రోజున అంటే (14-05-21), వైశాఖ పౌర్ణమిరోజున, జ్యేష్ఠ పౌర్ణమిరోజున, ఆషాడ పౌర్ణమి రోజున మొత్తం నాలుగు విడతలుగా స్వామివారికి చందన సమర్పణ చేస్తారు. ఈ చందన సమర్పణలో భాగస్వాములు కావాల్సిన దాతలు విరాళాలను దేవస్థానం అకౌంట్ UPI ID:9491000635@SBI కుగానీ ఆన్ లైన్లో SBI అకౌంట్ నంబర్ 11257208642, IFCS code SBIN 0002795కు గాని భక్తులు విరాళాలు పంపించవచ్చని అధికారులు తెలియజేశారు. అర కేజీ చందనం సమర్పణకోసం రూ. 10,116 (పదివేల నూటపదహార్లు), కేజీ చందన సమర్పణకోసం రూ. 20,116(ఇరవైవేల నూటపదహార్లు) భక్తులు పై అకౌంట్ కు పంపించవచ్చునన్నారు. చందన సమర్పణకోసం డబ్బులు పంపాక తప్పకుండా దాని స్క్రీన్ షాట్ , ఫొటో తీసి , అడ్రస్ పంపాలని అధికారులు కోరారు. అరకేజీ చందనం సమర్పించేవారికి చందనం ముక్కలను ప్రసాదంగా పంపిస్తామని తెలిపారు. కేజీ చందనం సమర్పించినవారికి (రూ.20,116)అదనంగా స్వామివారి శేషవస్త్రం ముక్క కూడా పోస్టు ద్వారా పంపించనున్నట్టు వివరించారు. భక్తులు తమ విరాళాలను 13-05-21 (గురువారం) లోగా పంపించాలన్న అధికారులు ఎంత చందనాన్నైనా భక్తులు స్వామివారికి సమర్పించ వచ్చునని చెప్పారు. స్వామివారి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు వీక్షించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలియజేశారు.
విరాళములు రూ.1116 (వెయ్యి నూటపదహార్లు) శ్రీస్వామివారి చందనోత్సవ ప్రత్యేక పూజకు పంపిచే భక్తులు గోత్రనామములతో పూజలు జరపించబడును. ఈ విరాళాలు సర్పించిన వారు సైతం స్క్రీన్ షాట్, ఫొటో తీసి, అడ్రస్, గోత్రనామాలు పంపించాల్సి ఉంటుంది. భక్తులు ఈ అరుదైన, స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన చందనోత్సవంలో భాగస్వాములై, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆ స్వామివారి కృపకు పాత్రులు కాగలరని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.