కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మే 26న 14వ విడత సుందరకాండ అఖండ పారాయణం జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం 7 గంటల నుండి సుందరకాండలోని 58వ సర్గలో గల 167 శ్లోకాలను పారాయణం చేస్తారు. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, వేదపారాయణదారులతో పాటు సుమారు 200 మంది ఈ అఖండ పారాయణంలో పాల్గొంటారు. కాగా, సుందరకాండలో మొత్తం 68 సర్గల్లో 2,821 శ్లోకాలు ఉన్నాయి. వీటిని 16 విడతలుగా అఖండ పారాయణం చేయాలని టిటిడి సంకల్పించింది. ఇప్పటివరకు టిటిడి 13 విడతల్లో అఖండ పారాయణాన్ని విజయవంతంగా నిర్వహించింది. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఈ కార్యక్రమాన్ని ఉదయం 7 నుండి 9 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రీవారి భక్తులు తమ ఇళ్లలోనే ఈ పారాయణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని టిటిడి కోరుతోంది.