VMRDA బకాయి వడ్డీతో రీఫండ్‌ చేయండి..


Ens Balu
2
New Delhi
2021-06-24 15:33:51

విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ –గతంలో వుడాగా వ్యవహరించేవారు) ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 12ఏ కింద చారిటబుల్‌ సంస్థగా రిజిస్టర్‌ అయింది. గతంలో ఆదాయ పన్ను శాఖ ఈ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి 571 కోట్ల రూపాయలు ఐటీ బకాయిల కింద చెల్లించాల్సిందిగా డిమాండ్‌ నోట్‌ పంపించడంతో వుడా 219 కోట్ల రూపాయలు చెల్లించి దీనిని రిజిస్ట్రేషన్‌ రద్దును సవాలు చేస్తూ ఐటీ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించింది. దాదాపు ఎనిమిదేళ్ళ తర్వాత ట్రైబ్యునల్‌ వీఎంఆర్‌డీఏకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ రీజియన్ డెవలప్‌మెంట్‌ అథారిటీని ఐటీ చట్టంలోని సెక్షన్‌ 12ఏ ప్రకారం చారిటబుల్‌ సంస్థగానే పరిగణిస్తూ రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించాలని కూడా ట్రైబ్యునల్‌ 2020లో ఆదాయ పన్ను శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు  విజయసాయి రెడ్డి ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్‌కు వివరించారు. అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ తీర్పు నేపథ్యంలో గతంలో ఆదాయ పన్ను కింద వుడా చెల్లించిన 219 కోట్ల రూపాయలను వడ్డీతో సహా వీఎంఆర్‌డీఏకు రీఫండ్‌ చేసేలా తగిన ఆదేశాలు ఇవ్వవలసిందిగా ఆయన మంత్రిని కోరారు. ఈ రెండు విజ్ఞప్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి ఆయనకు హామీ ఇచ్చారు.