రాష్ట్రాలకు కరోనా థర్డ్‌ వేవ్‌ ముప్పు..


Ens Balu
4
New Delhi
2021-07-15 16:00:03

 కొవిడ్‌-19 థ‌ర్డ్ వేవ్ ముంచుకొస్తుంద‌న్న ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో రాష్ట్రాల‌కు కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కీల‌క సూచ‌న‌లుచేసింది. ఆరోగ్య మౌలిక స‌దుపాయాల‌ను మెరుగుపెర‌చాల‌ని, పిల్ల‌ల కోసం స‌రిప‌డా ప‌డ‌క‌ల‌ను అందుబాటులో ఉంచ‌డంతో పాటు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాల‌పై దృష్టి సారించాల‌ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల‌ను కోరింది. రూ 23,123 కోట్ల‌తో ఇటీవ‌ల ప్ర‌క‌టించిన భార‌త కొవిడ్‌-19 అత్య‌వ‌స‌ర స్పంద‌న, ఆరోగ్య వ్య‌వ‌స్ధ‌ల స‌న్న‌ద్ధ‌త ప్యాకేజ్ కింద చేసిన ఏర్పాట్ల‌ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం స‌మీక్షించింది. ఈ సంద‌ర్భంగా ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శులు అన్ని రాష్ట్రాల వైద్యాధికారుల‌తో సంప్ర‌దింపులు జ‌రిపింది. కొవిడ్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం, కాంటాక్టుల‌ను గుర్తించి చికిత్స చేయ‌డం, ఐసోలేట్ చేయ‌డం వంటి చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేయాల‌ని కోరింది. కీల‌క ఔష‌ధాలు, టెస్టింగ్ కిట్స్‌, పీపీఈ కిట్ల ల‌భ్య‌తను పెంపొందించుకోవాల‌ని కూడా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల‌ను కోరింది.