ధన ప్రాప్తికై అయోధ్యకాండ పారాయణం..
Ens Balu
4
Tirumala
2021-07-26 16:21:18
శ్రీవారి అనుగ్రహంతో సృష్టిలోని సకల జీవరాశులు సుభిక్షంగా ఉండాలని, సకల కార్యాలు సిద్ధించాలని కోరుతూ తిరుమల వసంత మండపంలో శ్రీమద్రామాయణ పారాయణ కార్యక్రమంలో భాగంగా రెండవ రోజైన సోమవారం ఉదయం అయోధ్య కాండ పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివసుబ్రమణ్య అవధాని మాట్లాడుతూ రామాయణంలోని అయోధ్యకాండ పారాయణం చేసిన, విన్న ప్రతి ఒక్కరికి ధన ప్రాప్తి కలుగుతుందని చెప్పారు. ఇందులో శ్రీరామచంద్రమూర్తి అందరికి ధనం, ధాన్యం, గోవులు, ఏనుగులు తదితర వాటిని దానం చేసినట్లు వివరించారు. అయోధ్యకాండలోని 32వ సర్గల్లో గల 45 శ్లోకాలను 16 మంది వేద పండితులు ఉదయం 8.30 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు పారాయణం చేశారు. అదేవిధంగా రాత్రి 7 గంటలకు పారాయణం చేయనున్నారు. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో మరో 16 మంది ఉపాసకులు ఉదయం, సాయంత్రం వేళల్లో హనుమంత, సీతాలక్ష్మణ సమేత శ్రీరాముని మూలమంత్రానుష్టానం, శాస్త్రోక్తంగా జప-తర్పణ-హోమాలు నిర్వహించారు.ఆగస్టు 23వ తేదీ వరకు 30 రోజుల పాటు ఈ పారాయణాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.