టిటిడి భ‌వ‌నాల స‌మాచారం కంప్యూటరీక‌ర‌ణ..


Ens Balu
4
Tirumala
2021-09-07 12:50:37

తిరుమ‌ల, తిరుప‌తిలోనే కాకుండా దేశ‌వ్యాప్తంగా టిటిడికి ఉన్న ప్ర‌తి భ‌వ‌నానికి సంబంధించిన స‌మ‌గ్ర స‌మాచారం కంప్యూట‌రీక‌ర‌ణ చేయాల‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో అంత‌ర్గ‌త ఆడిట్ స‌మీక్ష నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ భ‌వ‌నాల స‌క్ర‌మ నిర్వ‌హ‌ణ‌, ఆస్తులను ఏ ర‌కంగా సంరక్షించాలనే విష‌యాల‌పై మార్గ‌ద‌ర్శ‌కాలు త‌యారు చేయాల‌న్నారు. ఆడిట్‌లో ఆడిట్ క‌మాండింగ్ లాంగ్వేజ్‌, ఆఫ్‌సెట్ మానిట‌రింగ్ సాఫ్ట్‌వేర్ లాంటి అనేక కొత్త సాఫ్ట్‌వేర్‌లు వ‌చ్చాయ‌ని, వీటిమీద సిబ్బందికి త‌గిన శిక్ష‌ణ ఇవ్వాల‌ని సూచించారు. వైద్యాధికారుల‌తో మాట్లాడుతూ ఉద్యోగుల హెల్త్ ప్రొఫైల్స్ త్వ‌ర‌గా డిజిటైజ్ చేయాల‌ని ఆదేశించారు. ఆసుప‌త్రుల్లో బ‌యోమెడిక‌ల్ వ్య‌ర్థాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తొల‌గించేలా ఏర్పాట్లు చేయాల‌న్నారు. ఆసుప‌త్రుల్లో హాస్పీరామ సాఫ్ట్‌వేర్‌పై సిబ్బందికి శిక్ష‌ణ ఇవ్వాల‌న్నారు. టిటిడి విద్యాల‌యాల్లో చ‌దివే విద్యార్థుల‌కు వ్యాయామం కోసం ప్ర‌త్యేకంగా స‌మ‌యం కేటాయించాల‌ని, వీరిలో ఆధ్యాత్మిక‌త పెంచేలా శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని చెప్పారు. తిరుమ‌ల‌లో ఖాళీగా ఉన్న క్వార్ట‌ర్స్‌ను మ‌ర‌మ్మతులు చేసి వినియోగంలోకి తేవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

            శ్రీ‌వారి ఆల‌యంలో తులాభారం ద్వారా భ‌క్తులు స‌మ‌ర్పించే వివిధ ర‌కాల వ‌స్తువులు, ప‌దార్థాల‌ను ప్ర‌త్యేకంగా నిల్వ ఉంచేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఈవో సూచించారు. తిరుమ‌ల అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో భ‌క్తులకు వ‌డ్డించే అన్న‌ప్ర‌సాదం వృథాను పూర్తిగా అరిక‌ట్టాల‌న్నారు. ప్ర‌మాదాల నివార‌ణ‌కు ఫైర్ సేఫ్టీ ఆడిట్, ఎల‌క్ట్రిక‌ల్ ఆడిట్ ఏడాదికి రెండు సార్లు త‌ప్ప‌నిస‌రిగా చేయాల‌ని చెప్పారు. తిరుమ‌ల‌లో భ‌క్తుల అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టు ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న 10 గ్రాములు, 5 గ్రాముల బంగారు డాల‌ర్లతో పాటు  2 గ్రాముల బంగారు డాల‌ర్లు కూడా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. స్థానికాల‌యాల్లో అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టు ముడిసరుకులు వినియోగించేందుకు ఇఆర్‌పి(ఎంట‌ర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్‌) స్టాక్ రిజిస్ట‌ర్లు ప‌క్కాగా  న‌మోదు చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. టిటిడిలోని ప్ర‌తి విభాగం ఇఆర్‌పి అమ‌లు చేయాల‌ని, ఇందుకోసం అధికారుల‌కు అవ‌స‌ర‌మైతే శిక్ష‌ణ ఇవ్వాల‌ని ఆడిట్ విభాగం అధికారుల‌ను ఆదేశించారు.

           ప్ర‌ముఖ ఆడిట‌ర్ శ్రీ న‌ర‌సింహ‌మూర్తి, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో  స‌దా భార్గ‌వి, ఎఫ్ఏసిఏవో  ఓ.బాలాజి, చీఫ్ ఆడిట్ ఆఫీస‌ర్ శేష‌శైలేంద్ర‌, అద‌న‌పు ఎఫ్ఏసిఏవో ర‌విప్ర‌సాదు పాల్గొన్నారు.
సిఫార్సు