7నుంచి శ్రీవారిసాలకట్ల బ్రహ్మోత్సవాలు..
Ens Balu
8
Tirumala
2021-09-24 12:02:16
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబరు 7 నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తామని, ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డి చెప్పారు. ఈవో మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ మార్గదర్శకాల మేరకు ఈ బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తామన్నారు. ఇదివరకు ప్రకటించినట్టుగానే అంజనాద్రిలో హనుమాన్ జన్మస్థలాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. నూతనంగా బాణీలు కట్టిన అన్నమయ్య సంకీర్తనలకు విస్తృత ప్రచారం కల్పించేందుకు చర్యలు చేపట్టామని, ఇందులో భాగంగా అక్టోబరులో రాష్ట్రవ్యాప్తంగా యువతకు పోటీలు నిర్వహిస్తామని వెల్లడించారు. అక్టోబరు 24,25వ తేదీల్లో చిత్తూరు జిల్లాలోని యువతకు పోటీలు నిర్వహిస్తామని, తిరుపతిలోని ఎస్వీబీసీ స్టూడియోలో వీటిని రికార్డు చేస్తామని తెలిపారు. ఆ తరువాత అదనపు ఈవో, సివిఎస్వోతో కలిసి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఈవో పరిశీలించారు. ఆలయంలో భక్తుల ప్రవేశించే, వెలుపలికి వచ్చే క్యూలైన్లు, పారిశుద్ధ్యం, విద్యుత్ అలంకరణ ఏర్పాట్లు, సివిల్ పనులను తనిఖీ చేశారు. నిర్దేశిత సమయంలోపు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఈవో ఆదేశించారు. ఈవో వెంట చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఇఇలు జగన్మోహన్రెడ్డి, రవిశంకర్రెడ్డి, విజివో బాలిరెడ్డి తదితరులు ఉన్నారు.