అన్న‌మ‌య్య‌ సంకీర్త‌న‌ల‌పై నిరంత‌ర ప‌రిశోధ‌న‌లు..


Ens Balu
8
Tirumala
2021-09-24 12:17:19

పదకవితా పితామహుడు శ్రీతాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్త‌న‌ల‌పై నిరంత‌రం ప‌రిశోధ‌న‌లు నిర్వ‌హించేందుకు తిరుప‌తిలోని కేంద్రీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యంలో " అన్న‌మ‌య్య పీఠం " ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఈ విష‌య‌మై  సంస్కృత విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తితో చ‌ర్చించాల‌న్నారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శుక్ర‌వారం టిటిడి ధార్మిక ప్రాజెక్టుల‌పై ఈవో అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ డిజిటలైజేషన్ చేసిన అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల‌ను టిటిడి వెబ్‌సైట్‌లో ఉంచాల‌న్నారు. అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల‌కు విస్తృత ప్ర‌చారం క‌ల్పించేందుకు " అదివో అల్ల‌దివో "  కార్య‌క్ర‌మాన్ని ప‌టిష్టంగా నిర్వ‌హించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అన్న‌మ‌య్య‌, వెంగ‌మాంబ సంకీర్త‌న‌ల‌పై త్వ‌ర‌లో వ్యాస ర‌చ‌న‌, వక్తృత్వ, క్వీజ్ పోటీలు నిర్వ‌హించాల‌న్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ల‌భ్య‌మైన 14 వేల అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లకు అర్థ‌, తాత్ప‌ర్య విశేషాంశాల‌తో "  అన్న‌మ‌య్య సాహిత్య‌ లహ‌రి " పేరుతో భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకురావాల‌ని చెప్పారు.  అదేవిధంగా దాస సాహిత్యంలోని 5 నుండి 10 వేల దాస సంకీర్త‌న‌ల‌ను సేక‌రించేందుకు కృషి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. దాస సాహిత్య‌నికి విస్తృత ప్ర‌చారం క‌ల్పించేందుకు క‌ర్ణాట‌క‌లోని బెంగూళూరు విశ్వ‌విద్యాల‌యంతో ఒప్ప‌దం చేసుకోవాల‌ని సూచించారు. దాస సాహిత్య కీర్త‌న‌లు ప్ర‌చారం చేసేందుకు ఎస్వీబీసిలో ప్ర‌త్యేక టైం స్లాట్ కేటాయించాల‌న్నారు. ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు రికార్డు చేసిన 300 దాస సంకీర్త‌న‌ల‌తో "  దాస న‌మ‌నం "  పేరుతో క‌ర్ణాట‌క‌లో పాటల‌ పోటీలు నిర్వ‌హించాల‌ని ఈవో ఆదేశించారు. అనంత‌రం నాళాయిర దివ్యప్రబంధ ప్రాజెక్టు, ఆళ్వార్ దివ్య ప్ర‌బంధ ప్రాజెక్టు, ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టుల‌పై ఈవో స‌మీక్షించారు.  అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, ఎఫ్ఎ అండ్ సిఏవో  బాలాజి, టిటిడి ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రాం అధికారి  విజ‌య‌సార‌ధి, అన్న‌మాచార్య‌, వెంగ‌మాంబ ప్రాజెక్టుల సంచాల‌కులు ఆకెళ్ల విభీష‌ణ శ‌ర్మ‌, దాస‌సాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి  పి.ఆర్‌.ఆనంద తీర్థాచార్యులు ఈ స‌మీక్ష స‌మావేశంలో పాల్గొన్నారు.
సిఫార్సు