పీఐబీలో ఆంధ్రప్రదేశ్ కి నేటికి దక్కని చోటు..!
Ens Balu
9
New Delhi
2021-10-01 03:01:43
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నపుడు పీఐబీ(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) వెబ్ సైట్ లో హైదరాబాదుకి స్థానం ఉండేది. ఆ తరువాత రాష్ట్రం విడిపోయి పదేళ్లు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వ పీఐబి న్యూస్ వెబ్ సైట్ లో నేటికీ విభజన ఆంధ్రప్రదేశ్ చోటు సంపాదించలేకపోయింది. కాదు కాదు రాష్ట్ర అధికారుల వైఫల్యం వలన దేశ స్థాయిలో వచ్చే గౌరవం కోల్పోయింది. ఫలితంగా తెలంగాణ సీఎంఓ వార్తలు, కేంద్ర మంత్రులు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ లో పర్యటన చేసే సమయంలో చేసే పర్యటనలన్నీ న్యూడిల్లీ పీఐబీ పేరుతోనే వస్తున్నాయి తప్పితే.. అదే సమాచారం ఏపీ సీఎం, సీఎంఓకి మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దానికి కారణం కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ నిర్వహించే పీఐబీ న్యూస్ వెబ్ సైట్ లో ఆంధ్రప్రదేశ్ కి చోటు లేకపోవడమే. ఈ విషయమై నేటికీ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సీరియస్ గా స్పందించకపోవడమే దానికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి, సీఎం కార్యాలయంతోపాటు, ఇతర కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం అంతా పొందు పరిచి దేశవ్యాప్తంగా తెలియజేయాల్సి వుంది. అటు కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని పీఐబిలో చేర్చి.. అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన గౌరవమే ఆంధ్రప్రదేశ్ కి కూడా ఇవ్వాల్సి వున్నా ఆంధ్రప్రదేశ్ లోని రాష్ట్ర సమాచారశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మన రాష్ట్రానికి చోటు దక్కలేదు. పీఐబీలో ఆంధ్రప్రదేశ్ కి చోటు దక్కితే రాష్ట్రంలోని ప్రధాన మంత్రిత్వ శాఖల్లోని అంశాలను, అభివ్రుద్ధి కార్యక్రమాలను, జాతీయస్థాయి ప్రాజెక్టులను మనం తెలియజేయకుండానే దేశంలోని అన్ని రాష్ట్రాలు, ఐఏఎస్ అధికారులు పీఐబి న్యూస్ వెబ్ సైట్ ద్వారా వీక్షించే వీలుంటుంది. గతంలో టిడిపి హయాంలో ఆంధ్రప్రదేశ్ ని పీఐబీ వెబ్ సైట్ లో చేర్చి, ఏపీ సీఎంఓ దగ్గరే ప్రత్యేక కార్యాలయలయం ఏర్పాటు చేయాలని సూచించినా అది పలించలేదు. ఆ తరువాత కేంద్రం ఔట్ రీచ్ బ్యూరోలను ఏర్పాటు చేసినా.. అవి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అదేవిధంగా పీఐబీ కూడా రాష్ట్రంలోనీ మీడియా సంస్థలకు పీఐబీలో వచ్చిన వార్తల న్యూస్ లింకులనే షేర్ చేయడం విశేషం. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి సర్కారు కూడా పీఐబీలో ఏపీకి స్థానం సంపాదించలేకపోయింది. విశేషం ఏంటంటే రాష్ట్ర పీఐబీ కార్యాలయం విజయవాడలో ఉన్నప్పటికీ అందులో సీఎం, సీఎంఓకి చెందిన ముఖ్య సమాచారం మాత్రం అందులో కనిపించడం లేదు. దీనితో ఏపీ సమాచారశాఖకు, రాష్ట్రప్రభుత్వానికి పీఐబీ వెబ్ సైట్ లో ప్రాధాన్యత లేకుండా పోయింది. ఈ వెబ్ సైట్ లో రాష్ట్రాలకు చోటు దక్కడం ద్వారా రాష్ట్రంలో జరిగే అభివ్రుద్ధి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అధికారిక వర్గాలు, కేంద్రప్రభుత్వం చూసే వీలుంటుంది. ఈ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పీఐబీ వెబ్ సైట్ లో అధికారికంగా చోటు కల్పించాల్సిన బాధ్యత, దానికోసం కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా వుంది. లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ స్థాయిలో చేపట్టే పోలవరం లాంటి ప్రాజెక్టులు, గ్రామ సచివాలయ వ్యవస్థ లాంటి ప్రభుత్వ శాఖల పనితీరు కేంద్ర స్థాయిలో అన్ని రాష్ట్రప్రభుత్వాలకి తెలియజేసే అవకాశం ఉండదు. ఆంధ్రప్రదేశ్ కంటే చిన్న 12 రాష్టాలకు పీఐబీలో చోటు ఉండటాన్ని ఇప్పటికైనా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఏపీ ప్రభుత్వం, ముఖ్య సలహాదారులు గుర్తించాల్సిన అవసరం ఆశన్నమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ నియమించిన ప్రభుత్వ సలహాదారుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ కి కేంద్రప్రభుత్వ పీఐబీలో స్థానం కల్పించే విషయంలో చొరవ తీసుకోలేదు. నేడో రేపో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వున్న ఆదిత్యనాధ్ దాస్ సైతం మరో ఏపీ ప్రభుత్వ సలహాదారుగా డిల్లీ కేంద్రంగా పని ప్రారంభించనున్నారు. కనీసం ఇప్పటికైనా రాష్ట్రానికి పీఐబీలో దక్కాల్సిన చోటు విషయమై ద్రుష్టిపెట్టకపోతే వచ్చే రెండున్నరేళ్లు, పరిపాలన, రాజకీయాలు తప్పా ఇలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకొని, అమలు చేసే తీరిక రాష్ట్రప్రభుత్వానికి కూడా ఉండకపోవచ్చు. చూడాలి ఏం జరుగుతుందనేది..!