చిన్న‌శేష వాహ‌నంపై గీతా కృష్ణుగా శ్రీ మ‌ల‌య‌ప్ప‌..


Ens Balu
3
Tirumala
2021-10-08 07:26:55

శ్రీవారి వార్షిక‌ బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శుక్ర‌వారం ఉద‌యం 9 నుంచి 10 గంట‌ల వ‌రకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై నెమ‌లి పింఛం, పిల్ల‌న‌గ్రోవి ధ‌రించి గీతా కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకి(నాగ‌లోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే కుటుంబ శ్రేయ‌స్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో బ్ర‌హ్మ‌ర‌థం, వృష‌భ‌, అశ్వ‌, ఏనుగుల‌దే అగ్ర‌స్థానం. కానీ కోవిడ్ - 19 కార‌ణంగా ఆల‌యంలోని క‌ల్యాణ‌మండ‌పంలో స్వామివారి వాహ‌న‌సేవ‌లు ఏకాంతంగా జ‌రుగుతున్న విష‌యం విదిత‌మే. శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణ‌మండ‌పంలో న‌మూనా బ్ర‌హ్మ‌ర‌థం, వృష‌భాలు, అశ్వాలు, ఏనుగుల సెట్టింగులు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తున్నాయి. ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టిటిడి ఛైర్మ‌న్  వై.వి.సుబ్బారెడ్డి దంప‌తులు, ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు  ప్ర‌శాంతి రెడ్డి,  స‌న‌త్‌కుమార్‌, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు,  సివిఎస్వో గోపినాథ్ జెట్టి దంప‌తులు, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వ‌ర‌రావు, విజివో బాలిరెడ్డి, ఆల‌‌య డెప్యూటీ ఈవో  ర‌మేష్‌బాబు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

సిఫార్సు