బ‌కాసుర‌వ‌ధ‌ అలంకారంలో శ్రీ‌ మలయప్ప..


Ens Balu
7
Tirumala
2021-10-09 15:50:45

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శ‌నివారం రాత్రి 7 గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ‌ మండ‌పంలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు బ‌కాసుర‌వ‌ధ‌  అలంకారంలో ముత్య‌పుపందిరి వాహనంపై దర్శనమిచ్చారు. ముత్యాల నిర్మలకాంతులు వ్యాపించడానికి, ఆ కాంతులు దర్శించి భక్తులు ముక్తులు కావడానికి రాత్రి వేళ అనుకూలం. అందుకే శ్రీమలయప్పకు మూడో రోజు రాత్రి మొదటియామంలో ముత్యాల పందిరిలో కూర్చొని విహరించే కైంకర్యాన్ని పెద్దలు నిర్ణయించారు. ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి ఆత్మ ఎన్నో జన్మల అనంతరం విశ్వలోకాల నుండి రాలి, దుర్లభమైన మానవజన్మను సంతరించుకుంటుంది. శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణచక్రం నుండి విడుదలై మోక్షాన్ని పొందుతుంది. ఇలా స్వామివారికి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు - రత్నాల వల్ల కలిగే వేడిమినీ, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇముడ్చుకుని, స్వామివారి వక్షఃస్థలానికి, అక్కడి లక్ష్మీదేవికి సమశీతోష్ణస్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్ని, ప్రశాంతతను చేకూరుస్తున్నాయి. వాహనసేవల‌లో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ న‌ర‌సింహ‌న్‌, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి  వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌, ఈవో డాక్ట‌ర్‌ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు  ప్ర‌శాంతి రెడ్డి,  సనత్ కుమార్, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి దంపతులు, విజివో  బాలిరెడ్డి, ఆల‌‌య డెప్యూటీ ఈవో  ర‌మేష్‌బాబు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

        కాగా, బ్రహ్మోత్సవాలలో నాలుగో రోజైన ఆదివారం ఉదయం 9 గంటలకు క‌ల్ప‌వృక్ష వాహనం, రాత్రి 7 గంటలకు స‌ర్వ‌భూపాల‌ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు.
సిఫార్సు