శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన ఆదివారం ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి శ్రీ రాజమన్నార్ అలంకారంలో చంద్రకోలు, దండం ధరించి కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చారు. క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం శ్రీవారు దర్శనమిచ్చారు. వాహనసేవలలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వై.వి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు ప్రశాంతి రెడ్డి, సనత్ కుమార్, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి దంపతులు, సివిఎస్వో గోపినాథ్ జెట్టి దంపతులు, విజివో బాలిరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో రమేష్బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రాత్రి 7 నుంచి 8 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు అభయమిస్తారు.