శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు మంగళవారం ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు వేంకటాద్రిరాముని అలంకారంలో దర్శనమిచ్చారు. హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది. వాహనసేవలలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు ప్రశాంతి రెడ్డి, విజివో బాలిరెడ్డి, ఆలయ డెప్యూటి ఈవో రమేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
కాగా, సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు స్వర్ణరథం బదులుగా సర్వభూపాల వాహనసేవ జరుగుతుంది. రాత్రి 7 గంటలకు గజవాహనంపై శ్రీమలయప్పస్వామివారు కటాక్షిస్తారు.