శోభాయమానంగా స్నపన తిరుమంజనం..
Ens Balu
5
Tirumala
2021-10-13 15:25:44
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిసారిగా పటికబెల్లం, కివిపండ్లు, ఎరువు పవిత్రమాలలతో ప్రత్యేకంగా రూపొందించిన మాలలు, కిరీటాలతో స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో బుధవారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేదమంత్రాల నడుమ కంకణభట్టార్ శ్రీ వాసుదేవ భట్టాచార్యులు ఈ కార్యక్రమం నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన స్నపన తిరుమంజనంలో కురువేరు, తెల్లపట్టు, రంగురంగుల ఎండుఫలాలు, వట్టివేరు, పసుపు రోజామాలలను శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి అలంకరించారు. వేదపండితులు శ్రీసూక్తం, భూసూక్తం, పురుష సూక్తం, నీలా సూక్తం, నారాయణసూక్తాలను పఠిస్తుండగా అర్చకస్వాములు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేపట్టారు. తిరుపూర్ కు చెందిన దాత రాజేందర్ సహకారంతో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక మాలలు, కిరీటాలు, హైదరాబాద్కు చెందిన శ్రీనివాస్, శ్రీధర్ సహకారంతో రంగనాయకుల మండపం అలంకరణ చేశామని టిటిడి ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి దంపతులు, అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు ప్రశాంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శోభాయమానంగా సాగిన ఈ స్నపన తిరుమంజనాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.