తిరుమలలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం..
Ens Balu
5
Tirumala
2021-11-04 09:31:24
తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, టిటిడి ఉన్నతాధికారుల సమక్షంలో ఆగమోక్తంగా ఆస్థాన వేడుకను బంగారువాకిలి చెంత నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా 'దీపావళి ఆస్థానాన్ని' టిటిడి శాస్త్రోక్తంగా నిర్వహించిట్లు తెలిపారు. బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ విష్వక్సేనుల వారి ఉత్సవ మూర్తులను గరుడాళ్వారు సన్నిధిలో అభిముఖంగా ఉంచి ఆస్థానం నిర్వహించిట్లు వివరించారు. శ్రీవారి ఆశీస్సులతో కరోనాను అంతం చేసి, ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఈవో ఆకాంక్షించారు. అంతకుముందు ఆలయంలో నూతన పట్టు వస్త్ర సమర్పణను మూలవిరాట్టు మరియు దేవతా ఉత్సవమూర్తులకు ధరింపజేసి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని, ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. ఈ ఆస్థానంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీర్ స్వామి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి, సివిఎస్వో గోపీనాథ్ జెట్టి, విజివో బాలిరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో రమేష్బాబు, పేష్కార్ శ్రీహరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.