తిరుమలలో శ్రీవారి భక్తులకు సామాన్య దర్శనం చేయించడానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని టిటిడి తెలియజేస్తోంది. తిరుపతిలో కోవిడ్ వ్యాప్తి అదుపులోకి వచ్చి పరిస్థితులు మెరుగుపడ్డాక సర్వదర్శనం టోకెన్ల జారీని పునరుద్ధరిస్తామని వెల్లడించింది. తిరుపతిలోని కౌంటర్ల ద్వారా రోజుకు 3 వేల సర్వదర్శనం టోకెన్లు ఇవ్వడానికి టిటిడి అన్ని ఏర్పాట్లు చేసింది. తిరుపతిలో కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందువల్ల మొదటిసారి టోకెన్ల జారీని నిలిపివేయడం జరిగింది. ఇప్పుడు పెరటాసి మాసం రద్దీ దృష్ట్యా టికెట్ల జారీని తాత్కాలికంగా నిలుపుదల చేసింది. తిరుపతిలో రోజుకు 3 వేల సర్వదర్శనం టోకెన్లు ఇచ్చే ఏర్పాట్లు చేయగా, తమిళ నాడు నుంచి 10 వేల నుండి 12 వేల మంది భక్తులు క్యూలైన్ల దగ్గరకు వచ్చి తిరుపతిలో కోవిడ్ వ్యాప్తి పెరిగిపోయే ప్రమాదముందని కొందరు ప్రజాప్రతినిధులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేయడంతో సర్వదర్శనం టోకెన్లు తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. అయితే రద్దు చేసిన 3 వేల సర్వదర్శనం టోకెన్ల కోటాను ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కేటాయించడం జరిగింది. అంతేగానీ, సామాన్య భక్తులపై టిటిడికి ఎలాంటి ఇతర ఆలోచనా లేదు. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు తీసుకున్నవారికి కూడా సర్వదర్శనమే జరుగుతోంది కానీ మరొకటి కాదు. భక్తులు ఈ విషయాన్ని గుర్తించాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.
ప్రపంచంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై శనివారం ఉదయం జరిగిన సుందరకాండలోని 12వ సర్గ నుంచి 14వ సర్గ వరకు ఉన్న 146 శ్లోకాలను దాదాపు 200 మంది వేద పండితులు అఖండ పారాయణం, శ్రీరామ నామ స్మరణతో తిరుమలగిరులు పులకిం చాయి. ఈ సందర్భంగా రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య మురళిధర్ శర్మ మాట్లాడుతూ వాల్మీకి మహర్షి రచించిన రామయణంలోని సుందరకాండ పారాయణాన్నిటిటిడి అద్భుతంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రోజు ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారంలో కోట్లాది మంది ప్రజలు ఈ కార్యక్రమాన్ని వీక్షించి పాల్గొంటున్నట్లు తెలిపారు. శ్రీవారి అనుగ్రహం వలన త్వరలో కరోనా వైరస్ నశించి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. సుందరకాండ పారాయణం కార్యక్రమం నిర్వహిస్తున్న తిరుమల ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివసుబ్రమణ్య అవధాని మాట్లాడుతూ ప్రపంచ ప్రజల యోగ క్షేమం కొరకు టిటిడి 156 రోజులుగా శ్రీవారి అనుగ్రహంతో మంత్ర పారాయణ కార్యక్రమం నిర్వహస్తున్నట్లు తెలిపారు. సుందరకాండ పారాయణంలో 94వ రోజైన శనివారం 12వ సర్గ నుంచి 14వ సర్గ వరకు ఉన్న 146 శ్లోకాలను 4వ విడత అఖండ పారాయణం నిర్వహించామన్నారు.
అఖండ పారాయణంలో భాగంగా జూలై 7 నమొదటి పర్యాయం ప్రథమసర్గలోని 211 శ్లోకాలను, ఆగష్టు 6 న 2వ పర్యాయం ద్వితీయ సర్గ నుంచి సప్తమ సర్గ వరకు ఉన్న మొత్తం 227 శ్లోకాలను, ఆగస్టు 27 న 3వ పర్యాయం అష్టమ సర్గ నుంచి ఏకాదశః సర్గ వరకు ఉన్న మొత్తం 182 శ్లోకాలను పారాయణం చేసినట్లు తెలిపారు. కాగా టిటిడి ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీమతి వందన బృందం ప్రసిద్ధ త్యాగరాజ పంచరత్న కృతులు " జగదానందకారక.... జయ జనాకి ప్రాణ నాయక......" అనే సంకీర్తనతో కార్యక్రమం ప్రారంభమైంది. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ బి.రఘునాథ్ బృందం అందించిన హనుమాన్ భజన్తో కార్యక్రమం ముగిసింది. అఖండ పారాయణంలోని 12వ సర్గ నుంచి 14వ సర్గ వరకు ఉన్న 146 శ్లోకాలను శ్రీ కుప్పా శివసుబ్రమణ్య అవధానితో కలిసి శ్రీ పవన్కుమార్ శర్మ, శ్రీ శేషాచార్యులు పారాయణం చేశారు. ఈ పారాయణంలో ధర్మగిరి వేద పాఠశాల, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేద అధ్యాయన సంస్థకు చెందిన వేద పారాయణ దారులు, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంకు చెందిన శాస్త్రీయ పండితులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి, వైఖానస ఆగమ సలహాదారు మోహన రంగచార్యులు, ఎస్వీబీసీ సిఈవో సురేష్ కుమార్, శ్రీవారి ఆలయ ఒఎస్డీ పాల శేషాద్రి, ఎస్వీ వేద ఉన్నత వేద అధ్యాయన సంస్థ ప్రత్యేకాధికారి విభీషణ శర్మ పాల్గొన్నారు.
ఉత్తరాంధ్రా ప్రజల కల్పవల్లి, కోరిన కోర్కెలు తీర్చే చల్లని తల్లి శ్రీశ్రీశ్రీ పైడి తల్లి అమ్మవారి జాతర తేదీలు అధికారులు ప్రకటిం చారు. ఈ మేరకు అక్టోబర్ 2న మండల దీక్షలు ప్రారంభం మరియు పందిరి రాట వేస్తారు, అక్టోబర్ 22 న అర్ధ మండల దీక్షలు ప్రారంభం అవుతాయి, అక్టోబర్ 26 న అమ్మవారి తోలేళ్ల ఉత్సవం నిర్వహిస్తారు, 27న అమ్మవారి ఉత్సవంలో ప్రధాన ఘట్టం సిరిమనోత్సవం జరుగుతుంది, నవంబర్ 3న తెప్పోత్సవం, నవంబర్ 10 న ఉయ్యాల కాంబల ఉత్సవం, నవంబరు11 న చండీహోమం నిర్వహించిన తరువాత అమ్మవారి ఉత్సవాలు ముగుస్తాయి. అయితే ఈ ఏడాది కోవిడ్ 19 ను ద్రుష్టిలో ఉంచుకొని దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా కేసులు అధికంగా వున్న సమయంలో ప్రజలు అమ్మవారి ఉత్సవంలో కూడా నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. ఈమేరకు మరోసారి జిల్లా అధికారులు నిబంధనలు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి...
రాష్ట్రంలో అక్కాచెల్లెళ్ల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంచేశారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ‘వైఎస్సార్ ఆసరా’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ఎన్నికల నాటికి ఉన్న రుణాలన్నీ చెల్లిస్తామని హామీ ఇచ్చామని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈ పథకాన్ని ప్రారంభించామని అన్నారు. 87 లక్షల మంది మహిళలకు రూ.27వేల కోట్ల రుణాలున్నాయన్న సీఎం నాలుగు విడతల్లో ‘వైఎస్సార్ ఆసరా’ పథకం ద్వారా వాటిని చెల్లిస్తున్నామని చెప్పారు. తొలివిడతలో రూ.6,792.20 కోట్లు జమ చేస్తున్నామని చెప్పారు. పీఅండ్జీ, హెచ్యూ ఎల్ లాంటి మల్టీనేషనల్ కంపెనీల ద్వారా మహిళలకు చేయూతనిస్తామని, పసిపిల్లల నుంచి ముసలవ్వల వరకూ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వివరిం చారు. తల్లి, బిడ్డలకు పౌష్టికాహారం అందించేలా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్, ఆరేళ్ల పిల్లల నుంచి ఇంటర్ విద్యార్థుల చదువుల కోసం అమ్మఒడి అమలు చేస్తున్నామని, అమ్మఒడి ద్వారా 82 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి కలుగుతుందని చెప్పారు. 30 లక్షల మంది అక్కాచెల్లెమ్మలకు ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం వైఎస్ జగన్ చెబుతూనే... కొంతమంది కావాలనే ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని అయినప్పటికీ త్వరలోనే ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. మహిళల రక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చామని, మద్యాన్ని నియంత్రించేందుకు 43వేల బెల్ట్షాపులు తొలగించామని పేర్కొన్నారు. 4,380 పర్మిట్ రూమ్లను రద్దు చేశాం. 33శాతం మద్యం షాపులు తగ్గించామని వెల్లడించారు సీఎం జగన్ తెలిపారు.
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారానే ప్రజలకు పూర్తిస్థాయిలో ప్రజలకు సౌకర్యాలు అందించాలని ప్రభుత్వం సేవలన్నీ వీటికిందకు తీసుకొస్తుంది. మీసేవాల్లో అందించే సేవలకేంటే అధికంగా ఇక్కడ ప్రజలకు అందించడం ద్వారా ఎవరూ మండల కేంద్రానికి వెళ్లే పనిలేకుండా చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం ఈమేరకు అన్ని గ్రామవార్డు, సచివాలయాల్లో నవంబరు నాటికి అన్ని ఖాళీలను భర్తీ చేయడంతోపాటు సేవలన్నీ ఒకే గొడుగు కిందికి తీసుకు వచ్చి ప్రజలకు అన్ని సేవలు ఒకే చోట అందించాలని ప్రభుత్వం చూస్తుంది. ఇందులో భాగంగానే రెవిన్యూ సేవలతోపాటు, ట్రాన్స్ పోర్టు సేవలను కూడా ప్రభుత్వం గ్రామసచివాలయాకు అందజేసింది. మరికొద్ది రోజుల్లోనే ఆరోగ్యసేవలు విలేజ్ క్లినిక్ ల ద్వారా అందించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. వ్యవసాయ సేవలకోసం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం పూర్తిగా అక్కడి నుంచే గ్రామస్థాయిలోనే సేవలను మరింతగా రైతులకు చేరువ చేయాలని యోచిస్తోంది. ఏ పనికావాలన్నా ప్రజలు సచివాలయాన్నే సంప్రదించాలనే విధంగా ప్రభుత్వం చాలా పెద్ద ప్రణాళికతోనే ముందుకు వెళుతుంది. అయితే ప్రస్తుతం వున్న డిజిటిల్ అసిస్టెంట్లతో ఇన్ని సేవలు ఎలా అందిస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారినప్పటికీ, సచివాలయ సిబ్బంది మొత్తాన్ని కార్యాలయాల్లోనే వుంచి సంబంధిత పనులను శాఖల వారీగా చేయించాలని ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రస్తుతం సాధారణంగా నడుస్తున్న సచివాలయాలు పూర్తిస్థాయి ప్రభుత్వ కార్యాలయాలుగా త్వరలోనే మారబోతున్నాయి.
చిత్తూరు జిల్లాలోని కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి హుండీ ఆదాయం 41 లక్షల 38వేల 796 రూపాయలు వచ్చినట్టు ఈఓ వెంకటేశు తెలియజేశారు. గురువారం ఈ మేరకు 24 రోజుల యొక్క హుండీ లెక్కింపు చేపట్టినట్టు వివరించారు. ఇందులో బంగారం-38.గ్రాములు, వెండి-258.గ్రాములు , బంగారు రథం ద్వారా వచ్చిన ఆదాయం - 83,191, అన్నదానం ద్వారా రూ. 1785, ప్రచార రథం ద్వారా 3077, బిక్షడి హుండి ద్వారా 7,946, ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఈవో వివరించారు. ఈ హుండీ లెక్కింపు లో దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ కస్తూరి, ఏఈఓలు చిట్టెమ్మ, రవీంద్ర బాబు, విద్యాసాగర్ రెడ్డి,హరి మాధవరెడ్డి, సి ఎఫ్ ఓ -బి,యన్ నాగేశ్వరరావు, పర్యవేక్షకులు ప్రసాద్, శ్రీధర్ బాబు, వెంకటేశ్వర్లు, బ్యాంకు , ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక నేరాలకు పాల్పడే సంస్థలపై కేసుల దర్యాప్తు సత్వరమే పూర్తి చేసి బాధితులకు నాయ్యమందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు. 19వ స్టేట్ లెవల్ కో ఆర్డినేషన్ కమిటీ వర్చువల్ సమావేశం సీఎస్ అధ్యక్షతన సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఆమె కార్యాలయంలో గురువారం జరిగింది. ఆ సందర్భంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ మాట్లాడుతూ, 19వ స్టేట్ లెవల్ కో ఆర్డినేషన్ కమిటీ ఉద్దేశాన్ని వివరించారు. అనంతరం సీఎస్ నీలం సాహ్ని మాట్లాడుతూ, ఈ ఏడాది జనవరి 29న జరిగిన 18 వ స్టేట్ లెవల్ కో ఆర్డినేషన్ కమిటీలో తీసుకున్న నిర్ణయాల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన పలు సంస్థల కేసులు ఏ యే దశల్లో ఉన్నాయో ఆరా తీశారు. ప్రజల కష్టాన్ని దోచుకునే సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అదే సమయంలో బాధితులకు తక్షణ పరిష్కారం చూపాలన్నారు. మోసాలకు పాల్పడక ముందే, ఏర్పాటైన చిట్ ఫండ్, ఫైనాన్స్ సంస్థలు ఆర్బీఐ నిబంధనలకు లోబడి ఉన్నాయా...? సంస్థల కార్యకలాపాల నిర్వహణకు అనుమతులు ఉన్నాయా..? అని గుర్తించాలన్నారు. అగ్రి గోల్డ్, అక్షయ్ గోల్డ్, అభయ్ గోల్డ్, హీరా గ్రూప్, కపిల్ గ్రూప్, సహారా సహా పలు సంస్థలపై వివిధ కోర్టుల్లో ఉన్న కేసుల వివరాలను సీఎస్ కు సిఐడి, పోలీసు అధికారులు వివరించారు. ఎక్కువ కేసులు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి నగరాల్లో నమోదవుతున్నట్లు సీఎస్ దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. ఎక్కువ వడ్డీల పేరుతో ప్రజల కష్టాన్ని దోచుకుంటున్న ఆర్థిక సంస్థలపై కేసులు దర్యాప్తు సత్వరమే పూర్తి చేసి, బాధితులకు న్యాయమందించాలని సీఎస్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్.రావత్, కార్యదర్శి సునీత, ఆర్బీఐ ఏపీ, తెలంగాణ రీజనల్ డైరెక్టర్ సుబ్రతా దాస్, సీఐడీ, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రవాణాశాఖ లో పరిపాలన కేంద్రీకరణలో భాగంగా సులభమైన విధానంలో పౌరసేవల అందించేందుకు అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని 440 పట్టణ సచివాలయాలు, 845 గ్రామ సచివాలయాలలోనూ రవాణాశాఖ అందించే వివిధ సేవలను ప్రజలకు చేరువ చేయనుంది. ఇందులో భాంగా రవాణాశాఖ ప్రధానంగా నిర్వహించే డ్రైవింగ్ లైసెస్సుల జారీ, వాహనదారుల రిజిస్ట్రేషన్లు, రవాణాశాఖ పన్నులు, వాహనముల పర్మిట్లకు సంబంధించిన 4 విభాగాల్లోని 56 సేవలను వారి ఉన్న ప్రాంతాలలోని సచివాలయ సిబ్బందిని సంప్రదించి సేవలను పొందే అవకాశం వుంటుంది.. ఇందుకోసం గ్రామ,వార్డు సచివాలయంలో ఉండే డిజిటల్ అసిస్టెంట్లు, సంక్షేమ సహాయ కార్యదర్శలను నియమించడం జరిగిందన్నారు. తద్వారా ప్రజలకు వారు ఉన్న ప్రాంతాల్లో రవాణాశాఖ అందించే సేవలు అందించడంతో పాటు దళారి వ్యవస్థను కట్టడికి సాధ్యమవుతుందని రవాణాశాఖ భావిస్తోంది. ముఖ్యంగా ఏజెంట్లు ప్రైవేటు వ్యక్తుల జోక్యం తగ్గిపోవడంతోపాటు, ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది. రవాణాశాఖ ద్వారా క్షేత్రస్థాయిలో వివిధ సేవలను ప్రజలకు అందించే దిశలో ప్రతి జిల్లా నుండి నలుగురు చొప్పున 13 జిల్లాల నుంచి వచ్చిన వారికి మాస్టర్ ట్రైనీర్స్ ఎంపిక చేసి ఇప్పటికీ రాష్ట్ర స్థాయిలో సాంకేతిక విధానంపై శిక్షణ అందిస్తారు. శిక్షణ పొందిన మాస్టర్ శిక్షకులు జిల్లాలలోకి వెళ్లి ప్రణాళిక ప్రకారం మిగతా సిబ్బందికి శిక్షణనిస్తూ గ్రామ, వార్డు సచివాలయ డిజిటల్, సంక్షేమ సహాయ కార్యదర్శిల ఆధ్వర్యంలో రవాణాశాఖ సేవలు అందిస్తారు. గ్రామ, వార్డు సచివాలయం అందించే రవాణాశాఖ సేవలను పూర్తిస్థాయిలో ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్న రవాణా శాఖ దళారులను, మధ్యవర్తులను ఆశ్రహించవద్దని ప్రజలను చైతన్యం చేస్తుంది...
రాష్ట్రంలోని సుమారు 90 లక్షల మంది డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూర్చే వైయస్ ఆర్ ఆసరా పథకం ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. సీఎం వైయస జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం (11 వ తేదీ) ప్రారంభిస్తారన్నారు. ఈ ప్రారంభోత్సవంలో గ్రామ సచివాల యాలు, రైతు భరోసా కేంద్రాల వద్ద చేసినట్లుగానే అన్ని మున్సిపల్ కార్యాలయాల ముందు, వార్డు సెక్రటేరియట్ ల నుంచి ప్రజలు వర్ట్యుయల్ విధానంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి వెల్లడించారు. మెప్మా మిషన్ డైరక్టర్ విజయలక్ష్మి తదితర ఉన్నతాధికారులతో గురువారం సాయంత్రం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసే వరుస క్రమంలో వైయస్ఆర్ ఆసరా పథకానికి ఒక విశిష్టత ఉందన్నారు. . ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహనరెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం లో చేపడుతున్న సంక్షేమ, పథకాల్లో ఇది మరో ముందడుగన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 88 లక్షల మంది డ్వాక్రా మహిళలకు అందుతున్న రూ.6792 కోట్లలో , పట్టణ ప్రాంతాల్లో సుమారు 15 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ.1186 కోట్ల మేర ఆర్ధిక సహాయం అందనున్నదని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. ఇంతటి ప్రత్యేకత ఉన్నందున, కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ, ఈ కార్యక్రమంలో పట్టణ ప్రాంతాల్లోని డ్వాక్రా సభ్యులదరూ పాల్గొనేలా వార్డు సెక్రటేరియట్ ల వద్ద, అన్ని మున్సిపల్ కార్యాలయాల వద్ద ప్రత్యేకంగా టీవీలు, స్క్రీన్ల ను ఏర్పాటు చేసినట్లు అధికారులు ఈ సందర్భంగా వివరించారు. అంతే కాకుండా ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనలేని వారు కూడా తమ ఇళ్ల నుంచే మొబైల్ ఫోన్ల ద్వారా పాల్గొనేలా అందరికీ , కార్యక్రమానికి సంబంధించిన లింక్ ను పంపుతున్నట్లు వారు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో కలికితురాయి వంటి ఆసరా పథకం ప్రారంభోత్సవంలో ప్రజలందరూ వర్ట్యుయల్ విధానంలో హాజరై , సంక్షేమ ప్రభుత్వానికి బాసటగా నిలవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో తమ జోక్యం ఉండబోదని మరోసారి కేంద్రం స్పష్టం చేసింది. గురువారం ఈ మేరకు ఏపీ హైకోర్టులో కేంద్ర హోంశాఖ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని పేర్కొన్న కేంద్రం సెక్షన్ 13 ప్రకారం రాజధాని అంటే ఒకటికే పరిమితం కావాలని కాదని వివరించింది. 2018లో అప్పటి ప్రభుత్వం అమరావతిలో హైకోర్టు ఏర్పాటు చేసిందని, అంత మాత్రాన హైకోర్టు ఉంటేనే అమరావతినే రాజధాని అని చెప్పలేమని స్పష్టం చేసింది. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయం అని కేంద్రం తెలిపింది. దీంతో మూడు రాజధానుల విషయంలో కోర్టుకెక్కిన వారికి కేంద్రం పూర్తి క్లారిటీ ఇచ్చినట్టు అయ్యింది. రాష్ట్రంలో ప్రధాన ప్రాంతాలు, ఇప్పటి వరకూ అభివ్రుద్ధికి నోచుకోని ప్రాంతాలను అభివ్రుద్ధి చేయాలనే లక్ష్యంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడు రాజధానులను ప్రవేశపెట్టింది. కాగా ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టుకి వెళ్లడంతోపాటు, అమరావతిలో ఆందోళనలు కూడా చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఇచ్చిన క్లారిటీతోపాటు, కోర్టుకి దాఖలు చేసిన అఫడవిట్ మూడు రాజధానుల విషక్ష్ం కేంద్రానికి కాకుండా రాష్ట్ర పరిధిలోనిదేనని తేల్చి చెప్పింది.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 19 నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయని టిటిడి ప్రకటించింది. ఈ మేరకు సెప్టెంబరు 18న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సెప్టెంబరు 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా, భక్తులకు, టిటిడి ఉద్యోగులకు ఈ వ్యాధి వ్యాపించకుండా నివారించేందుకు ఈ బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. ఈ ఉత్సవాల్లో విశేషంగా..సెప్టెంబరు 19న - ధ్వజారోహణం, సెప్టెంబరు 23న - గరుడసేవ, సెప్టెంబరు 24న - స్వర్ణరథోత్సవం(సర్వభూపాల వాహనం), సెప్టెంబరు 26న - రథోత్సవం(సర్వభూపాల వాహనం) ,సెప్టెంబరు 27న - చక్రస్నానం, ధ్వజావరోహణం నిర్వహిస్తారు. అంతేకాకుండా ఈ కార్యక్రమాలన్నీ కోవిడ్-19 నిబంధనల నేపథ్యంలో సెప్టెంబరు 24న స్వర్ణరథోత్సవం, సెప్టెంబరు 26న రథోత్సవం ఉండని కారణంగా ఈ రెండు రోజుల్లో సర్వభూపాల వాహనంపై శ్రీవారు ఉభయదేవేరులతో కలిసి వేంచేపు చేస్తారు.
వై.ఎస్.ఆర్. ఆసరా కార్యక్రమం ఈ నెల 11న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. బుధవారం ఈమేరకు విజయవాడ నుంచి మునిసిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి జె.శ్యామల రావు , సి.డి.ఎం.ఎ.విజయకుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో తిరుపతి నగరపాలక సంస్థ నుంచి కమిషనర్ గిరీషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వైఎస్సార్ ఆసరా కార్యక్రమాన్ని పండుగవాతావరణంలో నిర్వహించాలని సూచించారు. స్వచ్ సర్వేక్షన్ లో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాకులు సాధించడం సంతోషకరమన్నారు. ర్యాంకులు సాధించిన ప్రతిఒక్కరికి పేరుపేరునా అభినందనలు తెలిపారు. ర్యాంకులు తృటిలో తప్పిన వారు మరోసారి ర్యాంకు సాధించేందుకు కృషి చేయాలన్నారు. ర్యాంకులు సాధించిన ఆయా కమిషనర్ లను ముఖ్యమంత్రి త్వరలోనే స్వయంగా అభినందిస్తారన్నారన్నారు. పాదయాత్రలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు పేదలను ఆదుకునేందుకు ఈ వై.ఎస్.ఆర్ . ఆసరా, చేయూత కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతి సచివాలయం వద్ద టి.వి.లు ఏర్పాటు చేసి లైవ్ టెలికాస్ట్ చేయాలన్నారు. ప్రతి చోటా ప్రజాప్రతినిధులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలన్నారు. వారం రోజులు పాటు ఈ కార్యక్రమం నిర్వహించేలా తగు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా మాట్లాడుతూ, వై.ఎస్.ఆర్. ఆసరా కు సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. వారందరికీ 11 ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం సందర్భంగా 3160 స్వయం సహాయక సంఘాలకు మొదటి విడతగా 30.84 కోట్ల రూపాయలు సంఘాల ఖాతాల్లో జమ చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అర్థమయ్యేలా మా సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారన్నారు. తిరుపతిలోని 50 డివిజన్లలో వారం రోజులు పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. వై.ఎస్.ఆర్. ఆసరా, చేయూత కార్యక్రమాలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. సమావేశం అనంతరం 11న చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించి, పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కమిషనర్ హరిత, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ చంద్రశేఖర్, మునిసిపల్ ఇంజినీర్ వెంకట్రామిరెడ్డి, మేనేజర్ హాసిమ్, వైద్యాధికారిని సుధారాణి, రెవిన్యూ ఆఫీసర్ గాలి సుధాకర్, శానిటరీ సూపరువైజర్స్ గోవర్ధన్, చెంచెయ్య, మెప్మా రమణ, తదితరులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆన్లైన్ కల్యాణోత్సవ సేవకు భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది. కరోనా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో భక్తులు నేరుగా కల్యాణోత్సవంలో పాల్గొనే అవకాశం లేకపోవడంతో భక్తుల కోరిక మేరకు ఆగస్టు 7న ఈ సేవను టిటిడి ప్రారంభించింది. అప్పటినుండి సెప్టెంబరు 7వ తేదీ వరకు నెల రోజుల్లో 8,330 టికెట్లను భక్తులు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. ఆగస్టు 15వ తేదీన అత్యధికంగా 1,012 టికెట్లను భక్తులు బుక్ చేసుకుని ఆన్లైన్ సేవలో పాల్గొన్నారు. ఈ సేవలో పాల్గొన్న గృహస్తులకు ఉత్తరీయం, రవిక, అక్షింతలు, కలకండ ప్రసాదాన్ని తపాలా శాఖ ద్వారా వారి చిరునామాకు టిటిడి పంపుతోంది. ఆన్లైన్ కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులు(ఇద్దరు) టికెట్ బుక్ చేసుకున్న తేదీ నుంచి 90 రోజుల్లోపు శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని టిటిడి కల్పించింది. వీరికి సుపథం ప్రవేశమార్గం ద్వారా ఉచితంగా శ్రీవారి దర్శనం కల్పిస్తారు. ఈ అవకాశాన్ని ఆన్లైన్ కల్యాణోత్సవంలో పాల్గొన్న గృహస్తులు వినియోగించుకోవాలని టిటిడి కోరుతోంది.