విజయనగరం జిల్లాకు జల సంరక్షణలో జాతీయ జల అవార్డు వరించింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ దేశరాజధాని న్యూఢిల్లీలోని విజ్ఞానభవన్లో బుధవారం ఘనంగా నిర్వహించిన 2వ జాతీయ జల అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి చేతులమీదుగా వర్చువల్ విధానంలో విజయనగరం జిల్లాకు ఈ పురస్కారాన్ని ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ జల సంరక్షణ ప్రతీఒక్క పౌరుడి బాధ్యత అని స్పష్టం చేశారు. మానవ మనుగడకు నీరే మూలాధారమని అన్నారు. మన జీవన విధానంలో జలసంరక్షణ ఒక భాగం కావాలని ఆయన కోరారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీని ప్రాధాన్యతను గుర్తించి 2004 నుంచి జల సంరక్షణ ఉద్యమాలు దేశవ్యాప్తంగా మొదలయ్యాయని చెప్పారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ప్రధాన విధుల్లో ప్రకృతి వనరుల సంరక్షణ కూడా ఒకటని పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో నీటి వనరుల సంరక్షణపై విస్తృత ప్రచారం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. దీనిలో స్వచ్ఛంద సంస్థలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పరిశ్రమలు, వ్యవసాయ కార్యక్రమాల విస్తరణ కారణంగా క్రమంగా నీటి వినియోగం కూడా పెరుగుతోందని చెప్పారు. 2050 నాటికి కేవలం త్రాగునీటి అవసరాలకే అందుబాటులో ఉన్న జలాల్లో సుమారు 18శాతం వినియోగింపబడుతుందని తెలిపారు. నీటి దుర్వినియోగాన్ని తగ్గించడం, నీటి పునర్ వినియోగాన్ని పెంచడం, జల సంరక్షణ చర్యలను భారీఎత్తున చేపట్టడం ద్వారా నీటి వనరులను భవిష్యత్ తరాలకోసం సంరక్షించవచ్చని సూచించారు. జలశక్తి అభియాన్ కార్యక్రమం ద్వారా నీటి సంరక్షణకు దేశవ్యాప్తంగా చర్యలను చేపట్టడం జరిగిందని చెప్పారు. ప్రకృతి వనరులను సంరక్షించుకోవడం మన విధి అని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, సామాజిక న్యాయశాఖామంత్రి రతన్లాల్ కఠారియా, కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి యుపి సింగ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్ ఆడిటోరియంలో లైవ్టెలికాస్ట్ ద్వారా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్లాల్, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జి.సి.కిశోర్కుమార్, జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు, డిఆర్ఓ ఎం.గణపతిరావు, వివిధ శాఖల అధికారులు తిలకించారు. ఈ ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును జిల్లాకు సాధించిపెట్టినందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్లాల్ను అధికారులు, సిబ్బంది అభినందనలతో ముంచెత్తారు. దుశ్శాలువలతో సత్కరించి, శుభాకాంక్షలు చెప్పారు.
జిల్లా ప్రజలకు అంకితం ః కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్లాల్
అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ జలపురస్కారాన్ని ఏస్పిరేషన్ జిల్లాగా విజయనగరం గెలుచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్లాల్ అన్నారు. ఈ అవార్డును జిల్లా ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. జిల్లా ప్రజల భాగస్వామ్యంతోనే ఈ అవార్డును సాధించగలిగామని ఆయన స్పష్టం చేశారు. పెద్దచెరువు శుద్దితోపాటు, జిల్లా వ్యాప్తంగా వందలాది చెరువులను సంరక్షించడానికి ఒక ఉద్యమ స్ఫూర్తితో, ప్రణాళికా బద్దంగా, సమిష్టిగా ముందడుగు వేశామని తెలిపారు. దాని ఫలితమే ఈ అవార్డు అని ఆయన పేర్కొన్నారు. తాము మొదటి నుంచీ మూడు అంశాలకు ప్రాధాన్యతనిస్తూ, డొనేట్ రెడ్ (రక్తదానం), స్ప్రెడ్ గ్రీన్(పచ్చదనాన్ని పెంచడం), సేవ్ బ్లూ(నీటి వనరుల సంరక్షణ) నినాదాలను ప్రజల్లోకి తీసుకువెళ్లామని చెప్పారు. వ్యవసాయాధారిత జిల్లా కావడంతో, నీటి సంరక్షణకు ఎక్కువ చర్యలను తీసుకున్నామన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలైన గ్రామీణ ఉపాధిహామీ తదితర పథకాల్లో కూడా ఒకవైపు పనిని కల్పించడమే కాకుండా మరోవైపు ఆస్తుల సృష్టికి, ప్రకృతి వనరుల పరిరక్షణకు బహుముఖ వ్యూహంతో కృషి చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
ఎవ్వరూ బాధపడొద్దు..కంటనీరు పెట్టొద్దు..ఎవరు బాధపడినా నేను ఒప్పుకోను...ఆయన దేశం కోసం ప్రాణాలు అర్పించారు.. ఆయన దేశరక్షకుడు..దేశాన్ని రక్షించాడు...నాకు రక్షణ లేకపోయినా పర్లేదు..దేశాన్ని కాపాడితే చాలు..ఆయన సంతోషంగా, ప్రశాంతంగా భూమాత ఒడిలోకి వెళ్లాలి అంటూ భర్త శవపేటిక పై పడి తన భాధను దిగమింగుకొంది...ఈ మాటలు అన్నది ఎవరో కాదు వీరజవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి భార్య..గుండెలు పిండేస్తూ..దేశభక్తిని చాటిన ఆమె మాటలు భారతీయుడిగా గర్వపడేలా చేస్తూ...ఆమెకు భర్తపోయిన బాధను మరింత రెట్టింపు చేశాయి.. అయినా ఒక్క కన్నీటి బొట్టు నేలరాల్చకుండా భర్త పార్ధీవ శరీరాన్ని స్మశానానికి సాగనంపింది ఆ వీరవని..ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.. దేశ సరిహాద్దుల్లో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో వీర మరణం పొందిన తెలుగు రాష్ట్రాల జవాన్ల పార్థివదేహాలు స్వగ్రామానికి చేరుకున్నాయి. వీర జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్థివదేహం చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లికి చేరుకుంది. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత అధికార లాంఛనాలతో జవాన్ అంత్యక్రియలు నిర్వహించారు. జవాన్కు నివాళులర్పించేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని కోమన్ పల్లి గ్రామానికి బుధవారం తెల్లవారుజామున మహేష్ భౌతికకాయాన్ని ఆర్మీ అధికారులు తీసుకువచ్చారు. మహేష్ పార్థీవదేహాన్ని చూసి ఆయన భార్య, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఉదయం 10 గంంటలకు సైనిక లాంఛనాలతో మహేశ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, తొలుత బోయిన్పల్లికి చేరుకున్న వీర జవాన్ మహేష్ మృతదేహానికి ఎమ్మెల్సీ కవిత నివాళులర్పించారు.
కేంద్ర ప్రభుత్వం ఇన్నేళ్లకు సరైన నిర్ణయం తీసుకుంది..యూట్యూబు ఛానల్స్ ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న తరుణంలో కేంద్రం నియంత్రణ దిశగా అడుగులు వేసింది. సమాచార ప్రసార శాఖ నియంత్రణలోకి డిజిటల్ కంటెంట్ ను చేర్చుతూ నిర్ణయం తీసుకుంది తద్వారా ఎవరైనా యూట్యూబు ఛానల్ పెట్టాలంటే ఇకపై కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పని సరి, దానికి సంబంధించి త్వరలోనే విధి విధానాలు కూడా రాబోతున్నాయి. అసలు యూట్యూబు ఛానల్ ఏర్పాటు చేయాలనంటే ఏమేమి అనుమతులు కావాలనే విషయమపై నిర్ధిష్ట ఆదేశాలతో కూడి, పరిమితులు, అనుమతుల చిట్టాను కేంద్రం విడుదల చేయనున్నది.. అంతేకాదు ఇక ఆన్లైన్ న్యూస్ పోర్టల్స్పై ప్రభుత్వ కన్నువేయనుంది. ఎవరుపడితే వారు యూట్యూబ్ ఛానల్స్ పెట్టేందుకు నో ఛాన్స్ అంటూ లక్ష్మణ రేఖ వేదించిన కేంద్రం పక్కాగా యూట్యూబ్ ఛానల్స్ ను నియంత్రించే దిశగా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఆన్లైన్ న్యూస్ పోర్టల్స్, కంటెంట్ అందించే సంస్థలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకువస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. వీటిని సమాచార, ప్రసార శాఖ పరిధిలోకి తీసువస్తూ తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్పై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సోమవారం సంతకం చేశారు. దీంతో నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ తదితర పలు సంస్థలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి చేరినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పటివరకూ డిజిటల్ కంటెంట్ను నియంత్రించేందుకు ఎలాంటి చట్టాలు లేదా స్వతంత్ర ప్రతిపత్తిగల అధికారిక సంస్థ ఏర్పాటుకాని నేపథ్యంలో తాజా ఆదేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. కాగా ఇప్పటి వరకూ ప్రస్తుతం ప్రింట్ మీడియాను ప్రెస్ కౌన్సిల్ నియంత్రిస్తోంది. ఇదేవిధంగా వార్తా ప్రసార చానళ్లను న్యూస్ బ్రాడ్ క్యాస్టర్స్ అసోసియేషన్(ఎన్బీఏ) మానిటర్ చేస్తోంది. సినిమాల విషయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ)కి అధికారాలుండగా.. ప్రకటనలకు సంబంధించి అడ్వర్టయిజింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియంత్రణ బాధ్యతలు చూస్తోంది. అదే సమయంలో ఓటీటీ ప్లాట్ఫామ్స్ నియంత్రణపై దాఖలైన పిటిషన్పై విచారణలో భాగంగా గత నెలలో సుప్రీం కోర్టు.. కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాలను కోరింది. స్వతంత్ర సంస్థ ద్వారా ఓటీటీ ప్లాట్ఫామ్స్ను నియంత్రించే అంశంపై కేంద్రం, సమాచార ప్రసార శాఖ, దేశీ ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్స్కు సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఓటీటీ ప్లాట్ఫామ్స్ పరిధిలో న్యూస్ పోర్టల్స్తోపాటు.. హాట్స్టార్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో తదితర స్ట్రీమింగ్ సర్వీసుల సంస్థలు వస్తాయి. వీటిని ఇంటర్నెట్ లేదా ఆపరేటర్ల నెట్వర్క్ ద్వారా వీక్షించేందుకు వీలుంటుంది. కాగా.. ఓటీటీ లేదా వివిధ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఫిల్ములు, సిరీస్ల తయారీదారులు సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్లు పొందకుండానే కంటెంట్ను విడుదల చేస్తున్నట్లు పిటిషన్లో ఫిర్యాదుదారు పేర్కొన్నారు. దీంతో కేంద్రం తీసుకున్న నిర్ణయం చాలా మందికి గొంతులో పచ్చి వెలక్కాయ్ పడినట్టు అయ్యింది. ఇకపై అనుమతులతోపాటు, ఇతర వ్యవహారాలు పూర్తిచేసి యూట్యూబు ఛానల్ పెట్టాలంటే చాలా ఖర్చు కానుంది...
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఉప ఎన్నికలో టిఆర్ఎస్ గడ్డపై బీజేపీ సంచలన విజయం నమోదైంది. నువ్వా నేనా అన్న విధంగా సాగిన పోరులో అనూహ్య రీతిలో బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు విజయం సాధించారు. నరాలు తెగే ఉత్కంఠ నడమ సాగిన కౌంటింగ్లో చివరి నాలుగు రౌండ్లలో బీజేపీ ఆధిక్యం కనబర్చి టీఆర్ఎస్ కంచుకోటలో తొలిసారి కాషాయ జెండా ఎగరేసింది. టీ-20 మ్యాచ్లా సాగిన పోరులో మొదటి పది రౌండ్స్లో బీజేపీ పూర్తిస్థాయి ఆధిక్యం కనబర్చగా.. అనుహ్యంగా పుంజుకున్న టీఆర్ఎస్ 11 నుంచి 20 రౌండ్ వరకు ఆధిక్యంలోకి దూసుకొచ్చి బీజేపీకి సవాలు విసిరింది.ఓ సమయంలో టీఆర్ఎస్ విజయం ఖాయమనే రీతిలో ఆధిక్యం కనబర్చింది. అయితే పడిలేచిన కెరటంలా చివరి నాలుగు రౌండ్స్లో బీజేపీ లీడ్లోకి వచ్చి.. ఉత్కంఠకు తెరదించింది. 20వ రౌండ్లో బీజేపీకి 491 ఓట్లు, 21వ రౌండ్లో 380 ఓట్ల ఆధిక్యం లభించింది. దుబ్బాక విజయంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఒక రకంగా తొడగొట్టి సవాల్ చేసిన వారందరికీ ఈ గెలుపు ఒక సమాధానం అయింది. అంతేకాకుండా ఎగ్జిట్ పోల్స్ సైతం ఈ ఎన్నికతో తుస్సుమన్నాయి...
ఆంధ్రప్రదేశ్ కి రేషన్ బియ్యం సబ్సిడీ కింద చెల్లించాల్సిన 1,728 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు వి.విజయసాయి రెడ్డి కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పియూష్ గోయల్ను కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రికి లేఖ రాశారు. ప్రజా పంపిణీకి వినియోగించే బియ్యం కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం కొంత సొమ్మును సబ్సిడీ కింద రాష్ట్ర పౌర సరఫరాల శాఖ (ఏపీ సివిల్ సప్లైస్ కార్పోరేషన్)కు చెల్లిస్తుంది. ఆ విధంగా చెల్లించాల్సిన మొత్తాల్లో ఇంకా 1,728 కోట్ల రూపాయల మేర బకాయి మిగిలిఉంది. ఈ మొత్తాన్ని త్వరితగతిన విడుదల చేసి 2020-21 ఖరీఫ్ సీజన్లో రైతులకు కనీస మద్దతు ధర చెల్లింపుకు సహకరించాలని విజయసాయి రెడ్డి లేఖలో మంత్రికి విజ్ఞప్తి చేశారు. బియ్యం సబ్సిడీ కింద కేంద్ర ప్రభుత్వం ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్కు విడుదల చేయాల్సిన బకాయిలు 2.498 కోట్ల రూపాయలకు చేరడంతో గత ఫిబ్రవరి 21న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ ద్వారా ఈ బకాయిల విషయం ప్రధానమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రధాని ఆదేశాలతో గత మార్చి 5న కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ కొంత మొత్తం విడుదల చేసినప్పటికీ ఇంకా 1,728 కోట్ల రూపాయల బకాయిలు మిగిలి ఉన్నాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ బకాయిలను త్వరితగతిన విడుదల చేయవలసిందిగా కోరుతూ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ఏప్రిల్ 1న మరోసారి ప్రధాన మంత్రికి లేఖ రాసిన విషయాన్ని విజయసాయి రెడ్డి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. బియ్యం సబ్సిడీ బకాయిలు త్వరగా విడుదల చేయడం వలన రైతులకు సకాలంలో కనీస మద్దతు చెల్లింపులతోపాటు స్వయం సహాయ బృందాలు, సహకార సంఘాలను ఆర్థిక వత్తిళ్ళ నుంచి కాపాడవచ్చునని వివరించారు. అలాగే 2020-21 ఖరీఫ్ సీజన్కు తగిన ఏర్పాట్లు చేసుకోవడంలో రైతులకు సాయపడవచ్చునని విజయసాయి రెడ్డి తన లేఖలో మంత్రికి వివరిస్తూ సాధ్యమైనంత త్వరగా బియ్యం బకాయిల విడుదలకు చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.
మెగాస్టార్ చిరంజీవి కరోనా పాజిటివ్ రావడంతో ఆ టెన్షన్ తెలంగాణ సీఎం కెసిఆర్, హీరో నాగార్జున లో కూడా మొదలైంది. ఈ నెల 7న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో సినీ ఇండస్ట్రీ అభివృద్ధితో పాటు సినీరంగ సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఆ తరువాత ‘ఆచార్య’ చిత్రం షూటింగ్ సందర్భంగా కరోనా టెస్ట్ చేయించుకోగా.. చిరంజీవికి పాజిటివ్ వచ్చినట్లు ట్విట్టర్ వేదికగా సోమవారం నాడు చిరంజీవే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో సీఎం కెసిఆర్ ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం చిరు హోం క్వారంటైన్లో ఉన్నారు. వెంటనే సీఎంవో అధికారులు అప్రమత్తమై కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. ఆదివారం నాడు ఎంపీ సంతోష్, హీరో రామ్చరణ్తో కలిసి చిరంజీవి మొక్కలు కూడా నాటారు. ఆ సమయంలో కూడా చాలామంది పాల్గొన్నారు. అంతేకాకుండా సీఎం కెసిఆర్ చేతికి చెక్లు కూడా అందజేయడంతో ఆ చెక్కు ద్వారా ఏమైనా వైరస్ సోకే ప్రమాదముందని కూడా అధికారులు సూచించడంతో సీఎం కేసిఆర్ కూడా పరీక్షలు చేయించుకోవడాని సిద్ధ పడుతున్నట్టు సమాచారం. ఈ సమీక్షలో ఎంపీ సంతోష్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఎంపీ సంతోష్ కరోనా పరీక్షలు చేయించుకోగా నెగిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇవాళ వారంతా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు..ఇప్పటికే కొందరి ఫలితాలు రాగా.. మరికొందరి ఫలితాలు రావాల్సి ఉంది. కరోనా వార్త ఎవరు వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.
భారత్ లో ఇస్రో ప్రయోగాల విజయవంతం పరంపర కొనసాగుతోంది. ఇండియన్ స్పేస్ సెంటర్ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ సీ-49 రాకెట్ శనివారం మధ్యాహ్నం విజయవంతంగా నింగిని చీల్చుతూ గగణ తలంలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం చేపట్టారు. పీఎస్ఎల్వీ సీ-49 రాకెట్ ద్వారా స్వదేశానికి చెందిన ఎర్త్ అబ్జర్వేషన్(ఈవోఎస్ 01) శాటిలైట్తో పాటు అమెరికాకు చెందిన నాలుగు ఉపగ్రహాలు, లక్స్ంబర్గ్కు చెందిన నాలుగు ఉపగ్రహాలు, తిథువేనియాకు చెందిన ఒక చిన్న తరహా ఉపగ్రహాన్నికూడా వీటితోపాటు నింగిలోకి పంపారు. వ్యవసాయం, ప్రకృతి వైపరిత్యాలపై ఈవోఎస్ 01 అధ్యయనం చేయనుంది. షార్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రయోగ ప్రక్రియను నిర్వహించారు. పీఎస్ఎల్వీ సీ-49 ప్రయోగం విజయవంతం అయిన సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రపంచంలోనే ఇస్రో ఒక దిక్సూచి ప్రయోగ కేంద్రంగా అవతరించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు..
రిలయన్స్ అధినేత, ఆసియా కుబేరుడు, ముకేశ్ అంబానీ ఏం చేసినా భారీగానే వుంటుంది. అది దేశంలోనే హాట్ టాపిక్ గా మారుతుంది కూడా. ఇపుడు మరో భారీ విరాళంతో ముకేశ్ అంబానీ వార్తల్లో నిలిచారు. దేశంలోని సుప్రసిద్ధ అష్టాదశ శక్తిపీరాల్లో ఒకటైన కామాఖ్యాదేవి ఆలయం కోసం 20 కేజీల బంగారాన్ని కానుకగా ఇచ్చారు. అసోంలో ప్రాముఖ్యత గాంచిన ఈ దేవాలయ మూడు గోపుర కలశాలను బంగారంతో తీర్చిదిద్దనున్నారు. ఆ కార్యక్రమానికి అంబానీ ఈ విరాళం సమర్పించడం విశేషం. ఆలతాపడానికి సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని ఆలయ పూజారి దీప్ శర్మ తెలియజేశారు. 3 నెలల క్రితం అంబానీ ఇందుకోసం కామాఖ్యా ఆలయ నిర్వహణ కమిటీని సంప్రదించారన్న ఆయన మూడు కలశాల బంగారం తాపడం ఖర్చులు తాము భరిస్తామని ఆలయ అధికారులకు హామీ ఇచ్చారని చెప్పారు. అందులో భాగంగానే రిలయన్స్ ఇంజనీర్లు, శిల్పకారుల ఆధ్వర్యంలో పనులు చేపడుతున్నారన్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే దీపావళికి ముందే బంగారం తాపడం పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత అంబానీ దంపతులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. బంగారు తాపడంతో శక్తి పీఠం కొత్త శోభను సంతరించుకోనుంది..
విశాఖ రుషికొండలో ప్రభుత్వానికి చెందిన రూ.800 కోట్ల విలువైన 40.50ఎకరాల భూమిని భూ దురాక్రమణ చేసి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తప్పుడు పత్రాలు సమర్పించిన గీతం డీమ్డ్ టుబీ యూనివర్శిటీపై ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ ద్వారా అందించిన పరిశోధనాత్మక కధనాలన్నీ ఒక్కొక్కటిగా వాస్తవాలవుతున్నాయి. ఏవైతే గీతం డీమ్డ్ టుబీ యూనివర్శిటీ విషయంలో ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా కథనాలు న్యూస్ కార్డ్ గా వచ్చాయో అవే అంశాలపై వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఒక్కొక్కటిగా ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. మొన్న యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసి), నేషనల్ హెల్త్ కమిషన్(ఎన్ఎంసి) కి ఫిర్యాదు చేస్తే...నేడు జాతీయ సాంకేతిక విద్యామండలి(AICTE) ’గీతం అక్రమాల పైన, విద్యాసంస్థ ఏఐసిటిఈ కి సమర్పించిన తప్పుడు ధ్రువపత్రాలు పైన వెంటనే విచారణ చేపట్టి కఠినమైన చర్యలు తోసుకోవాలని, గుర్తింపు రద్దు చేయాలని రాజ్యసభ సభ్యులు వేణుంబాక విజయ్ సాయి రెడ్డి ఏఐసిటిఈ ఛైర్మన్ ఆచార్య సహస్ర బుదే ను లేఖ ద్వారా కోరిడం‘ తో మరోసారి ఈఎన్ఎస్ కధనాలకు బలం చేకూరింది. ఒక విద్యాసంస్థ(ఇంజనీరింగ్ కాలేజి లేదా యూనిర్శిటీలో కోర్సులు) ఏర్పాటు చేయాలన్నా, నిర్వహించాలన్నా అఖిలభారత సాంకేతిక విద్యామండలి AICTE అనుమతి తప్పని సరిగా వుండాలి. అలా ఉండాలంటే సదరు కేంద్ర ప్రభుత్వ సంస్థల నియమనిబంధనలకు అనుగుణంగా విద్యాసంస్థల ఆస్తులు, వసతులు, ఉపాద్యాయులు క్లీన్ చిట్ గా ఉండాలి. అలా అయితేనే ఏఐసిటీఈ అనుమతులు మంజూరు చేస్తుంది. అలా లేని సంస్థలు, యూనిర్శిటీల ఇంజనీరింగ్ డిగ్రీలు చెల్లవు. ఇదే విషయాన్ని గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి గీతం విద్యాసంస్థలు, గీతం డీమ్డ్ టుబీ యూనిర్శిటీ డిగ్రీలు చెల్లవని ఒక విద్యార్ధినిని తిరస్కరించాయి. ఆమెను ఎంబీఏలోకి అనుమతించలేదు. ఆసమయంలో గీతంపై పెద్ద రచ్చే జరిగింది. దీంతో అప్పుడు ఆగమేఘాలపై ఏఐసిటిఈ నుంచి గీతం డీమ్డ్ టుబీ యూనిర్శిటీ అనుమతులు తెచ్చుకుంది. అయితే అలా తెచ్చుకున్న అనుమతులు తెచ్చుకునే సమయంలో ఏఐసిటిఈకి తప్పుడు ద్రువపత్రాలు సమర్పించిందని, తక్షణమే సదరు యూనివర్శిటీ అనుమతులపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ విజయసాయిరెడ్డి లేఖరాయడంతో గీతం చక్రబంధంలో ఇరుక్కుంది. గతంలో యూజీసి, ఏఐసిటిఈలు నోటీసు గీతం విద్యాసంస్థలకు ఇస్తే వాటిపై వార్తలు రాసిన మీడియా సంస్థలపై గీతం యాజమాన్యం సైబర్ క్రైమ్ కేసుపెట్టింది. అదేసమయంలో యూనివర్శిటీకి పలు కేంద్ర ప్రభుత్వం సంస్థలకు తప్పుడు ద్రువపత్రాలు సమర్పించిన విద్యాసంస్థపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు, అనుమతులు రద్దుచేయాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. అందులోనూ గీతం విద్యాసంస్థలు ట్రస్టు పేరుతో నిర్వహిస్తూ, ప్రభుత్వ ఆస్తులను అన్యాక్రంతం చేస్తూ, ఆధారాలతో దొరికిపోవడం తదితర అంశాలను రాష్ట్రానికి చెందిన అధికారపార్టీకి రాజ్యసభ్యుడు ఇంత స్థాయిలో ఫిర్యాదులు చేయడం బహుసా భారత దేశంలో ఇదే తొలిసారి. దీంతో ఏ స్థాయిలో గీతం డీమ్డ్ టుబీ యూనిర్శిటీ అవినీతికి పాల్పడిందో కేంద్ర ప్రభుత్వ సంస్థలు అర్ధం చేసుకోవడంతోపాటు, విచారణకు ఆదేశించాల్సిన అవసరం వుంది. అదే సమయంలో గీతం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు సమర్పించిన తప్పుడు నివేదికలపై నేడు జాతీయవ్యాప్తంగా ప్రైవేటు డీమ్డ్ యూనివర్శిటీలు, ఇతర యూనిర్శిటీల్లో తీవ్రమైన చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఎంపీ విజయసాయిరెడ్డి గీతం విద్యాసంస్థల విషయంలో కేంద్రప్రభుత్వ సంస్థలకు చేస్తున్న ఫిర్యాదులు ప్రకంపణలు స్రుష్టిస్తున్నాయి. అదేసమయంలో ఈఎన్ఎస్ లైవ్ యాప్ అందిస్తున్న కధనాలు వాస్తవాలవడంతో గీతం యాజమాన్యానికి కంటిమీద కునుకు పట్టడం లేదు..!
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని భూకుంభకోణంపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)పై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ కేసులో భాగంగా టీడీపీ నేతలు వర్ల రామయ్య సహా ప్రతి వాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. తదుపరి విచారణలో తుది వాదనలు వింటామని జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం స్పష్టం చేసింది. సిట్ ఏర్పాటుపై ఏపీ హైకోర్టు విధించిన స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలంటూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. దీంతో కేసు దర్యాప్తు దశలో హైకోర్టు స్టే విధించడం సరికాదని ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఆపై మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఆధారంగా సిట్ ఏర్పాటైందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశాలు లేవని కోర్టుకి వివరించారు. అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ కూడా రాసినట్లు గుర్తుచేశారు.
దీనిపై స్పందించిన న్యాయస్థానం టీడీపీ ప్రభుత్వ నిర్ణయాలన్నింటిపైనా దర్యాప్తు చేస్తారా? అని ప్రశ్నించింది. దీనిపై న్యాయవాది దుష్యంత్ దవే వివరణ ఇస్తూ.. అలాంటిది ఏమీ లేదని, అక్రమాలు చోటు చేసుకున్న విషయాలపైన మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ సిట్ దర్యాప్తు జరుపుతోందని స్పష్టం చేశారు. సిట్ దర్యాప్తు విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోకూడని వాదించారు. ‘కొందరు ఆర్టికల్ 226 ప్రకారం సిట్ దర్యాప్తుపై హైకోర్టులో పిటిషన్లు వేశారు. వ్యక్తిగతంగా ప్రభావితమైతే తప్ప ఆర్టికల్ 226 ప్రకారం రిట్ దాఖలు చేయలేరు. సిట్ దర్యాప్తుతో ఎలాంటి సంబంధం లేనివారు పిటిషన్లు దాఖలు చేశారని కోర్టుకి వివరించారు. హైకోర్టుకు అసాధారణ అధికారాలు లేవని.. సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడాల్సిందే’ అని న్యాయవాది దుష్యంత్ దవే తెలియజేశారు.