రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి బుధవారం సాయంత్రం తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనానికి చేరుకున్నారు. వీరికి ఈవో అనిల్కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి, సివిఎస్వో గోపినాధ్ జెట్టి పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. అంతకుముందు తిరుపతి విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, జెఈవో పి.బసంత్కుమార్ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గౌతమ్ రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, వేణు గోపాలకృష్ణ, చీఫ్విప్ శ్రీకాంత్రెడ్డి, తిరుపతి శాసనసభ్యులు కరుణాకర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్ రెండు రోజుల పాటు తిరుమలలోనే ఉంటారు. తొలిరోజు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన తరువాత, మరుసటిరోజు స్వామివారి దర్శనం చేసుకున్న తరువాత తిరిగి పయనమవుతారు.
ఏపీ సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తిరుమల చేరుకున్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాల సమర్పించనున్న నిమిత్తం రోడ్డుమార్గంలో తిరుమల చేరుకున్నారు. విమానాశ్రయంలో స్వాగతం పలికిన ఉప ముఖ్యమంత్రులు కె.నారాయణ స్వామి, ఆళ్ల నాని, జిల్లా ఇంచార్జి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి, బిసి సంక్షేమ శాఖ మంత్రి టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, జెసి మార్కండేయులు ( ఇంచార్జి కలెక్టర్) నగరపాలక కమిషనర్ గిరీషా, అసిస్టెంట్ కలెక్టర్ విష్ణు చరణ్, డిఐజి కాంతిరణా టాటా, అర్బన్ ఎస్.పి.రమేష్ రెడ్డి, చిత్తూరు ఎస్.పి.సెంథిల్ కుమార్, జె ఈ ఓ బసంత్ కుమార్, ఎం.ఎల్.సి. యండవల్లి శ్రీనివాసులు రెడ్డి, శాసన సభ్యులు తిరుపతి కరుణాకర రెడ్డి, శ్రీకాళహస్తి బియ్యపు మధుసూధనరెడ్డి, సత్యవేడు ఆదిమూలం,పుత్తూరు రోజా, పూతలపట్టు ఎం.ఎస్.బాబు, పలమనేరు వెంకటే గౌడ, కోడూరు శ్రీనివాసులు, ఐజి శశిధర్ రెడ్డి, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సురేష్, డిప్యూటీ కమాండెంట్ దుర్గేష్ చంద్ర శుక్లా, సి.ఎస్.ఓ. రాజశేఖర్ రెడ్డి, రాజంపేట మేడా మల్లిఖార్జున రెడ్డి, డిసిసిబి చైర్మన్ రెడ్డెమ్మ, స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ , టర్మీనల్ మేనేజర్ గోపాల్, ముఖ్యమంత్రి వెంట డిల్లి నుండి పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి వచ్చారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు బుధవారం శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు మోహినీ రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చాడు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చాడు. ఈ అవతారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో చాటి చెబుతున్నారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు. వాహనసేవలలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, డా.నిశ్చిత, శేఖర్ రెడ్డి, గోవిందహరి, డిపి అనంత, సిఇ రమేష్రెడ్డి పాల్గొన్నారు. కాగా రాత్రి 7 గంటలకు విశేషమైన గరుడవాహనంపై శ్రీమలయప్పస్వామివారు కటాక్షించనున్నారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు మంగళవారం రాత్రి శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపంలో శ్రీమలయప్ప స్వామివారు ఉభయదే వేరులతో కలిసి సర్వభూపాల వాహనంపై బకాసుర వధ అలంకారంలో దర్శనమిచ్చారు. సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి గౌతమ్రెడ్డి, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, డా.నిశ్చిత, శేఖర్ రెడ్డి, గోవిందహరి, డిపి అనంత, సివిఎస్వో గోపినాథ్జెట్టి పాల్గొన్నారు. కాగా బ్రహ్మోత్సవాలలో ఐదో రోజైన బుధవారం ఉదయం 9 గంటలకు మోహినీ అవతారం, రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై శ్రీవారు భక్తులను కటాక్షించనున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోమహనరెడ్డి పర్యటనలో కొద్దిపాటి మార్పులు జరిగినట్టు జిల్లాయంత్రాంగం వెల్లడించింది. నెల 23 బుధవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుండి బయలుదేరి మధ్యాహ్నం 1.00 గంటకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం ముఖ్యమంత్రి రోడ్డుమార్గన తిరుమల శ్రీ పద్మావతి అతిధి గృహం చేరుకుంటారు. అక్కడ విశ్రాంతి తీసుకుని సాయంత్రం 5.27 గంటలకు పద్మావతి అతిధి గృహం నుండి బయలుదేరి అన్నమయ్య భవనములో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు. తరువాత 6.15 గంటలకు బేడి ఆంజనేయ స్వామి ఆలయం చేరుకుని అక్కడి నుండి ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు సమర్పించడానికి శ్రీవారి ఆలయం చేరుకుంటారు. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం శ్రీ వారిని దర్శించుకుని రాత్రి 7.40 గంటలకు శ్రీ పద్మావతి అతిధి గృహం చేరుకుని రాత్రి బస చేస్తారు. ఈ నెల 24 న గురువారం ఉదయం 6.15 గంటలకు పద్మావతి అతిధి గృహం నుండి బయలుదేరి మరోమారు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం నాద నీరాజనం సుందర కాండ పారాయణ కార్య క్రమంలో పాల్గొని ఉ.8.10 గంటలకు కర్నాటక రాష్ట్ర ఛారిటీస్ సత్రాలకు శంఖుస్థాపన చేయనున్నారు.తిరుమల నుండి 9.20 గంటలకు బయలుదేరి 10.20 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని గన్నవరం తిరుగు ప్రయాణం అవుతారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవి మాలలు మంగళవారం తిరుమల కు చేరుకున్నాయి. ముందుగా తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద శ్రీ పెద్దజీయంగార్ మఠానికి మాలలను తీసుకొచ్చారు. అక్కడ శ్రీశ్రీశ్రీ పెద్దజీ యర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడినుంచి టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్కుమార్ సింఘా ల్, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా గోదాదేవి మాలలను శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు. అంతకుముందు ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవికి అలంకరించిన మాలలను గరుడసేవ రోజు స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంద న్నారు. శ్రీవిల్లిపుత్తూరులోని శ్రీరంగమన్నార్స్వామివారి ఆలయానికి గోదాదేవి తండ్రి శ్రీపెరియాళ్వార్ పుష్పకైంకర్యం చేసేవారని, రంగనాథునిపై అనన్యభక్తి కలిగిన శ్రీ గోదాదేవి పూలమాలలను మొదట తాను ధరించి ఆ తరువాత స్వామివారికి పంపేదని పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన పెరియాళ్వార్ తన కుమార్తెను మందలించారని, ఆ తరువాత గోదాదేవి ధరించకుండా పంపిన మాలలను శ్రీరంగనాథుడు తిరస్కరించినట్టు చెప్పారు. గోదాదేవి శ్రీవారి దేవేరి అయిన భూదేవి అవతారమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు బోర్డు సభ్యులు డిపి.అనంత, శేఖర్రెడ్డి, గోవిందహరి, విల్లిపుత్తూరు ఆలయ జాయింట్ కమిషనర్ ధనపాల్ రవిచంద్ర, ఈవో ఇలంగోవన్ పాల్గొన్నారు.