ఆంధ్రప్రదేశ్ ను అంతర్జాతీయ పర్యాటక హబ్ గా తీర్చిదిద్దుతామని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం నిర్వహించనున్న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని సర్క్యూట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వివిధ రంగాలలో పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు తగిన వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. పొడవైన సముద్రతీరం, సుందరమైన బీచ్ లు, అడవులు, కొండలు విహారస్థలాలు, దేవాలయాలు ఉన్నాయన్నారు. వీటన్నింటినీ ఉపయోగించుకొని ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం, టెంపుల్ టూరిజం లో పెట్టుబడులను ఆహ్వానించవచ్చు అన్నారు. వివిధ పర్యాటక ప్రదేశాలలో 12 స్టార్ హోటళ్లను ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యంలో నిర్మించనున్నట్లు వెల్లడించారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ఇప్పటికే టూరిజం ఫెస్టివల్స్ ఏర్పాటు చేస్తున్నామని రానున్న కాలంలో మరిన్ని ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. నదులు, సరస్సులు, రిజర్వాయర్లలో సురక్షిత బోటు విహారం కొరకు 9 కమాండ్ కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామన్నారు. పర్యాటక ప్రదేశాలలో మరింత అభివృద్ధి చేయడం, టూరిజం యాప్ ద్వారా అవగాహన కల్పిస్తూ యాత్రికులను ఆకర్షించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. కరోనా రాష్ట్రంలో పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపించింది అన్నారు. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టి నందున ఇప్పుడిప్పుడే పర్యాటక రంగాన్ని మామూలు స్థితికి తీసుకు వస్తున్నామని చెప్పారు. ప్రపంచంలో 30 శాతం దేశాలు పర్యాటక రంగం పైన ఆధారపడి ఉన్నాయని, మన దేశంలో కూడా కేరళ, గోవా వంటి రాష్ట్రాలు పర్యాటకరంగం ద్వారా ఎక్కువగా ఆదాయం పొందుతున్నాయని వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్రంలో వివిధ టూరిజం ప్రాజెక్టులను పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్ షిప్ లో అభివృద్ధి చేసేందుకు పథకాలను, ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు. విశాఖ నగరం, జిల్లాలో పర్యాటక ప్రాంతాల సందర్శన రంగంలో అభివృద్ధి చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని గుర్తించామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల సందర్శన, యాత్రా స్థలాల సందర్శన, విహారస్థలాలు చారిత్రక ప్రదేశాలు హస్తకళల విభాగాలను కలిపి ఒక ప్యాకేజీ గా చేస్తామని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. ఈ సమావేశంలో టూరిజం శాఖ రీజనల్ డైరెక్టర్ రాంప్రసాద్, డి.వి.ఎం.ప్రసాద్ రెడ్డి, టి.ఐ.ఓ. పూర్ణిమా దేవి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్, ఫార్మశీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపిపీజీఇసెట్ ప్రవేశ పరీక్షలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయని కన్వీనర్ ఆచార్య పేరి శ్రీనివాస రావు తెలిపారు. శనివారం ఉదయం ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 28,726 మంది దరఖాస్తు చేసారన్నారు. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించరన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురం, భీమవరం, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసామన్నారు. రాష్ట్రంలో 40 పరీక్ష కేంద్రాలతో పాటు హైదరాబాదులో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులు తమ వెంట హాల్టికెట్, గుర్తిపు కార్డును తీసుకురావాలన్నారు. మాస్క్ ధరించడం, శానిటైజర్ను వినియోగించడం తప్పనిసరి అన్నారు. పరీక్షల కేంద్రాలకు గంటన్నర ముందుగా విద్యార్థులు చేరుకోవాలన్నారు. ప్రతీ విద్యార్థికి శరీర ఉష్ణోగ్రత పరిశీలించి పరీక్షకు అనుమతిస్తారన్నారు. అనారోగ్య లక్షణాలు కలిగిన విద్యార్థులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదన్నారు. కోవిడ్ నియమావళిని అనుసరిస్తూ ఆన్లైన్ విధానంలో పరీక్షలను నిర్వహించడం జరుగుతోందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలియజేశారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న ఆయన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం , తూర్పు గోదావరి జిల్లాలలో ఒంటరి ప్రదేశాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లకు వర్షాలపై హెచ్చరికలు చేస్తూ, తగిన జాగ్రత్తుల తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఇప్పటికే గత కొద్ద రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలు, సబ్ కలెక్టర్ ఆఫీసుల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు రెయిన్ ఫాల్ నమోదు చేయడంతోపాటు, అత్యవసర సమయంలో సేవలందించడానికి ప్రభుత్వం అధికారులను సిద్ధం చేసింది..
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు శుక్రవారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు వెన్నముద్ద కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి అనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది. వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, డా.నిశ్చిత, శివకుమార్, శేఖర్ రెడ్డి, గోవిందహరి, డిపి అనంత, ఆలయ డెప్యూటి ఈవో హరీంద్రనాథ్ పాల్గొన్నారు. కాగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 7.00 గంటలకు సర్వభూపాల వాహనం, రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు.
సంగీత ప్రపంచానికి గాన గంధర్వుడు డా.ఎస్పీ బాలసుబ్రమణ్యం లేని తీరనదని ప్రముఖ సినీ సంగీత దర్శకులు డా.మహర్షి(జాన్ క్రిష్టఫర్) అన్నారు. శుక్రవారం బాలసుబ్రమణ్యం మరణవార్త విని కొద్దిసేపు కోలుకోలేకపోయానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన సంగీత దర్శకత్వంలో బాలుతో పాటపాడించుకోవాలనే ఆశ తనకు తీరనే లేదన్నారు. వేల పాటలు పాడిన గొంద నేటి నుంచి వినపడదనే విషయాన్నే జీర్ణించుకోవడం చాలా కష్టంగా వుందన్నారు. బాలు లాంటి గాయకుడు ఈ జన్మకి మళ్లీ పుట్టడని, అంత మంచి వ్యక్తిని కరోనా వైరస్ పొట్టన పెట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు, తమిళం, హిందీ, మళయాలం ఇన్నిభాషల్లో వేల పాటలు పాడిన ఘనత ఒక్కబాలూకే దక్కుతుందన్నారు. ఆయనను ఎపుడైనా చూడాలనుకున్నా, ఆయనను గుర్తుచేసుకోవాలన్నా తెలుగు సినీ ప్రపంచానికి ఆ పాటలను వినడం ఒక్కటే మార్గమన్నారు డా.మహర్షి..ఈ సందర్భంగా ఆయన మ్రుతిని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిణిలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గర్భిణీ స్త్రీలకు ప్రసూతి సెలవులు జీతంతోపాటు కలిపి ఇవ్వాలంటూ ఈరోజు ఉత్తర్వులు(జిఓఆర్టీనెం-4) జారీచేసింది. గ్రామ సచివాలయాల్లో గర్భిణిలు ప్రసూతి సమయంలో పడుతున్న ఇబ్బందు లను తెలియజేస్తూ..ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా..గర్భిణిల ప్రసూతి సెలవులపై క్లారిటీ ఎక్కడ.. అనే వార్తపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లు స్పందించారు. ముఖ్యంగా ఈ విషయంలో విశాఖ జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ స్పందించారు. ఈఎన్ఎస్ వార్త రాసిన తరువాత, జిల్లాలో గర్భిణికి జీతంతో కూడిన సెలవు ఇవ్వాలని ఎంపీడిఓకి లిఖిత పూర్వక ఉత్తర్వులు జారీచేశారు. ఆ ఉత్తర్వు ప్రతిని చాలా జిల్లాల్లో మహిళా సచివాలయ ఉద్యోగిణిలు ఆయా జిల్లాల్లో ప్రసూతి సెలవుల కోసం దరఖాస్తులు చేసుకునే సమయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. తరువాత ప్రభుత్వం ద్రుష్టికి ఈ విషయం వెళ్లడంతో.. సచివాలయ ఉద్యోగిణిలకు జీతంతో కూడిన ప్రసూతి సెలవులు 6నెలలు ఇవ్వాలంటూ ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తక్కువ జీతంతో తమకు ప్రసూతి సమయంలో పడే ఇబ్బందులకు ప్రభుత్వం శుభవార్త చెప్పిందని ఉద్యోగిణిలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త దండు అనిల్కుమార్ టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు శివకుమార్ ద్వారా రూ.10 లక్షలు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్కు విరాళంగా అందించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం ఉదయం ఈ విరాళం డిడిని శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్స్వామి చేతుల మీదుగా టిటిడి అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డికి అందచేశారు. ఈ సందర్భంగా దాత మాట్లాడుతూ, తిరుమల శ్రీవారి కార్యక్రమాలు ఎస్వీబీసీ ట్రస్టు ద్వారా నిర్వహించే ఛానల్ లో ఎంతో వైభవంగా చూపిస్తున్నారని, దీంతో బయటకు రాలేని భక్తులకు ఎంతో నయనానందకరంగా వుంటుందని కొనియాడారు. రానున్న రోజుల్లో ఛానల్, ట్రస్టు ద్వారా మరిన్ని కార్యక్రమాలు రూపొందించి భక్తులకు చేరేలా చూడాలని సీఈఓని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ సిఈవో సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ టిక్కెట్లు సెప్టెంబరు 26న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల అక్టోబరు కోటా విడుదల చేయనున్నట్టు టిటిడి ప్రకటించింది. భక్తుల సౌకర్యార్థం 2020 అక్టోబరు నెల రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను సెప్టెంబరు 26వ తేదీ ఉదయం 11.00 గంటలకు టిటిడి విడుదల చేయ నుంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్లో ముందస్తుగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టిటిడి కోరుతోంది. తిరుమలలో స్వామివారిని చూసేందుకు భక్తులు అత్యధిక సంఖ్యలో రూ.300 టిక్కెట్లు అధికంగా కొనుగోలు చేస్తుంది. గతంలో టిటిడి ఈ టిక్కెట్లను కొంత కాలం నిలుపుదల చేసినప్పటికీ, భక్తుల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో మళ్లీ నెలవారీ కోటా ప్రకటించింది. అప్పటి నుంచి ఏ నెలకు సంబంధించిన కోటాను ముందు నెల విడుదల చేస్తుంది..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని 28 దేవాలయాల్లో గుడికో గోమాత కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని టిటిడి నిర్ణయించింది. టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో కలిసి గురువారం అన్నమయ్య భవనంలో హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యనిర్వాహక మండలి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం నిర్వహణపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ధర్మకర్తల మండలి తీర్మానించింది. హిందూ ధర్మప్రచార పరిషత్, ఎస్వీ గోసంరక్షణశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అమలుచేయనున్నారు. తెలంగాణలోని పాత 10 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో జిల్లాకు ఒక ఆలయం చొప్పున, కర్ణాటక రాష్ట్రంలోని 5 దేవాలయాల్లో కలిపి మొత్తం 28 ఆలయాల్లో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమం ప్రారంభించడానికి నిర్ణయం తీసుకున్నారు. టిటిడి ఎస్వీ గోసంరక్షణశాల ద్వారా దేశవాళీ ఆవుల దానాన్ని స్వీకరించాలని తీర్మానించారు. మఠాలు, పీఠాలు, వంశపారంపర్య పర్యవేక్షణ ఆలయాలు, దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలు, వేద పాఠశాలలకు ఈ కార్యక్రమం ద్వారా గోవును టిటిడి అందజేస్తుంది. గోదానం పొందిన సంబంధిత ఆలయాలు, పీఠాలు, వేదపాఠశాలలు గోవుల సంరక్షణ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.
టిటిడి ద్వారా దానం పొందిన గోవుల వద్ద గుడికో గోమాత - టిటిడి అనే బోర్డు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎస్వీ గోసంరక్షణశాల ముందస్తు అనుమతితోనే భక్తులు ఈ కార్యక్రమానికి గోవులను దానం చేయాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలు, గోదానం, దరఖాస్తుల వివరాలు ఎస్వీ గోసంరక్షణశాల డైరెక్టర్ నుంచి పొందవచ్చు. ఈ సమావేశంలో ధర్మకర్తల మండలి సభ్యులు శివకుమార్, గోవిందహరి, డిపి.అనంత, జెఈవో పి.బసంత్కుమార్, హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి ఆచార్య రాజగోపాలన్, ఎస్వీ గోసంరక్షణశాల డైరెక్టర్ డా. హరనాథరెడ్డి పాల్గొన్నారు. హెచ్డిపిపి కో-అప్షన్ సభ్యులు బొమ్మదేవర సుబ్బారావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి ఆన్ లైన్ కల్యాణోత్సవం టికెట్ల కోటాను అక్టోబర్ నెలకు సంబంధించిన టిటిడి గురువారం ఆన్ లైన్లో విడుదల చేసింది. అక్టోబర్ 16 నుంచి 24వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 25న శ్రీవారి పార్వేట ఉత్సవం ఉన్న కారణంగా ఆ రోజుల్లో కళ్యాణోత్సవం ఉండదు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్ లైన్లో కల్యాణోత్సవం టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది. టికెట్లు బుక్ చేసుకునే గృహస్తులకు ఉత్తరీయం, రవిక, అక్షింతలు, కలకండ ప్రసాదాన్ని తపాలా శాఖ ద్వారా వారి చిరునామాకు పంపడం జరుగుతుంది. కాగా, ఆన్లైన్ కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులు(ఇద్దరు) టికెట్ బుక్ చేసుకున్న తేదీ నుండి 90 రోజుల్లోపు శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని కూడా టిటిడి కల్పించింది.