టిటిడీ యాత్రికులకు అందిస్తున్న సేవలు, పాలన వ్యవహారాలకు సంబంధించి మెయిల్స్, కాల్ సెంటర్, డయల్ యువర్ ఈఓ ద్వారా వచ్చే సలహాలు, సూచనలు, ఫిర్యాదుల మీద దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం టీటీడీ పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో ఆయన ఐటి విభాగంపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ప్రస్తుతం ఉన్న వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ విభాగాలకు సంబంధించి పెండింగులో ఉన్న సాఫ్ట్వేర్ అప్లికేషన్లను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగం నిర్వహణలో ఐటి పరిజ్ఞానాన్ని మరింతగా పెంచడంపై దృష్టి పెట్టాలని ఈఓ సూచించారు. మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ కు సంబంధించి ప్రత్యేక అప్లికేషన్ తయారు చేయాలని ఐటి అధికారులను ఆదేశించారు. మార్కెట్లో సరుకుల ధరలు, డిమాండ్, సరఫరాకు సంబంధించిన వివరాలన్నీ తెలుసుకుని, ఇందుకు తగ్గట్టు సరుకులు కొనుగోలు చేయగలిగేలా ఒక అప్లికేషన్ రూపొందించాలన్నారు. ఆసుపత్రుల నిర్వహణకు ప్రత్యేక అప్లికేషన్ ఉండాలన్నారు. టీటీడీకి అద్దెలు చెల్లించాల్సిన వారికి గడువుకు ముందే అలర్ట్ మెసేజ్ పంపే వ్యవస్థ అమలు చేయాలని ఆదేశించారు. ఉద్యోగులకు సంబంధించిన సమస్త సమాచారంతో టీటీడీ నిర్వహిస్తున్న డేటా అప్డేట్ చేయాలని ఆయన చెప్పారు. రికార్డులన్నీ డిజిటలైజ్ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్ సెక్యూరిటీ పాలసీ మీద సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో అదనపు ఈఓ ధర్మారెడ్డి, జెఈఓ సదా భార్గవి, ఎఫ్ఏ అండ్ సీఎఓ బాలాజి, చీఫ్ ఇంజినీర్ రమేష్ రెడ్డి, ఐటి విభాగాధిపతి శేషారెడ్డి తో పాటు పలువురు అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
కరోనా వైరస్ పట్ల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. దేశంలో కరోనా సెకెండ్ వేవ్ వస్తున్నందున అధికార యంత్రాంగం చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. వైద్యఆరోగ్యశాఖ ద్వారా ఎప్పటి కప్పుడు కరోనా పరీక్షలు చేయడంతోపాటు, వారికి పూర్తిస్థాయిలో మందులు కూడా పంపిణీ చేయాలన్నారు. ఇప్పటికే యూరప్, అమెరికా లాంటి దేశాలు కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. డిల్లీలో మరోసారి లాక్ డౌన్ చేయాలని యోచిస్తుందని ఇలాంటి తరుణంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 6890 మంది కరోనా వైరస్ వలన మ్రుత్యువాత పడిన విషయాన్ని ప్రతీఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. వైరస్ నియంత్రణలో ప్రజలకు భాగస్వాములను చేయాలన్నారు. లేదంటే వైరస్ కేసులు పెరిగే అవకాశం వుందని సీఎం వైఎస్ జగన్ కలెక్టర్లను అప్రమత్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా నీలంసాహ్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్కు లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలో కరోనా పరిస్థితులు సరిగా లేవని లేఖలో స్పష్టం చేశారు. అధికార యంత్రాంగమంతా కరోనా విధుల్లో ఉన్నారని, ఎన్నికల నిర్వహణపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాల్సిన అవసరం ఇప్పుడు లేదని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. అదీకాక గ్రామీణ ప్రాంతాలకు కూడా కరోనా విస్తరించిందనని, ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తామనడం ప్రజాహితం కాదని పేర్కొన్నారు. కరోనాను ఎదుర్కోవడంలో ఒక్కో రాష్ట్రం ఒక్కో వ్యూహాన్ని అమలు చేస్తోందని, ఒక రాష్ట్రాన్ని, మరో రాష్ట్రంతో పోల్చడం తగదన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 6,890 మంది కరోనాతో మరణించారని, రాబోయే రోజుల్లో కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని కేంద్రం కూడా తెలిపిందని ఆమె గుర్తుచేశారు. ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సమాయత్తం అయ్యాక ఆ చర్యలకు శ్రీకారం చుట్టడం మేలుని పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటిని ఎన్నికల కమిషన్ సానుకూలంగా పరిగణిస్తుందని భావిస్తున్నానని నీలంసాహ్ని లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించిందంటూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ మంగళవారం ప్రొసీడింగ్స్ పేరుతో ఉత్తర్వులు జారీచేసిన మీదట ఏపీ సీఎస్ స్పందించారు. ప్రస్తుతం పాఠశాలలు తెరిచిన తరువాత చాలా మంది ఉపాధ్యాయులకు, పిల్లలకు కరోనా పాజిటివ్ లు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లలేమని సీఎస్ పేర్కొన్నారు..
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఉద్యోగులకు ఒదొక బ్యాడ్ న్యూస్.. అన్ని ప్రభుత్వ శాఖల్లో బదిలీలను రెండు నెలల పాటు నిలుపుదల చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులు, ఆర్డీవోలు, ఇతర రెవెన్యూ ఉద్యోగులు, మున్సిపల్, పంచాయతీరాజ్ కీలక శాఖల్లోని సిబ్బందికి రెండు నెలల పాటు బదిలీలు నిలిపివేసింది ప్రభుత్వం. పంచాయతీ ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకొని చేపడతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఉండడంతో.. ఆ ప్రక్రియకు సంబంధించిన శాఖల ఉద్యోగులెవరినీ బదిలీ చేయడానికి వీల్లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) కె.విజయానంద్ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో బదిలీలకు బ్రేక్ పడక తప్పలేదు. కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) ఆదేశాల మేరకు ఓటర్ల గుర్తింపు కార్డుల ప్రత్యేక సవరణ కార్యక్రమం నవంబరు 16 నుంచి జనవరి 15 వరకు జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈసి ఈ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఎన్నికల అధికారులు, డిప్యూటీ ఎన్నికల అధికారులు, ఈ ప్రక్రియతో సంబంధమున్న అధికారులెవరినీ బదిలీలు చేయకూడదని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. జిల్లా రిటర్నింగ్ అధికారులుగా కలెక్టర్లు, ఉపరిటర్నింగ్ అధికారులుగా జేసీలు, ఆర్డీవోలు ఉంటారు. అలాగే రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ యంత్రాంగం మొత్తం ఇందులో పాలుపంచుకోవలసి ఉండడంతో ఆయా శాఖల్లోనూ బదిలీలు ఉండవు. ఒకవేళ ఎవరినైనా అత్యవసరంగా బదిలీ చేయాల్సి వస్తే.. ముందుగా ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలా ఈసి నుంచి అనుమతులు తీసుకోవడానికి సైతం రెండు నుంచి మూడు నెలల సమయం పట్టే అవకాశాలున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో తప్పా అటు ఈసీ కూడా బదిలీలను ప్రోత్సహించే పరిస్థితి లేదు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న జాయింట్ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా రెవెన్యూ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, వీఆర్వో, వీఆర్ఏ, పంచాయతీ కార్యదర్శులు, బూత్ స్థాయి ఆఫీసర్ల పోస్టులను తక్షణం భర్తీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకుని.. ఇంకా ఖాళీలుంటే ఆ వివరాలతో నివేదిక పంపించాలని ఆదేశించారు. ఇప్పటికే మిగిలిన పోయిన గ్రామ, వార్డు సచివాలయాల్లోని సిబ్బంది వేగంగా జరుగుతుండగా, వీఆర్ లో ఉన్న ఉద్యోగులను తక్షణమే ఖాళీలు ఉన్నచోట ప్రభుత్వం నియమిస్తోంది...
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన బుధవారం ఉదయం ముత్యపు (ముత్తంగి) అలంకారంలో అమ్మవారు రథంపై దర్శనమిచ్చారు. ఆలయం వద్దగల వాహన మండపంలో ఉదయం 8 నుండి 9 గంటల వరకు ప్రత్యేకంగా తయారు చేసిన చిన్న చెక్క రథంపై అమ్మవారిని వేంచేపు చేశారు. ఈ రథోత్సవం ఏకాంతంగా జరిగింది. శరీరం - రథం, ఆత్మ- రథికుడు, బుద్ధి - సారథి, మనస్సు - పగ్గాలు, ఇంద్రియాలు - గుర్రాలు. ఇంద్రియ విషయాలు రథం నడిచే త్రోవలు. రథం రథికుణ్ణి చూడమంటుంది. రథికుడు పగ్గాల సాయంతో గుర్రాలను అదిలిస్తూ, దారుల వెంబడి పరుగులు తీయించినట్లే ఇంద్రియాలతో, మనస్సుతో కూడిన ఆత్మవిషయాల్ని అనుభవిస్తూ ఉంటుంది. రథోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదు. భక్తుల హృదయక్షేత్రాలలో తాత్త్వికబీజాలు విత్తే ఒక యజ్ఞం. సింగారించిన పాలకడలి గారాలపట్టిని దర్శించిన వారికి జన్మాదిదుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది. వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్స్వామి, టిటిడి బోర్డు సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జెఈవో పి.బసంత్కుమార్ దంపతులు, సిఇ రమేష్రెడ్డి, విఎస్వో బాలిరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో ఝాన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, ఏఈవో సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ కుమార్, ఏవిఎస్వో చిరంజీవి, ఆర్జితం ఇన్స్పెక్టర్ రాజేష్ కన్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.
తిరుమలలోని గోగర్భం సమీపంలో గల పార్వేటమండపంలో కార్తీక వనభోజన కార్యక్రమం నవంబరు 22వ తేదీన ఆదివారం జరుగనుంది. ఉదయం 8.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు చిన్న గజ వాహనంపై, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు పల్లకీపై ఆలయం నుంచి ఊరేగింపుగా బయల్దేరి ఉదయం 10 గంటలకు పార్వేటమండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11 నుండి 12 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపనతిరుమంజనం నిర్వహిసారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. ఆ తరువాత కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహిస్తారు. పవిత్రమైన కార్తీకమాసంలో వనభోజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రకృతి ఒడిలో చెట్ల నడుమ నిర్వహించే ఈ వనభోజనాలకు హిందూ సంప్రదాయంలో విశేష ప్రాధాన్యం ఉంది. కార్తీకమాసం శివుడికి, శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైనది. ఈ మాసంలో పవిత్ర స్నానాలు, దానాలు, దీపారాధన, వనభోజనాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయని పురాణాల ద్వారా తెలుస్తోంది. కార్తీక మాసంలో ముక్కోటి దేవతలు, ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు, శ్రీమహాలక్ష్మితో కలిసి ఉసిరి చెట్టు కింద నివసిస్తారని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఉసిరి, తులసి, వేప, రావి, బిల్వ తదితర వృక్షాలను ప్రార్థించడం, పసుపు, కుంకుమ మరియు పుష్పాలతో అలంకరించడం ద్వారా కార్తీకమాసంలో మంచి ఫలితాలు వస్తాయి. కార్తీక వనభోజనం కారణంగా శ్రీవారి అలయంలో కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకారసేవలను టిటిడి రద్దు చేసింది.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం శ్రీ వకుళామాతను, ఆలయ ప్రదక్షిణగా వచ్చి శ్రీ విమాన వేంకటేశ్వరస్వామి, సబేరా, భాష్యకార్ల సన్నిధి, శ్రీ యోగనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో శివరాజ్ సింగ్ చౌహాన్కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం అదనపు ఈఓ స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. అనంతరం నాదనీరాజనం వేదికపై జరిగిన సుందరకాండ పారాయణంలో ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్వో గోపినాథ్ జెట్టి, బోర్డు మాజీ సభ్యులు భానుప్రకాష్రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, పేష్కార్ జగన్ మోహనాచార్యులు తదితరులు పాల్గొన్నారు.