ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బాధితులకు సత్వరం న్యాయం జరిగేలా చూడటంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి రెవెన్యూ, పోలీస్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కాకినాడ ఆర్డీఓ బీవీ రమణ కోరారు. సోమవారం మధ్యాహ్నం కాకినాడ ఆర్డీవో అధ్యక్షతన డివిజన్ స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాకినాడ డీఎస్పీ మురళీకృష్ణా రెడ్డి, ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ అప్పారావుతో పాటు జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు డోకుబుర్ర భద్రం, డా. మోకా పవన్
కుమార్, బండి వీరలింగేశ్వరరావు, పిల్లి జ్యోతి, డివిజన్ స్థాయి కమిటీ సభ్యులు, వివిధ మండలాల తహసీల్దార్లు హాజరయ్యారు.
తొలుత కాకినాడ డివిజన్ లో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులు, వాటి పురోగతి, బాధితులకు సహాయం పంపిణీ, ఉపాధి కల్పన, కుల ధ్రువీకరణ పత్రాల మంజూరు తదితర అంశాలపై
సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఆర్డీవో బీవీ రమణ మాట్లాడుతూ కాకినాడ జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారిగా కమిటీ నూతన సభ్యులతో డివిజన్ స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్) సమావేశం నిర్వహించినందుకు ఆనందంగా ఉందని కొత్తగా నియమితులైన సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసులకు సంబంధించి పెండింగ్ లో కేసులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన బాధితులకు సహాయం అందజేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా కాకినాడ డివిజన్ పరిధిలో ఉన్న మండల రెవెన్యూ అధికారులు కుల ధ్రువీకరణ పత్రాలు జారీలో ఏటువంటి జాప్యం లేకుండా ఆయా మండల తహసీల్దార్లు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి నెల 30వ తేదీన మండల స్థాయిలో సివిల్ రైట్స్ డే సమావేశం సక్రమంగా నిర్వహించేందుకు కృషిచేయాలన్నారు.
ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ బి.అప్పారావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసుల్లో బాధితుల పక్షాన నిలిచి వారికి భరోసా కల్పించే విధంగా కృషిచేయడం జరుగుతుందన్నారు.
ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్, ఛార్జ్ షీట్ కాపీలను ఆర్డీవో కార్యాలయానికి, ఆయా తహసీల్దార్లు కార్యాలయాలకు వెంటనే పంపిస్తున్నామన్నారు. బాధితులకు వెంటనే ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందించే విధంగా మండలస్థాయిలో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.
కాకినాడ డీఎస్పీ కె.మురళీకృష్ణా రెడ్డి మాట్లాడుతూ డివిజన్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషిచేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ డివిజన్ స్థాయి కమిటీ సభ్యులు సాపె సుధాకర్, మశిగిరి రాంబాబు, బొనగిరి బలబద్రరావు, సిద్ధమటపు రాజు.... పాటు ఎన్జీవో సంస్థల నుంచి హాజరయ్యారు. డివిజన్ పరిధిలోని అధికార యంత్రాంగంతో కలిసి పనిచేస్తూ ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి, భద్రతకు భరోసా కల్పించేలా పనిచేస్తామన్నారు. సమావేశంలో కాకినాడ రూరల్, కరప, పెదపూడి, పిఠాపురం, కాజులూరు, సామర్లకోట, తాళ్లరేవు, గొల్లప్రోలు, యు.కొత్తపల్లి మండల తహసీల్దార్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.