ప్రపంచంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై 2021 జులై 25న ప్రారంభిం చిన బాలకాండ పారాయణం సోమవారం ఘనంగా ముగిసింది. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివసుబ్రమణ్య అవ ధాని మాట్లాడుతూ, లోక కల్యాణార్థం టీటీడీ నిర్వహిస్తున్న పారాయణ యజ్ఞంలో భాగంగా, మంత్ర పారాయణం ప్రారంభించిందన్నారు. ఇం దులోని ప్రతి శ్లోకం మంత్రమేనన్నారు. బాలకాండలోని మొత్తం 77 సర్గల్లో 2,232 శ్లోకాలను 649 రోజులపాటు పారాయణం చేశామన్నారు. ప్రతి శ్లోకానికి అర్థంతోపాటు ప్రస్తుత సమాజానికి అన్వయించి పండితులు వ్యాఖ్యానం అందించారని వివరించారు.
శ్రీ బేడి ఆంజనేయస్వామి, శ్రీరాముని అవతారమైన శ్రీ వేంకటేశ్వరస్వామివారి సమక్షంలో నాదనీరాజనం వేదికపై బాలకాండ పారాయణం చేయడం గొప్ప విషయమన్నారు. రామనామస్మరణ ఎక్కడ జరిగితే అక్కడ హనుమంతుడు ఉంటారని వాల్మీకి మహర్షి తెలియజేశారని, ఆవిధంగా ఇన్నిరోజులు ఆంజనేయుడు మనమధ్యే ఉన్నారని చెప్పారు. వాల్మీకి మహర్షి గురువుగా మారి రామాయణాన్ని లోకానికి అందించారన్నారు. బాలకాండ పారాయణం నిర్వహించిన ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు డా. ప్రవ రామకృష్ణ సోమయాజులు, ధర్మగిరి వేదవిజ్ఞానపీఠం పండితులు రామానుజచార్యులు, మారుతి, శేషాచార్యులకు, ఈ కార్యక్రమాన్ని కోట్లాది మంది భక్తులకు చేరువ చేసిన ఎస్వీబీసీ సిఈఓ షణ్ముఖ కుమార్ కు, అద్భుతమైన కీర్తనలు ఆలపించిన అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం పండితులను, కళాకారులను సన్మానించారు.
బాలకాండలోని 74 నుండి 77వ సర్గ వరకు 4 సర్గలు, యోగ వాశిష్ఠం, ధన్వంతరి మహామంత్రం, అష్టాక్షర శ్రీరామమంత్ర స్త్రోత్రం కలిపి మొత్తం 166 శ్లోకాలను శ్రీ అవధాని పర్యవేక్షణలో పండితులు పారాయణం చేశారు. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు తమ ఇళ్ల నుంచే పారాయణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు వందన బృందం "శ్రీరామ జయరామ శృంగార రామాయని..", కార్యక్రమ ప్రారంభంలో, హైదరాబాద్ కు చెందిన సాంప్రదాయ కళాశాల విద్యార్థుల బృందం "ప్రతి వారం వారం మానస భజారే రఘువీరం.." సంకీర్తనను చివరిలో ఆలపించారు.