1 ENS Live Breaking News

ఇక గ్రామాల్లోనే పశువులకు వైద్యసేవలు..

రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో పశువులకు అన్నిరకాల ఉచిత వైద్యసేవలు అందించడానికి సంచార పశు వైద్య అంబులెన్సులు ఎంతగానో ఉపయోగపడతాయని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.278 కోట్ల వ్యయంతో మొత్తం 340 పశువుల ఆంబులెన్స్‌ సేవలు గురువారం అమరావతిలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంల నుంచి జెండా ఊపి ప్రారంభించారు. మొదటి విడతలో  రూ.143 కోట్ల వ్యయంతో  రూపొందించిన 175 పశువుల అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకు వస్తున్నట్టు సీఎం ప్రకటించారు. పాడిరైతులకు ఈ సంచార పశువైద్య అంబులెన్సులు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ  కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, రెవెన్యూశాఖమంత్రి ధర్మాన ప్రసాదరావు, పశుసంవర్ధక, మత్య్సశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, బీసీ సంక్షేమం, ఐ అండ్‌ పీఆర్‌ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ, పశుసంవర్ధశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tadepalli

2022-05-19 15:29:07

సరసమైన ధరలకు టమాటా విక్రయాలు..

రాష్ట్ర వ్యాప్తంగా నున్న అన్ని రైతు బజార్లలో ఈ నెల 20 నుండి  సరసమైన ధరలకు టమాటాల విక్రయం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి  కాకాని గోవర్థన రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ మార్కెట్ లో టమాటా ధర భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రజలకు సరసమైన ధరలకే  టమాటాను విక్రయించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందన్నారు.  ప్రస్తుత వేసవిలో రాష్ట్రంలో టమాటా ఉత్పత్తులు తగ్గిన నేపథ్యంలో ప్రక్క రాష్ట్రాల నుండి  టమాటాను దిగుమతి చేసుకుని ప్రైవేటు వ్యాపారులు అధిక ధరలకు విక్రయించడంపై ప్రభుత్వం తీవ్ర్రంగా పరిగణించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. బహిరంగ మార్కెట్లో టమాటా ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వమే స్వయంగా ప్రక్క రాష్ట్రాల నుండి టమాటాను కొనుగోలు చేసి రాష్ట్రం లోని అన్ని రైతు బజార్ల ద్వారా  సరసమైన ధరలకే టమాటాలను విక్రయించేందుకు చర్యలను తీసుకుంటుంన్నట్లు మంత్రి తెలిపారు. తదననుగుణంగా చర్యలు చేపట్టాలని ఇప్పటికే వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులతో పాటు రైతు బజార్ల సి.ఇ.ఓ.కు కూడా ఆదేశాలు జారీచేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం చేపట్టిని ఈ కార్యక్రమాన్ని ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఈ నెల 20 నుండి రైతు బజార్లలో  సరసమైన ధరలకే  విక్రయిస్తున్న టమాటాలను కొనుగోలు చేసుకోవాలని వినియోగదారులకు మంత్రి విజ్ఞప్తి చేశారు.  

Tadepalli

2022-05-19 15:17:05

ఏపీలో 26జిల్లా సమాఖ్యలు.. DyCm బూడి

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా జిల్లాలు ఏర్పడినందున 26 జిల్లా సమాఖ్యలు ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం అమరావతిలోని తన చాంబర్ లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) పంచాయతి రాజ్, గ్రామీణాభివ్రుద్దిశాఖ పై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, కొత్తగాల ఏర్పడిన 13 జిల్లాల్లో జిల్లా సమాఖ్యలు సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేసి సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. పంచాయతీరాజ్ తో శతశాతం ఆడిట్ నిర్వహిస్తూ, జనరల్ బాడీ సమావేశాలు చక్కగా నిర్వహించాలని ఆదేశించారు. మహిళా సంఘాల అభ్యున్నతి కి వీఏఓలు కీలకంగా వ్యవహిరించేలా చూడాలన్నారు. 30-50 గ్రూపులకు ఒక  విఏఓ ఉండేలా చూడాలని హేతుబద్దంగా వారి నియామకాలు జరపాలన్నారు. ఇకపై మహిళలే వీఏఓలుగా ఉండాలని, దానికి సంబంధించి నిభంధనల మార్పు చేస్తూ వారి వయస్సు 18-45 వయస్సు ఉండేలా చేయాలన్నారు. అంతేకాకుండా స్థానికులకు, కాస్త చదువుకున్నవారికి మాత్రమే ఈ అవకాశాలు కల్పించాలన్నారు. మండల కమిటీ తో హెల్త్  సర్టిఫికేట్ ల వెరిఫికేషన్ చేయించడంతోపాటు అక్రమంగా సర్టిఫికేట్లు ఇచ్చిన వైద్యులపై చర్యలు  తీసుకోవాలని కూడా ఆదేశించారు. వికలాంగత్వ నిర్దారణ కోసం 6 నెలలకు ఒక సారి ప్రత్యెక సదరం క్యాంప్ ల ఏర్పాటు చేయాలని, ఆ సమాచారాన్ని అన్ని ప్రచార మాద్యమాల ద్వారా ప్రజలకు తెలిసేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ తదితరులు పాల్గొన్నారు.

Tadepalli

2022-05-19 15:09:50

ఏపీ ఎలక్టోరల్ చీఫ్ గా ముకేష్ కుమార్ మీనా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  ప్రధాన ఎన్నికల అధికారిగా ముకేష్ కుమార్ మీనా గురువారం మధ్యాహ్నం బాధ్యతలు చేపట్టారు. అమరవతి సచివాలయం ఐదో బ్లాక్ లోని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఛాంబరుకు మద్యాహ్నం 12.00 గంటలకు విచ్చేసిన ఆయన 12.06 గంటలకు కె.విజయానంద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే  ముకేష్ కుమార్ మీనా ను   కె.విజయానంద్  దుశ్శాలువాతో సత్కరించి అభినందించారు. అనంతరం ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బందిని ముకేష్ కుమార్ మీనాకు ఆయన పరిచయం చేశారు.

Tadepalli

2022-05-19 12:22:37

ఎస్సీ మహిళలకు హెవీ డ్రైవింగ్ లో శిక్షణ

ఎస్సీ మహిళలకు ఆర్టీసీలో బస్సు డ్రైవర్లుగా నియమించడానికి అవసరమైన హెవీ వెహికల్ డ్రైవింగ్ లో శిక్షణ ఇవ్వనున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. శిక్షణానంతరం దాదాపు 320 మహిళలు బస్సు డ్రైవర్లుగా ఉద్యోగాలను పొందే అవకాశం ఉందని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ ఏడాది రూ.136 కోట్లతో ఇన్ కం జనరేషన్, స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలను చేపట్టనున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చేపడుతున్న పథకాలను సచివాలయంలో మంత్రి నాగార్జున సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పిఎం అజయ్ పథకం కింద ఈ ఏడాది రూ.136 కోట్లతో పలు కార్యక్రమాలను చేపట్టనున్నామని చెప్పారు. ఈ పథకంలో భాగంగానే ఎస్సీ నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఇన్ కం జనరేషన్ కార్యక్రమాలను చేపడతామన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ లో భాగంగా పలు వృత్తి విద్యలలో శిక్షణలు ఇస్తామని, ఈ శిక్షణ పొందిన వారికి తప్పనిసరిగా ఉద్యోగాలు లభించేలా చూస్తామని తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్ లో భాగంగానే ఎస్సీ మహిళలకు భారీ వాహనాల డ్రైవింగ్ లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. హెవీ వెహికల్ డ్రైవర్లుగా శిక్షణ పొందిన మహిళలు ఆర్టీసీలో బస్సు డ్రైవర్లుగా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో ఎస్సీ మహిళలకు రిజర్వ్ చేసిన 320 డ్రైవర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అవన్నీ కూడా శిక్షణానంతరం ఎస్సీ మహిళలకు వచ్చేలా చూస్తామని మేరుగు నాగార్జున వివరించారు. డ్రైవింగ్ తో పాటుగా కార్పొరేట్ ఆస్పత్రుల ద్వారా మహిళలకు నర్సింగ్ లోనూ శిక్షణలు ఇస్తామని తెలిపారు. పిఎం అజయ్ పథకంలో భాగంగానే  ఎస్సీ కార్పొరేషన్ కు సంబంధించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న భూములలో ఉపాధి అవకాశాలను మెరుగుపర్చే నిర్మాణ కార్యక్రమాలను కూడా చేపడతామని వివరించారు. ఎన్.ఎస్.ఎఫ్.డీ.సీ, ఎన్.ఎస్.కే.ఎఫ్.డీ.సీ, భూమి కొనుగోలు  (ఎల్పీఎస్) తదితర పథకాలకు సంబంధించిన ప్రగతిని ఈ సందర్భంగా సమగ్రంగా సమీక్షించారు. కాగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎస్సీ కార్పొరేషన్ కు సంబంధించి  17 ఎకరాల భూములు ఖాళీగా ఉన్నాయని గుర్తించడం జరిగిందన్నారు. ఎస్సీ కార్పొరేషన్ భూములు ఎక్కడా అన్యాక్రాంతం కాకుండా వాటిని సర్వే చేసి సరిహద్దులు గుర్తించి, కంచె వేయడంతో పాటు అవి ఎస్సీ కార్పొరేషన్ భూములనే విషయాన్ని తెలియజేసే విధంగా వాటిలో బోర్డులను కూడా పాతాలని అధికారులను నాగార్జున ఆదేశించారు. ఖాళీ భూములు కాకుండా గతంలో కోళ్ల పెంపకం కోసం లబ్దిదారులకు లీజు కింద ఇచ్చిన భూములు కూడా ఉన్నాయని వాటన్నింటిని కూడా ఉపయోగంలోకి తీసుకురావడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1407 పౌల్ట్రీ షెడ్ల కోసం సుమారు 594 ఎకరాల భూములను కేటాయించడం జరిగిందని, ప్రస్తుతం ఈ షెడ్లలో 1245 దాకా నిరుపయోగంగా ఉన్నాయని అధికారులు గుర్తించడం జరిగిందని నాగార్జున వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్ కే.హర్షవర్ధన్, ఎస్సీ కార్పొరేషన్ జీఎం కరుణకుమారి ఇతర అధికారులు పాల్గొన్నారు.


Tadepalli

2022-05-19 10:03:03

Tadepalli

2022-05-19 06:00:19

ప్రొబేషన్ గడువు భారీగా పెంచేసినా.. ప్రసూతి సెలవులు నిబంధన తప్పలేదు..

‘మీ ఇంటికొస్తే ఏమిస్తారు.. మా ఇంటికొస్తే ఏం తెస్తారు’ అన్న సామెత మీకు గుర్తుందిగా.. సరిగ్గా ఆ సామెతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో  ఒక్కముక్క కూడా మిగిల్చకుండా పూర్తిగా వినియోగించుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగుల సర్వీసు ప్రొబేషన్ గడువు రెండేళ్లు పూర్తయిన తరువాత కూడా అదనంగా 9 నెలలు పెంచేసినా, నిబంధనల ప్రకారం ఆ సమయంలో మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలవులు తీసుకున్నవారికి ప్రభుత్వ నిబంధనలను మాత్రం పక్కాగా అమలు చేసింది.  ప్రసూతి సెలువులు తీసుకున్న మహిళా ఉద్యోగులకు సంబంధించి సెలువులు ఇచ్చిన ఆరు నెలలకు జీతాలు ఇచ్చినా.. ఆరోజులన్నీ లెక్కగట్టిన ఆ తరువాత మాత్రమే సర్వీసు రెగ్యులైజేషన్ కు డాక్యుమెంటేషన్ ప్రక్రియ చేపట్టింది. దీనితో ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ సమయం నుంచి నేటి వరకూ రెండవ శనివారం, ఆదివారం, సాధారణ సెలవులు అని తేడా లేకుండా అదనపు పనిగంటలు తమతో చేయించుకున్న ప్రభుత్వం అదనంగా 9నెలలు సర్వీసు ప్రొబేషన్  పెంచడం ద్వారా పేస్కేలు మొత్తం సుమారు రూ.లక్ష వరకూ కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరిగినా సర్వీసు ప్రొబేషన్ డిక్లరేషన్ విషయంలో మాత్రం సరైన క్లారిటీ ఇంకా రాలేదని వాపోతున్నారు. దేశంలో ఎక్కడా, ఏ రాష్ట్రప్రభుత్వమూ చేయించని విధంగా తమతో 33 నెలల పాటు ప్రొబేషన్ పీరియడ్ లో విధులు చేపట్టేలా చేసి తమకు కేవలం రూ.15వేలు మాత్రమే జీతంగా ఇచ్చిందని విమర్శిస్తున్నారు. 

దేశంలోనే ఒక వినూత్న వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసి గ్రామస్థాయిలో ప్రజలకు సేవలు అందించడానికి తమను ప్రత్యేక పోటీ పరీక్షలు పెట్టి ఉద్యోగాల్లోకి తీసుకున్నా.. ఆ సంత్రుప్తి మాత్రంలో తమలో ఎక్కడా కలగడం లేదనే నిరసన మహిళా ఉద్యోగుల్లో నెలకొని వుందని బహిరంగంగానే చెబుతున్నారు. తమ ఉద్యోగాలు అటెండరుకి ఎక్కువ.. జూనియర్ అసిస్టెంట్ కి తక్కువగా ఉన్నప్పటికీ పదోన్నతుల విషయంలోనైనా బాగుంటుందనుకుంటే అందులోనూ అవే ఇబ్బందులు వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయని, అసలు తమ సర్వీసులు రెగ్యులర్ అవుతాయో.. అయిన తరువాత ప్రభుత్వం గతంలో ప్రకటించిన విధంగా పేస్కేలు వుంటుందో.. లేదంటే ఇటీవల ప్రభుత్వం హెచ్ఆర్ఏ శ్లాబులు తగ్గించిన క్రమంలో జీతం మరింతగా తగ్గిపోతుందో తెలియని అయోమన స్థితిలో ఉన్నామని ఉద్యోగులంతా వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమాలరు ఒక లక్షా 25వేలకు మందికి పైగా ప్రస్తుతం ఉద్యోగులు 16 ప్రభుత్వశాఖలకు చెందిన వారు పనిచేస్తున్నారు. ఇందులో సుమారు 20శాతానికి పైగా మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలువులు ఆరు నెలలు వినియోగించుకున్నవారు ఉన్నారు. వాస్తవానికి ప్రసూతి సెలవులు ఆరు నెలలు పూర్తయిన తరువాత మరో మూడు నెలలు స్పెషల్ బేబీకేర్ లీవ్ ను కూడా ప్రభుత్వం మంజూరు చేస్తుంది. తమ పిల్లలు పుట్టిన సమయంలో తమ ఉద్యోగానికి సర్వీసు విషయంలో ఆరు నెలలు సర్వీసు రెగ్యులైజేషన్ కి వెనుక పడిపోయామని బాధపడుతున్న తల్లులు ఇక స్పెషల్ బేబీకేర్ సెలవులు తీసుకోకుండానే వారి పిల్లలను సాకుతూ వస్తున్నారు. మళ్లీ స్పెషల్ బేబీకేర్ లీవ్ పెడితే మరో మూడు నెలలు ప్రొబేషన్ పొడిగింపు వర్తిస్తుందనే భయంతో ఎవరూ ఆ సెలవుల జోలికే వెళ్లలేదు.

ఇప్పటికే సర్వీసు ప్రొబేషన్ ఆరునెలలు కాలం కోల్పోయిన మహిళా ఉద్యోగులు సర్వీసు ప్రొబేషన్ కు సంబంధించి జిల్లా అధికారుల నుంచి సర్వీస్ కంప్లీట్ డాక్యుమెంటేషన్లు రాక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమ సర్వీసు ప్రొబేషన్ కాలాన్ని ప్రభుత్వానికి అనుకూలంగా 9నెలలు గడువుని అదనంగా పెంచేసినా.. ప్రసూతి సెలవుల విషయంలో మాత్రం ఖచ్చితంగా నిబంధనలు అమలు చేసి, రెండవ శనివారాలు, ఆదివారాలు, పండుగ సెలవుల్లోనూ ప్రత్యేకంగా అదనపు పనులు చేయించుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రభుత్వ శాఖలోనూ లేనివిధంగా ఒక్క గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని ఉద్యోగులతోనే అదనంగా పనులు చేయించుకుని నిబంధనల్లో ఎలాంటి సడలింపులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు తమ శాఖకు మిగిలిన ప్రభుత్వ శాఖల మాదిరిగా సడలింపులు, ప్రత్యేక సెలవులు, స్పెషల్ బేబీకేర్ లీవులు వుంటాయో ఉండవో, అసలు వాటిని తమకు అమలు చేస్తారో లేదో కూడా తెలియని అయోమయ స్థితి నెలకొందని మహిళా ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ మహిళా ఉద్యోగులకు కూడా ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగానే ప్రసూతి సెలవులు, స్పెషల్ బేబీకేర్ లీవ్, కుటుంబ నియంత్ర ఆపరేషన్ చేయించుకోవడానికి సెలవులు ఇలా అన్ని అమలు చేయాలని ముక్త కంఠంతో కోరుతున్నారు. వీరి కోర్కెలు ఎలా వున్నా ముందు వీరి ఉద్యోగాలు రెగ్యులర్ అయితేనే ఏమైనా జరగడాని, ప్రభుత్వాన్ని కోరడానికి అవకశం వుంటుందనే కొసమెరుపు మాటలు సర్వత్రా వినవస్తుండటం విశేషం..!

Tadepalli

2022-05-19 03:32:53

పథకాల లక్ష్యసాధనపై దృష్టి సారించాలి

ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలను విజయవంతంగా అమలు చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని శాఖల కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ చెప్పారు.బుధవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు సియం సమావేశ మందిరంలో సిఎస్ అధ్యక్షతన కార్యదర్శుల సమావేశం జరిగింది.ఈసమావేశంలో ప్రధానంగా గత కార్యదర్శుల సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యల నివేదిక(ATR), సుస్థిరాభివృధ్ధి లక్ష్యాల సాధన,సైబర్ సెక్యురిటి,ఎపి ఆన్లైన్ లీగల్ కేసులో మానిటరింగ్ సిస్టమ్ తదితర అంశాలపై సమీక్షించారు.ముందుగా యాక్షన్ టేకెన్ రిపోర్టు కు సంబంధించి ఆయా శాఖల వారీగా కార్యదర్శులు వివరించారు.ముఖ్యంగా వివిధ పధకాలు,కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయడం ద్వారా మెరుగైన ఫలితాల సాధనకు అన్ని శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ డా.సమీర్ శర్మ ఆయా శాఖల కార్యదర్శులను ఆదేశించారు.నాడు-నేడు కింద చేపట్టిన వివధ పనులు,నైపుణ్య శిక్షణాభివృద్ధి కార్యక్రమాలు,జాతీయ రహదార్లు,ఆర్ అండ్బి,పంచాయితీరాజ్ రహదార్లు అభివృద్ధికి చేపట్టిన చర్యలను ఆయా కార్యదర్శులు సిఎస్ కు వివరించారు.అదే విధంగా జగనన్న శాశ్వత భూహక్కు,జగనన్న సంపూర్ణ భూరక్ష పధకం,భూముల రీసర్వే,గ్రామాలు,పట్టణాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్ తదితర అంశాలను సిఎస్ సమీక్షించారు.

ఎపి ఆన్లైన్ లీగల్ కేసు మేనేజిమెంట్ సిస్టమ్ (APOLCMS) గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ మాట్లాడుతూ ఇదొక మంచి విధానమని లీగల్ కేసుల నిర్వహణకు సంబంధిత శాఖల్లో నియమించబడిన లైజన్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టేలా చర్యలు తీసుకోవాలని కార్యదర్శులను ఆయన ఆదేశించారు.సంబంధిత శాఖల లైజన్ అధికారులు ప్రతి రోజు ఈ ఎపిఓఎల్సియంను మానిటర్ చేస్తూ కోర్టుల్లో నమైదైన కేసు దానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సంబంధిత శాఖ కార్యదర్శికి తెలియజేయడం ద్వారా ఆయా కేస్లులో సకాలంలో కౌంటర్లు దాఖలు చేయడం వంటి చర్యలు తీసుకోవడం ద్వారా కోర్టులకు సకాలంలో వివరాలు అందించాలని చెప్పారు.ఇకపై ప్రతినెల అడ్వకేట్ జనరల్ తో కలిసి జిపిలు,సంబంధిత శాఖల కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేసి లీగల్ కేసులపై సమీక్షించడం ద్వారా ప్రభుత్వానికి సంబంధించి కోర్టు కేసుల పెండెన్సీని తగ్గించేందుకు వీలుగా కోర్టులకు సకాలంలో వివరాలు సమర్పించేందుకు కృషి చేయాల్సి ఉందని సిఎస్.డా.సమీర్ శర్మ పేర్కొన్నారు.

నీతి ఆయోగ్ నిర్దేశించిన ప్రకారం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు ఆన్ని శాఖలు ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన లక్ష్యాల సాధనకు కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ కార్యదర్శులను ఆదేశించారు.ఇందుకుగాను అందరు కార్యదర్శులు ఈఅంశాన్నినిరంతరం మానిటర్ చేయాలని చెప్పారు.సుమారు 415 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు ప్రణాళికాశాఖ ఎస్ఓపిలు(స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లను)రూపొందించినట్టు ఆశాఖ కార్యదర్శి విజయకుమార్ వివరించగా అందుకు అనుగుణంగా ఆయా లక్ష్యాల సాధనకు తగిన చర్యలు తీసుకోవాలని కార్యదర్శులను సిఎస్ డా.సమీర్ శర్మ ఆదేశించారు.అనంతరం సైబర్ సెక్యురిటీకి సంబంధించి రూపొందించిన డేటా బేస్ వివరాలను ఐటి మరియు కమ్యునికేషన్స్ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి వివరించారు.ఇంకా ఈసమావేశంలో వివిధ అంశాలకు సంబంధించి కార్యదర్శులతో సిఎస్ డా.సమీర్ శర్మ సమీక్షించారు. ఈసమావేశానికి తొలుత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ స్వాగతం పలికి అజెండా అంశాలను వివరించారు.సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సాయిప్రసాద్, నీరబ్ కుమార్ ప్రసాద్,బి.రాజశేఖర్,రజత్ భార్గవ,అనంతరాము,పూనం మాలకొండయ్య, అజయ్ జైన్, వై.శ్రీలక్ష్మి,పలువురు ముఖ్య కార్యదర్శులు,కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Tadepalli

2022-05-18 13:43:26

వారి సర్వీస్ రెగ్యులైజేషన్ పై క్లారిటీ ఏది..?

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జూన్ నెలాఖరు నాటికి పండుగ వస్తుందా అంటే ఏమో  ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నామంటున్నారు ఆ శాఖ ఉద్యోగులు.. అదేంటి అనుకుంటున్నారా.. మాకూ(మీడియాకి కూడా) అదే డౌటనుమానం వచ్చింది. వాస్తవానికి ఏప్రభుత్వ శాఖలో అయినా ఉద్యోగంలో చేరిన రెగ్యులర్ ఉద్యోగికి రెండేళ్లు మాత్రమే సర్వీసు ప్రొబేషన్ ఉంటుంది. రెండేళ్లు దాటగానే ఆటోమేటిక్ గా సర్వీసు రెగ్యులర్ చేస్తూ సాధారణ ఉద్యోగిలా మారుస్తుంది ప్రభుత్వం. దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన విధానమేమో.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సచివాలయ ఉద్యోగులకు దేశంలో ఎక్కడా లేనివిధంగా 33 నెలలు అంటే రెండేళ్ల 9 నెలలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో ప్రభుత్వం ప్రొబేషన్ సర్వీసు చేయిస్తోంది ఆ రూ.15వేలు మాత్రమే జీతం ఇస్తూ(కాంట్రాక్టు ఉద్యోగులకు సైతం ఇదే ప్రభుత్వం నెలకు రూ.18వేలు ఇస్తోంది).. ఆ క్రమంలోనే జూన్ నెలాఖరు నాటికి సచివాలయ ఉద్యోగుల సర్వీసులు రెగ్యులర్ చేస్తామని ప్రకటించింది. దీనితో జూన్ నెల ఎప్పుడు వస్తుందా అంతా ఎదురు చూశారు. జూనెల నెల రావడానికి ఇంకా 13  రోజులు మాత్రమే గడువు వుంది. అయినా సచివాలయ ఉద్యోగుల సర్వీసు రెగ్యులైజేషన్ విషయంలో ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. మొన్నటి క్యాబినెట్ భేటీలో కూడా సచివాలయ ఉద్యోగుల సర్వీసు రెగ్యులైజేషన్ పై ప్రకటన వస్తుందని అంతా ఆశగా ఎదురు చూశారు. కానీ ప్రకటన రాకపోవడంతో అంతా నిరాశ చెందారు. కానీ రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగుల నుంచి మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లా శాఖల అధికారులు మాత్రం రెగ్యులైజేషన్ కి సంబంధించిన డాక్యుమెంటేషన్ పూర్తిచేస్తుంది. ఇంత జరుగుతున్నా ఉద్యోగుల్లో మాత్రం సర్వీసు రెగ్యులర్ అవుతుందా అంటే మళ్లీ ప్రొబేషన్ సర్వీస్ పొడిగిస్తారేమోననే అనుమానం వ్యక్తం చేస్తున్నారు తప్పితే పక్కాగా చెప్పలేకపోతున్నారు. దానికి కారణం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసు రెగ్యులైజేషన్ విషయంలో అటు ప్రభుత్వం కూడా జిల్లాశాఖ అధికారులకు సరైన సమాచారం, ఆదేశాలు ఇవ్వకపోవడమే కారణంగా కనిపిస్తుంది.  రాష్ట్రప్రభుత్వం సచివాలయ ఉద్యోగులను 9నెలల క్రిందట రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్నవారికి ప్రొబేషన్ డిక్లేర్ చేసి వారి ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తామని ప్రకటించింది. ఆఖరి 8వనెల అపుడే సగానికి పైగా రోజులైపోయినా.. ప్రభుత్వం నుంచి మాత్రం చిన్న ప్రకటన కూడా రాలేదు. చూడాలి జూన్ నెలలోనైనా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేస్తూ.. వారి ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తున్నామనే ప్రభుత్వ ప్రకటన వస్తుందో లేదోనని..!

Tadepalli

2022-05-18 04:56:47

డా..వైఎస్సార్ సంచార పశు ఆరోగ్యసేవ

కుయ్‌.. కుయ్‌.. కుయ్‌.. అంటూ ఎక్కడ ఎవరికి ఏ చిన్న ఆపద వచ్చినా ఒక్క ఫోన్‌ కాల్‌తో నిమిషాల్లో ఆపద్భాంవుడిలా వచ్చి సేవలందిస్తున్న 108 అంబులెన్స్ తరహాలోనే... ఇప్పుడు పశువులకు కూడా సేవలందించడానికి, పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం అత్యాధునిక సౌకర్యాలతో ప్రభుత్వం తీసుకొచ్చిన ‘డాక్టర్ వైఎఎస్సార్ సంచార పశు వైద్యశాల’(మొబైల్‌ వెటర్నరీ అంబులేటరీ క్లినిక్‌) వాహనాలు మే 19 నుంచి సేవలందించబోతున్నాయి. "డా. వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ" పథకం ద్వారా దాదాపు రూ.278 కోట్ల వ్యయంతో మొత్తం 340 సంచార పశు వైద్యశాల వాహనాలు కొనుగోలుతో పాటు వాటి నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక వాహనం చొప్పున 175 వాహనాలను సీఎం క్యాంపు కార్యాలయం వద్ద గురువారం ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభ నున్నారు. "డా. వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ” పథకం ద్వారా ప్రస్తుతం మొదటి దశలో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున రూ.142.90 కోట్ల వ్యయంతో 175 వాహనాలు, రెండవ దశలో రూ.134.74 కోట్ల వ్యయంతో మిగిలిన 165 వాహనాలు కొనుగోలుతో పాటు నిర్వహణ చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాలలో సైతం పాడి పశువులతో పాటు, పెంపుడు జంతువులకు అత్యవసరమైన, నాణ్యమైన పశువైద్యసేవలు అందించేందుకు వీలుగా ఈ వాహనాల నిర్వహణకు కూడా మన ప్రభుత్వమే బాధ్యత వహిస్తూ.. ఒక్కొక్క వాహన నిర్వహణకు నెలకు రూ.1.90 లక్షల చొప్పున మొత్తం రెండేళ్లకుగాను దాదాపు రూ. 155 కోట్ల నిధులను కేటాయించడం జరిగింది. సంచార పశువైద్య శాలల ద్వారా పశు ఆరోగ్య సేవలతో పాటు అనారోగ్య పశువు ఉన్న చోటనే సత్వరమే పశువ్యాధి నిర్ధారణ చేసి, ఖచ్చితమైన నాణ్యమైన పశువైద్యం అందించడంతో పాటు, ఆయాప్రాంతాలలో పశువ్యాధులు వాప్తి, నిర్మూలన వంటి అంశాలను అంచనా వేయడంతో పాటు కృత్రిమ గర్భోత్పత్తి సేవలు అందించడం జరుగుతుంది. ఈ వాహనంలో ఒక పశువైద్యుడు, వెటర్నరీ డిప్లొమా చేసిన సహాయకుడు, డ్రైవర్ కం అటెండర్ మొత్తం ముగ్గురు సిబ్బంది ఉంటారు. ఈ వాహనంలో 20 రకాల పేడ సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్త సంబంధిత పరీక్షలు నిర్వహించేందుకు గాను మైక్రోస్కోప్ సౌకర్యము ఉన్న చిన్న ప్రయోగశాల, అవసరమైన మందులు, కృత్రిమ గర్భధారణ సేవలు, పశువును వాహనంలోకి ఎక్కించేందుకు హైడ్రాలిక్ సౌకర్యం ఉండేలా తీర్చిదిద్దారు.

 రాష్ట్రాన్ని పశుగణ రంగంలో దేశములోనే ప్రధమ స్థానంలో ఉంచాలని, పశుపోషణను మరింత లాభసాటిగా మార్చాలని పశుపోషకులకు మరింత చేరువగా అత్యుత్తమ పశువైద్య సేవలు అందించాలని టోల్ ఫ్రీ నెంబర్ 1962తో పశువైద్య టెలి మెడిసిన్ సౌకర్యం ఏర్పాటు చేశారు. మనిషి ఆపదలో ఉన్నాడని ఫోన్ చేయగానే కుయ్.. కుయ్.. మని అంటూ 108 మరియు 104 అంబులెన్స్ ఎలా వాలిపోతాయో అలాగే పశువు అనారోగ్యానికి గురైనప్పుడు కేటాయించిన టోల్ ఫ్రీ నెంబర్ 1962కు ఫోన్ చేయగానే మారుమూల ప్రాంతాలలోని పశుపోషకులు గుమ్మం వద్దకే నేరుగా సంచార పశువైద్య శాల వాహనం సిబ్బందితో వచ్చి వైద్యం అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ‘డా. వైఎస్సార్ పశు ఆరోగ్య సేవ’ పథకం అమలు ద్వారా మన రాష్ట్రములోని మారుమూల ప్రాంతాలలో ఉన్న పశుపోషకులకు సైతం రైతు గుమ్మం వద్దనే సత్వర, ఖచ్చితమైన, నాణ్యమైన పశువైద్యం అంది మూగజీవాలలో మరణాల శాతం తగ్గుతుంది. తద్వారా పశువుల యొక్క ఆరోగ్య స్థితి మెరుగుపడి పశుసంవర్థక శాఖ అమలు చేసే వివిధ సంక్షేమ పథకాల ద్వారా పశుపోషణ అవసరాలను అధిగమించి పశువులలో ఉత్పాదక శక్తి మరియు ఉత్పత్తి పెరుగుతుంది. పశూత్పత్తులైన పాలు, గ్రుడ్లు, మాంస ఉత్పత్తులు పెరిగి పశుపోషకుల సగటు ఆదాయం పెరిగి వారి జీవన స్థాయి మెరుగు పడటమే కాకుండా జాతీయ స్థూల సంపద పెరుగుదలకు కూడా తోడ్పడే విధంగా.. మనుషుల ఆరోగ్యానికే కాక పశువుల ఆరోగ్యానికి సైతం భద్రత, భరోసా కల్పించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.  

Tadepalli

2022-05-17 16:00:27

విద్యుత్ రంగ అక్రమాలపై ఇక ఉక్కుపాదం

విద్యుత్ రంగంలో అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని ఇంధనశాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో విద్యుత్ విజిలెన్స్ అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విజిలెన్స్ విభాగం పటిష్టంగా ఉంటేనే విద్యుత్ చోరీలు, దుర్వినియోగం, విద్యుత్ నష్టాలను నియంత్రించ గలుగుతామని తెలిపారు. సీఎం  వైయస్ జగన్ విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు, ప్రజలకు, రైతులకు, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఒకవైపు రైతులకు ఉచిత విద్యుత్ ను అందించడం, మరోవైపు వినియోగదారులకు మెరుగైన విద్యుత్ ను సరఫరా చేరేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ క్రమంలోనే విద్యుత్ సరఫరా, పంపిణీలో నష్టాలను పూర్తిస్థాయిలో తగ్గించుకునేందుకు అధికారులు దృష్టి సారించాలని కోరారు. అదే క్రమంలో అక్రమ విద్యుత్ వినియోగం, చౌర్యం, అనుమతి లేకుండా అధిక లోడ్ లను వినియోగించుకోవడం, మీటర్ల ట్యాంపరింగ్ తదితర అక్రమాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని కోరారు. గృహ వినియోగంతో పాటు పారిశ్రామిక వినియోగంపై కూడా అధికారులు తనిఖీలు నిర్వహించాలని కోరారు. తనిఖీల ప్రక్రియ నిరంతరం కొనసాగాలని సూచించారు.

సీఎం వైయస్ జగన్  అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యుత్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి అన్నారు. 2019-20లో విద్యుత్ సరఫరా, పంపిణీలో 13.02 శాతం నష్టాలు ఉంటే, 2020-21 నాటికి వాటిని 9.83 శాతంకు తగ్గించేందుకు ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యలే కారణమని అన్నారు. ఈ నష్టాలను మరింతగా తగ్గించాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. ఐఆర్డిఎ మీటర్లను బిగించడం, ఓవర్ లోడ్ సెక్షన్ లలో అదనంగా ఫీడర్లను ఏర్పాటు చేయడం, అదనపు లోడ్ డిమాండ్ ఉన్న చోట్ల కొత్త డిటిఆర్ లను ఏర్పాటు చేయడం, విద్యుత్ చౌర్యంపై అనుమానం ఉన్న ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేయడం వంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. అధికారులు ఇన్నోవేటీవ్ గా ఆలోచించాలని, మొక్కుబడిగా పనిచేస్తే కుదరదని స్పష్టం చేశారు. విద్యుత్ అక్రమాలను అరికట్టేందుకు విజిలెన్స్ అధికారులతో పాటు జిల్లాల్లోని పోలీస్ యంత్రాంగం సహకారం కూడా తీసుకోవాలని, అందుకోసం అవసరమైతే జిల్లా ఎస్పీలతో సంయుక్త సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు.

విద్యుత్ మీటర్లపై తెలుగుదేశం పార్టీ రైతులను తప్పుదోవ పట్టిస్తోందని మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఏటా ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం సబ్సిడీగా పదివేల కోట్ల రూపాయలను విద్యుత్ సంస్థలకు చెల్లిస్తోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని అన్నారు. సీఎం  వైయస్ జగన్ వ్యవసాయానికి అందించే విద్యుత్ నాణ్యతతో ఎటువంటి అంతరాయాలు లేకుండా ఉండాలని అధికారులకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారని అన్నారు. ఇదే క్రమంలో మీటర్లను బిగించడం ద్వారా వాస్తవానికి వ్యవసాయానికి ఎంత విద్యుత్ వాడుతున్నామో నికరంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 28 వేల వ్యవసాయ కనెక్షన్ లకు ప్రయోగాత్మకంగా విద్యుత్ మీటర్లు బిగించడం ద్వారా 33 శాతం తక్కువగానే విద్యుత్ వినియోగం జరుగుతున్నట్లు తేలిందన్నారు. రాష్ట్రం మొత్తం కూడా వ్యవసాయ కనెక్షన్ లకు మీటర్లు బిగించడం వల్ల ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ కు ఇస్తున్న సబ్సిడీ పదివేల కోట్ల రూపాయలలో 33 శాతం అంటే దాదాపు 3500 కోట్ల రూపాయల వరకు ఆదా అవుతుందని అన్నారు. ఈ సొమ్మును ప్రజలకే సంక్షేమం, అభివృద్ధి కోసం ఖర్చు చేయవచ్చని అన్నారు. వ్యవసాయ కనెక్షన్ లకు మీటర్లను ఏర్పాటు చేసి, రైతులు వినియోగించుకున్న విద్యుత్ కు చెల్లించాల్సిన మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని, ఆ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకే జమ చేస్తుందని అన్నారు. రైతులే డిస్కం లకు చెల్లింపులు చేస్తారని, దీనివల్ల రైతుల్లోనూ జవాబుదారీతనం పెరుగుతుందని తెలిపారు. ఇందులో రైతులకు జరుగుతున్న నష్టం ఏమిటో ప్రతిపక్షం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేసే ప్రతిపనిని వ్యతిరేకించడం, మంచిని అడ్డుకోవడమే చంద్రబాబుకు అలవాటుగా మారిందని విమర్శించారు.

2021-22 ఆర్థిక సంవత్సరంలో డిపిఇ వింగ్ రాష్ట్ర వ్యాప్తంగా 5,31,140 విద్యుత్ సర్వీసులను తనిఖీ చేసినట్లు అధికారులు వివరించారు. దీనిలో 59.583 కేసుల్లో అక్రమాలు వెలుగుచూశాయని అన్నారు. ఈ కేసుల్లో 15,139 విద్యుత్ చౌర్యం కింద నమోదయ్యాయని తెలిపారు. అక్రమాలకు పాల్పడిన కేసులకు సంబంధించి రూ.131.90 కోట్ల రూఆపయలను జరిమానగా విధించడం జరిగిందని, దీనిలో 65.49 కోట్ల రూపాయలను వసూలు చేశామని తెలిపారు. ఒక్క విద్యుత్ చౌర్యం కేసుల ద్వారానే రూ.10.66 కోట్లు వసూలయ్యాయని పేర్కొన్నారు. గత ఏడాది మొత్తం 189 ఫిర్యాదులపై విజిలెన్స్ అధికారులు 137 కేసులు నమోదు చేశారని, మరో 52 కేసులకు సంబంధించి కేసులు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. ఈ సమావేశంలో ట్రాన్స్ కో విజిలెన్స్ జెఎండి మల్లారెడ్డి, డైరెక్టర్ (హెచ్ఆర్ & ఐఆర్) సయ్యద్ రఫీ, సివిఎస్ వి టి. పనసరెడ్డి, అడిషనల్ ఎస్పీ లావణ్య లక్ష్మి, పలువురు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Tadepalli

2022-05-17 15:44:40

అన్నవరం సత్యదేవుని పుష్ఫయాగం..లైవ్

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్లకు పుష్పయాగం నిర్వహిస్తున్నారు. స్వామివారి కళ్యాణం తరువాత అత్యంత వైభవంగా చేపట్టే ఈ కార్యక్రమాన్ని తెలుగురాష్ట్రాలతోపాటు, ప్రపంచవ్యాప్తంగా వున్న భక్తులు తిలకించేందుకు వీలుగా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ens live మరియు  www.enslive.net ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో ప్రత్యేకంగా అందిస్తోంది. స్వామివారి పుష్పయాగ వైభవాన్ని భక్తులందరూ తమ అరచేతిలోనే మొబైల్ ఫోన్ ద్వారా తిలకించవచ్చు. సత్యదేవుని సేవలో తరించే ఈఎన్ఎస్ లైవ్ యాప్ అందించే మరిన్ని అప్డేట్స్ ను తెలుసుకోవాలనుకుంటే తక్షణమే గుగూల్ ప్లేస్టోర్ నుంచి ఈఎన్ఎస్ లైవ్ యాప్ ను ఇనిస్టాల్ చేసుకోవాలని సూచిస్తున్నాం.

Annavaram

2022-05-17 07:28:07

విశాఖ పొలిటికల్(పరిపాలన)రాజధాని..!

విశాఖపట్నం పరిపాలనా రాజధానా..? పొలిటికల్ రాజధానా..? అంటే పొలిటికల్ రాజధాని అనే సమాధానం వస్తోంది ప్రతీనోటా..అవును నూతన జిల్లాల విభజన తరువాత  ఆంధ్ర ప్రదేశ్ లో పెద్ద జిల్లాల సరసన ఉండే విశాఖ ఇపుడు అతి చిన్న జిల్లాగా మారిపోయింది. కేవలం ఐదు నియోజకవర్గాల పరిధి మాత్రమే. ఇంకా కరెక్టుగా చెప్పాలంటే రూరల్ జిల్లా లేని జిల్లాగా మారిపోయిన జిల్లా. రాష్ట్రానికి ఆర్ధిక రాజధానిగా వున్న విశాఖను అధికారంలోకి వచ్చిన తరువాత పరిపాలనా(ఎగ్జిక్యూటివ్ కేపిటల్) రాజధానిగా చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అదే నిర్ణయాన్ని కోర్టులో ఉపసంహరించుకుంది. దీనితో పరిపాలనా రాజధాని ఆశలపై నీళ్లు చల్లినట్టు అయ్యింది. ఎలాగూ పరిపాలనా రాజధాని కాలేదు కాబట్టి విశాఖపట్నం జిల్లా పొలిటికల్ రాజధానిగా మారిపోయింది. అవునండీ ఈ విషయాలను బేరీజు వేసుకుంటే మీరు కూడా విశాఖపట్నం పొలిటికల్ రాజధానిగా మాత్రమే లెక్కగడతారు. రాష్ట్రంలో నూతన జిల్లాలు ఏర్పడినా జిల్లా పరిషత్ లు మారలేదు.  కొత్తజిల్లాల్లో కార్పోరేషన్ స్థాయి జిల్లాలు ఉన్నా కొత్తగా కార్పోరేషన్ లు ఏర్పడలేదు. ఏమీ లేకున్నా అంతర్జాతీయ విమానాశ్రయం, పోర్టు, తూర్పునావికాదళం, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉండటంతో విశాఖపట్నం కాస్త పొలిటికల్ రాజధాని అయిపోయింది. విశాఖపట్నం జిల్లా మీదుగానే అన్ని జిల్లాలకు ప్రయాణించే కేంద్ర, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర అధికారులు ప్రయాణించడానికి, ట్రాన్సిట్ హాల్టులు చేయడానికి.. అలా చేసిన సమయంలో రాజకీయం చేయడానికి మంచి వేదికగా మారిపోయింది. ఒకప్పుడు విశాఖలో పనిచేయడానికి అటెండర్లు దగ్గర నుంచి ఐఏఎస్ లు వరకూ క్యూ కట్టేవారు. నూతన జిల్లాలు ఏర్పడిన తరువాత రాష్ట్రంలో విశాఖ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. చిన్నజిల్లాగా మారిపోవడం, ఆపై అనునిత్యం రాజకీయనాయకులు, రాష్ట్రస్థాయి అధికారులు, త్రివిధ దళాల అధికారుల రాకపోకలు వారికిచ్చే ప్రోటోకాల్ కే సమయం మొత్తం అధికారులకు ప్రజాప్రతినిధులకు గడిచిపోతుంది. విశాఖలోని అన్నిశాఖల అధికారులు మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర అధికారులు నిత్యం రాకపోకలు సాగిస్తుండటంతో పొలిటికల్ ప్రోటోకాల్ కూడా అధికంగా మారిపోయింది. దీనితో ఒకప్పుడు పరిపాలనా రాజధాని అవుతుందనుకున్న విశాఖపట్నం నేడు పొలిటికల్ రాజధానిగా రూపాంతరం చెందుతోంది.

రాష్ట్రప్రభుత్వం విశాఖపట్నం జిల్లాను పరిపాలనా రాజధాని చేయాలనుకున్నా..వారి ప్రమేయం లేకుండానే పొలిటికల్ రాజధానిగా మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను అయితే విభజన చేసింది తప్పితే రాజకీయాన్ని విభజన చేయలేకపోయింది. కాదు కాదు రాజకీయనాయకులు తీరుమార్చులేకపోతున్నారు. అధికారికంగా జిల్లాలు విభజన జరిగినా.. ఇంకా విశాఖలోనే అన్ని పార్టీలకు చెందిన పార్టీ కార్యాలయాలు ఉన్నాయి. వాస్తవానికి పక్కజిల్లా నాయకులైనా.. ఇదే విశాఖ వేదికగా కార్యక్రమాలు చేపట్టడం ఇటు పార్టీ కేడర్ కు, ప్రజలకు ఇబ్బందిగానే ఉంటోంది. ఇక మీడియా విషయానికొస్తే విశాఖ కేంద్రంగానే కార్యకలాపాలన్నీ సాగిస్తున్నాయి. దీనితో రాజకీయపార్టీల నేతలందరూ ఏ విషయం చెప్పాలన్నా విశాఖ రావాల్సి వస్తుంది. ఇక్కడే ప్రెస్ మీట్ లు పెట్టాల్సి వస్తుంది. ఇలా విశాఖపట్నం పరిపాలనా రాజధాని నుంచి పొలిటికల్ రాజధానిగా మారిపోయి అన్ని వ్యవస్థలను చిన్నాభిన్నం చేసేసింది. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు దాటిపోతుంది. ప్రస్తుతం ప్రభుత్వం కూడా తాముచేసిన అభివ్రుద్ది ప్రజలకు చెప్పి, మళ్లీ అధికారం కోసం, ప్రత్యర్ధులను తలదన్నే విధంగా కార్యకలాపాలు చేపడుతుంది. ఈ తరుణంలో మూడు రాజధానుల విషయం అటకెక్కిపోయింది. ఆ ఊసు ఇపుడు ఏ రాజకీయపార్టీ కూడా ఎత్తడం లేదు. అందరూ 2024 ఎన్నికలకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. దీనితో విశాఖను అధికారుల నుంచి ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయపార్టీలు పొలిటికల్ పరిపాలన రాజధానిగానే వినియోగించుకుంటూ తమ కార్యకలాపాలు చేపడుతున్నారు. చూడాలి ఈ ప్రభుత్వంలోనే విశాఖ పరిపాలనా రాజధాని అవుతుందా..లేదంటే వచ్చే ఎన్నికలకు విశాఖను పరిపాలనా రాజధానికగా ఆశచూపి రాజకీయం చేస్తారా అనేది..!?

Visakhapatnam

2022-05-17 05:11:54

Visakhapatnam

2022-05-16 10:48:33

స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమ‌వారం స్వర్ణరథంపై అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. స్వర్ణరథంపై అమ్మవారిని దర్శిస్తే తలచిన పనులు నెరవేరడంతో పాటు, మరో జన్మ ఉండదని అర్చ‌కులు తెలిపారు.  ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఊరేగింపుగా స్వర్ణరథం మంటపానికి తీసుకొచ్చారు. ఉదయం 7 నుండి 8.30 గంటల వ‌ర‌కు స్వర్ణరథోత్సవం వేడుకగా జరిగింది. బంగారు రథాన్ని అధిరోహించిన అమ్మవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వ‌ర‌కు అమ్మవారి ఉత్సవర్లకు శుక్రవారపు తోటలో స్నపనతిరుమంజనం నిర్వహించ‌నున్నారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్ళతో అభిషేకం చేస్తారు.  రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు అమ్మ‌వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు.  ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో  లోకనాధం, ఏఈవో  ప్రభాకర్ రెడ్డి, అర్చకులు  బాబుస్వామి, సూప‌రింటెండెంట్ శేష‌గిరి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్  దామోదరం పాల్గొన్నారు.

Tirumala

2022-05-16 06:33:47