తిరుమల నాదనీరాజనం వేదికపై ఏప్రిల్ 10వ తేదీ నుండి పతాంజలి దర్శనం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు అదనపు ఎవి.ధర్మా రెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో బుధవారం ధర్మగిరి వేద విజ్ఙాన పీఠం, కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం పండితులతో అదనపు ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా టిటిడి నిర్వహించిన సుందరకాండ, సకల కార్యసిద్ధి శ్రీమద్ రామాయణ పారాయణం, యుద్ధకాండ, బాల కాండ, విరాటపర్వం, గీతా పారాయణ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా భక్తుల నుండి విశేష ఆదరణ లభించిందన్నారు. ఈనెల 9వ తేదీకి విష్ణు సహస్రనామ పారాయణం పూర్తవుతుందని దాని స్థానంలో శ్రీ కుప్పా విశ్వనాథ శర్మ ఆధ్వర్యంలో శ్రీరామనవమి పర్వదినాన్న సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు యోగ దర్శనం కార్యక్రమం ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీనితో పాటు భగవద్గీత శ్లోక పారాయణం నిర్వహిస్తారని చెప్పారు. అదేవిధంగా గరుడ పురాణం, సభా పర్వం, అరణ్యపర్వం వంటి ఇతర పారాయణ కార్యక్రమాలు ఒకటి పూర్తయిన తర్వాత ఒకటి ప్రారంభమవుతాయని వివరించారు. కాగా అంతకుముందు ప్రతి నెలా నిర్వహించే అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఇందులో తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆయా విభాగాల అధికారులతో ఆయన సమీక్షించారు.
ఏప్రిల్ 16న చెన్నైలో శ్రీనివాస కళ్యాణం : పర్వదినాన్న
టిటిడి ఆధ్వర్యంలో ఏప్రిల్ 16న చెన్నైలోని ఐలాండ్ గ్రౌండ్ లో శ్రీనివాస కళ్యాణం నిర్వహించనున్నట్లు అదనపు ఈవో తెలిపారు. శ్రీవారి కళ్యాణానికి ఆయా విభాగాలు చేయవలసిన ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్షించారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు, కృష్ణశేషాచల దీక్షితులు, గోవిందరాజ దీక్షితులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎస్ఇ - 2 జగదీశ్వర్ రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో రమేష్బాబు, ఎస్వీబిసి సిఈవో సురేష్ కుమార్, జియం శేషారెడ్డి, ఇతర విభాగాల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.