1 ENS Live Breaking News

హంస వాహనంపై స‌ర‌స్వ‌తి అలంకారంలో శ్రీ‌ మలయప్ప దివ్యమంగళ దర్శనం..

శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శుక్ర‌వారం రాత్రి 7 నుంచి 8 గంట‌ల వ‌రకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు హంస వాహనంపై వీణ ధ‌రించి స‌ర‌స్వ‌తి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు.  హంస వాహనసేవలో శ్రీ మలయప్పస్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచిక. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్ర‌హ్మ‌ప‌ద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి.  ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు  వై.వి.సుబ్బారెడ్డి దంప‌తులు, ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు  ప్ర‌శాంతి రెడ్డి,  స‌న‌త్‌కుమార్‌, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి దంపతులు, విజివో  బాలిరెడ్డి, ఆల‌‌య డెప్యూటీ ఈవో ర‌మేష్‌బాబు, పేష్కార్ శ్రీ‌హ‌రి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-10-08 16:40:57

చిన్న‌శేష వాహ‌నంపై గీతా కృష్ణుగా శ్రీ మ‌ల‌య‌ప్ప‌..

శ్రీవారి వార్షిక‌ బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శుక్ర‌వారం ఉద‌యం 9 నుంచి 10 గంట‌ల వ‌రకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై నెమ‌లి పింఛం, పిల్ల‌న‌గ్రోవి ధ‌రించి గీతా కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకి(నాగ‌లోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే కుటుంబ శ్రేయ‌స్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో బ్ర‌హ్మ‌ర‌థం, వృష‌భ‌, అశ్వ‌, ఏనుగుల‌దే అగ్ర‌స్థానం. కానీ కోవిడ్ - 19 కార‌ణంగా ఆల‌యంలోని క‌ల్యాణ‌మండ‌పంలో స్వామివారి వాహ‌న‌సేవ‌లు ఏకాంతంగా జ‌రుగుతున్న విష‌యం విదిత‌మే. శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణ‌మండ‌పంలో న‌మూనా బ్ర‌హ్మ‌ర‌థం, వృష‌భాలు, అశ్వాలు, ఏనుగుల సెట్టింగులు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తున్నాయి. ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టిటిడి ఛైర్మ‌న్  వై.వి.సుబ్బారెడ్డి దంప‌తులు, ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు  ప్ర‌శాంతి రెడ్డి,  స‌న‌త్‌కుమార్‌, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు,  సివిఎస్వో గోపినాథ్ జెట్టి దంప‌తులు, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వ‌ర‌రావు, విజివో బాలిరెడ్డి, ఆల‌‌య డెప్యూటీ ఈవో  ర‌మేష్‌బాబు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-10-08 07:26:55

పెద్ద‌శేష వాహ‌నంపై ప‌ర‌మ‌ప‌ద‌నాథునిగా..

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో మొద‌టిరోజు గురువారం రాత్రి 8.30 నుంచి 9.30 గంట‌ల వ‌రకు శ్రీ‌వారి ఆల‌యంలో పెద్ద‌శేష వాహ‌న సేవ జ‌రిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై (పెద్ద శేషవాహనం) ప‌ర‌మ‌ప‌ద‌నాథుని అలంకారంలో అనుగ్ర‌హించారు. అనంత‌శ్చ అస్మి నాగానాం... స‌ర్పానాం అస్మి వాసుకిః... తాను నాగుల‌లో శేషుడిని, స‌ర్పాల‌లో వాసుకిని అని సాక్షాత్తు ప‌ర‌మాత్మ చెప్పిన‌ట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆదిశేషుడు త‌న శిర‌స్సుపై స‌మ‌స్త భూభారాన్ని మోస్తుంటారు. ఆదిశేషుడు శ్రీహరికి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరయుగంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి  అత్యంత సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. స్వామివారికి పానుపుగా, దిండుగా, పాదుక‌లుగా, ఛ‌త్రంగా, వాహ‌నంగా శేషుడు సేవ చేస్తుంటాడు. శేషుడిని ద‌ర్శిస్తే పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి.ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టిటిడి ఛైర్మ‌న్‌   వైవి.సుబ్బారెడ్డి దంప‌తులు, ఈవో డాక్ట‌ర్ జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు ప్ర‌శాంతి రెడ్డి, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి దంప‌తులు, ఆలయ డెప్యూటీ ఈవో  ర‌మేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2021-10-07 16:35:58

ధ్వజారోహణంతో శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు..

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు గురువారం సాయంత్రం 5.10 నుంచి 5.30 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేద‌మంత్రోచ్ఛార‌ణ‌ మధ్య మంగళవాయిద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగురవేశారు. వాసుదేవ బ‌ట్టాచార్యులు కంక‌ణ‌భ‌ట్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను, స‌ప్త‌మ‌రుత్తులను (దేవ‌తాపురుషులు), రుషిగ‌ణాన్ని, స‌క‌ల ప్రాణికోటిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ గ‌రుడాళ్వార్ ధ్వ‌జ‌స్తంభాన్ని అధిరోహిస్తార‌ని ప్రాశస్త్యం.  విశ్వ‌మంతా గ‌రుడుడు వ్యాపించి ఉంటారు. ఆయ‌న్ను శ్రీ‌నివాసుడు వాహ‌నంగా చేసుకోవ‌డంతో స‌ర్వాంత‌ర్యామిగా స్వామివారు కీర్తించ‌బ‌డుతున్నారు. కాగా, ధ్వ‌జ‌ప‌టంపై గ‌రుడునితోపాటు సూర్య‌చంద్రులకు కూడా స్థానం క‌ల్పించ‌డం సంప్ర‌దాయం. ఈ సంద‌ర్భంగా పెస‌ర‌ప‌ప్పు అన్నం (పొంగ‌లి) ప్ర‌సాద వినియోగం జ‌రిగింది. ఈ ప్ర‌సాదం స్వీక‌రించిన వారికి సంతాన ప్రాప్తి, దీర్ఘాయుష్షు, సిరిసంప‌ద‌లు స‌మ‌కూరుతాయ‌ని విశ్వాసం. అదేవిధంగా, ధ్వ‌జ‌స్తంభానికి క‌ట్టిన ద‌ర్భ అమృత‌త్వానికి ప్ర‌తీక‌. పంచ‌భూతాలు, స‌ప్త‌మ‌రుత్తులు క‌లిపి 12 మంది దీనికి అధిష్టాన దేవ‌త‌లు. ఇది స‌క‌లదోషాల‌ను హ‌రిస్తుంది. ద‌ర్భ‌ను కోసేట‌ప్పుడు, కైంకర్యాల్లో వినియోగించేట‌పుడు ధ‌న్వంత‌రి మంత్ర పారాయ‌ణం చేస్తారు. ధ్వ‌జారోహ‌ణం అనంత‌రం తిరుమ‌ల‌రాయ మండ‌పంలో ఆస్థానం చేప‌ట్టారు.  ధ్వ‌జారోహ‌ణ ఘ‌ట్టానికి ముందు సాయంత్రం 3 నుండి 4.30 గంట‌ల వ‌ర‌కు బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్‌, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ విమాన ప్రాకారం చుట్టూ ఊరేగించారు. ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టిటిడి ఛైర్మ‌న్‌  వైవి.సుబ్బారెడ్డి దంప‌తులు, ఈవో డాక్ట‌ర్ జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు  ప్ర‌శాంతి రెడ్డి,  రాంభూపాల్ రెడ్డి,  మ‌ల్లిశ్వ‌రి,  మారుతి ప్ర‌సాద్,  మొరంశెట్టి రాములు, డా.శంక‌ర్, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి దంప‌తులు, ఆలయ డెప్యూటీ ఈవో ర‌మేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2021-10-07 14:04:09

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ..

తిరుమల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు ఏకాంతంగా జరుగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంపంగి ప్రాకారంలో వైఖాన‌స ఆగ‌మోక్తంగా బుధ‌వారం సాయంత్రం అంకురార్పణ జ‌రిగింది. అనంత‌రం సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల మధ్య ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలోకి సేనాధిప‌తి వారిని వేంచేపు చేసి ఆస్థానం నిర్వ‌హించారు.  వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. న‌వ ధాన్యాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సూర్యుడు అస్తమించిన తరువాతే అంకురార్పణ నిర్వహిస్తారు. జ్యోతిష శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చంద్రుడిని 'సస్యకారక' అంటారు. ఈ కారణంగా పగటివేళ అంకురాలను ఆరోపింపచేయడం తగదు. సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు. అంకురార్పణంలో 9 రకాల వివిధ ధాన్యాలను నాటడం తెలిసిందే. అంకురార్పణంలో నాటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా గొప్పగా నిర్వహించబడతాయి. విత్తనాలు నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు. యాగశాలలో ఈ మొత్తం కార్యక్రమం నిర్వహిస్తారు. అత్రి అనే మహర్షి తన 'సముర్తార్చన అధికరణ' అనే గ్రంథంలో అంకురార్పణ క్రమాన్ని రచించాడు. అంకురార్పణ జరిగే రోజు మధ్యాహ్నం వేళ విత్తనాలను కొత్త పాత్రలో నీటిలో నానబెడతారు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. ఇక్కడ బ్రహ్మపీఠాన్ని ఏర్పాటుచేస్తారు. ఆ తరువాత మంట ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, స్కంద , ఇంద్ర, ఇసాన, జయ అనే దేవతలను ఆహ్వానిస్తారు.  ఆ తరువాత భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపుతారు. చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠిస్తారు. ప్రతిరోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తారు. ఈ మొత్తం కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ సాగుతుంది. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి,  టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు  వైవి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంపతులు, బోర్డు స‌భ్యులు  మల్లీశ్వరి,  విద్యాసాగర్ రావు, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి దంపతులు, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి దంపతులు, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో ర‌మేష్‌బాబు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

సెప్టెంబర్ 7న ధ్వజారోహణం :

          శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలకు సెప్టెంబర్ 7వ తేదీ గురువారం సాయంత్రం 5.10 నుండి 5.30 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఆ తరువాత రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు పెద్దశేషవాహన సేవ ఉంటుంది.

Tirumala

2021-10-06 17:18:46

అక్టోబర్ 7నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు..

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో అక్టోబర్ 7 వ తేదీ నుంచి 15వ తేదీ వరకు శ్రీ ప్లవనామ సంవత్సర దసరా మహోత్సవాలు అతివైభవంగా నిర్వహించనున్నట్టు ధర్మకర్తల మండలి అధ్యక్షులు పైలా సోమనాయుడు, కార్యనిర్వహణాధికారి డి. భ్రమరాంబ తెలియజేశారు. ఈ సందర్భంగా మంగళవారం వారు మీడియాతో మాట్లాడారు. భక్తుల దర్శనాలకు అనుగుణంగా అన్ని రకాల ఏర్పాట్లు దేవస్థానంలో చేపట్టినట్టు చెప్పారు. కోవిడ్ ను ద్రుష్టిలో ఉంచుకొని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆలయంలో అమ్మవారి దర్శనాలకు ఏర్పాట్టు చేశామన్నారు. కాగా నవరాత్రి పర్వదినాల్లో అమ్మవారు ఒక్కోరోజు ఒక్కోరూపంలో భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. శ్రీ అమ్మవారి దివ్య అలంకారముల వివరాలు ఈ విధంగా ఉండనున్నాయి.

7-10-2021ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి గురువారం రోజున శ్రీ స్వర్ణకవచాలంకరణ శ్రీ దుర్గాదేవి.

8-10-2021 విదియ శుక్రవారం రోజున శ్రీ బాలా త్రిపురసుందరి దేవి.

9-10-2021 తదియ శనివారం రోజున శ్రీ గాయత్రీ దేవి.

10-10-2021 చవితి ఆదివారం రోజున శ్రీ లలితా త్రిపురసుందరి దేవి.

11-10-2021 పంచమి,షష్ఠి సోమవారం రోజున శ్రీ అన్నపూర్ణ దేవి, శ్రీ మహాలక్ష్మీ దేవి.

12-10-2021శుద్ధ సప్తమి మంగళవారం రోజున శ్రీ సరస్వతీ దేవి(మూలా నక్షత్రం).

13-10-2021శుద్ధ అష్టమి బుధవారం రోజున శ్రీ దుర్గాదేవి(దుర్గాష్టమి).

14-10-2021శుద్ధ నవమి గురువారం రోజున శ్రీ మహిషాసురమర్దని(మహార్ణవమి).

15-10-2021శుద్ధ దశమి శుక్రవారం రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి(విజయదశమి).

  11-10-2021తేదీ సోమవారం రోజున శుద్ధ పంచమి, షష్ఠి తిధులు వచ్చినందున శ్రీ అమ్మవారు మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం లోనూ, అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి శ్రీ మహాలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు.

15వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి కృష్ణా నదిలో హంసవాహన తెప్పోత్సవం జరుగుతుందన్నారు.

శ్రీ శివకామసుందరి దేవి అమ్మవారికి(ఉపాలయం)కూడా పేర్కొన్న విధంగా అలంకారములు ఉంటాయని తెలిపారు.

Vijayawada

2021-10-05 16:33:13

అక్టోబ‌రు 7నుంచి తిరుచానూరులో నవరాత్రి ఉత్సవాలు..

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అక్టోబ‌రు 7 నుంచి 15వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి. కోవిడ్ వ్యాధి వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ ఉత్స‌వాల‌ను ఏకాంతంగా నిర్వ‌హిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ప్రతిరోజూ మ‌ధ్యాహ్నం 2.30 నుంచి 4 గంట‌ల వ‌ర‌కు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు త‌దిత‌ర సుగంధ ద్ర‌వ్యాల‌తో విశేషంగా అభిషేకం చేస్తారు. అదేవిధంగా రాత్రి 7 నుంచి 8 గంట‌ల వ‌ర‌కు ఆల‌య ప్రాంగ‌ణంలోనే ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. అక్టోబరు 15వ తేదీనాడు ఆల‌యంలో గజ వాహనంపై అమ్మ‌వారిని వేంచేపు చేసి ఆస్థానం చేప‌డ‌తారు. ఈ ఉత్స‌వాల కార‌ణంగా అన్ని ఆర్జిత సేవ‌ల‌ను టిటిడి ర‌ద్దు చేసింది.

Tiruchanur

2021-10-05 12:57:22

ద‌ర్శ‌న టికెట్లు ఉంటేనే తిరుమ‌ల‌కు అనుమ‌తి..

శ్రీవారి ద‌ర్శ‌న టికెట్లు ఉన్న భ‌క్తుల‌ను మాత్ర‌మే తిరుమలకు అనుమ‌తిస్తామనిని లేదంటే అనుమతి ఉందడని టిటిడి ఒక ప్రకటనలో పేర్కొంది. కోవిడ్ వ్యాప్తి నివారణలో భాగంగా భక్తులు, ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని వ్యాక్సినేష‌న్ సర్టిఫికేట్ కానీ, దర్శనానికి 72 గంటల ముందు చేసుకున్న ఆర్‌టిపిసిఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ కానీ త‌ప్ప‌నిస‌రిగా తీసుకురావాల‌ని టిటిడి విజ్ఞ‌ప్తి చేసింది. ప‌లువురు భ‌క్తులు ద‌ర్శ‌న టికెట్లు లేకుండా స్వామివారి ద‌ర్శ‌నం కోసం వ‌స్తుండ‌డంతో అలిపిరి చెక్ పాయింట్ వ‌ద్ద సిబ్బంది త‌నిఖీ చేసి వెన‌క్కు పంపుతున్నారు. కావున భ‌క్తులు ఈ విష‌యాల‌ను గ‌మ‌నించి టిటిడికి స‌హ‌క‌రించాల‌ని అధికారులు కోరుతున్నారు.

Tirumala

2021-10-04 11:29:33

టిటిడి పాఠ‌శాల‌లకు ఐఎస్ఓ స‌ర్టిఫికెట్‌..

టిటిడి నిర్వ‌హ‌ణ‌లోని ఎస్వీ ఉన్న‌త పాఠ‌శాల‌, శ్రీ ప‌ద్మావ‌తి ఉన్న‌త పాఠ‌శాల‌, శ్రీ గోవింద‌రాజ స్వామి ఉన్న‌త పాఠ‌శాల‌, శ్రీ కోదండ‌రామ‌స్వామి ఉన్న‌త పాఠ‌శాల‌, ఎస్వీ ఒరియంట‌ల్ ఉన్న‌త పాఠ‌శాల‌, ఎస్వీ బ‌ధిర పాఠ‌శాల‌, ఎస్వీ సంగీత‌, నృత్య పాఠ‌శాల‌, ఎస్వీ నాద‌స్వ‌రం పాఠ‌శాల‌, తాటితోపులోని శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామి ఉన్న‌త పాఠ‌శాల‌, తిరుమ‌ల‌లోని ఎస్వీ ఉన్న‌త పాఠ‌శాల‌కు ఐఎస్ఓ స‌ర్టిఫికెట్ల‌ను సోమ‌వారం ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి చాంబ‌ర్‌లో ఆయ‌న చేతుల మీదుగా క‌మిటీ స‌భ్యులు ఆయా పాఠ‌శాల‌ల ప్ర‌ధానోపాధ్యాయుల‌కు అందించారు.  టిటిడి పాఠ‌శాల‌లో డాక్యుమెంట్ల నిర్వ‌హ‌ణ‌, ఉత్త‌మ మౌళిక స‌దుపాయాలు, విద్యార్థుల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌, ఆహార పంపిణీ, ఆపరేటింగ్ విధానం(ఎస్ఓపి), ఉత్త‌మ విద్యా ప్ర‌మాణాల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి ఐఎస్ఓ-9001 స‌ర్టిఫికెట్ల‌ను అందించారు.టిటిడి పాఠ‌శాల‌ల్లో భౌతిక దూరం, శుభ్ర‌త, పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌, కోవిడ్ - 19 నిబంధ‌న‌ల బాగా పాటించినందుకు గుడ్‌ హైజెనిక్ ప్రాక్టీస్ (జిహెచ్‌పి) స‌ర్టిఫికెట్ల‌ను అందించారు.టిటిడి పాఠ‌శాల్లో చ‌క్క‌టి విద్యా ప్ర‌మాణాలు, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ, రికార్డుల నిర్వ‌హ‌ణ చేస్తున్న టిటిడి ఉన్న‌త పాఠ‌శాల‌ల ప్ర‌ధానోపాధ్యాయులుసంధ్య‌,  చంద్ర‌య్య‌,  సురేంద్ర‌బాబు,  గీతాంజ‌లి,  ప‌ద్మావ‌తి,  క్రిష్ణ‌మూర్తి,  జ‌మునారాణి,  ర‌మ‌ణ‌మూర్తి,  క్రిష్ణ‌మూర్తిల‌ను ఈవో ఈ సంద‌ర్భంగా అభినందించారు.    జెఈవో స‌దా భార్గ‌వి, టిటిడి విద్యా శాఖాధికారి  గోవింద‌రాజ‌న్,  హెచ్‌వైఎం ఐఎస్ఓ స‌ర్టిఫికెష‌న్ ప్రైవేట్ లిమిటెడ్ యండి  ఆల‌పాటి శివ‌య్య పాల్గొన్నారు.

Tirupati

2021-10-04 10:59:47

పీఐబీలో ఆంధ్రప్రదేశ్ కి నేటికి దక్కని చోటు..!

ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నపుడు పీఐబీ(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) వెబ్ సైట్ లో హైదరాబాదుకి స్థానం ఉండేది. ఆ తరువాత రాష్ట్రం విడిపోయి పదేళ్లు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వ పీఐబి న్యూస్ వెబ్ సైట్ లో నేటికీ విభజన ఆంధ్రప్రదేశ్ చోటు సంపాదించలేకపోయింది. కాదు కాదు రాష్ట్ర అధికారుల వైఫల్యం వలన దేశ స్థాయిలో వచ్చే గౌరవం కోల్పోయింది. ఫలితంగా తెలంగాణ సీఎంఓ వార్తలు, కేంద్ర మంత్రులు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ లో పర్యటన చేసే సమయంలో చేసే పర్యటనలన్నీ న్యూడిల్లీ పీఐబీ పేరుతోనే వస్తున్నాయి తప్పితే.. అదే సమాచారం ఏపీ సీఎం, సీఎంఓకి మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దానికి కారణం కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ నిర్వహించే పీఐబీ న్యూస్ వెబ్ సైట్ లో ఆంధ్రప్రదేశ్ కి చోటు లేకపోవడమే. ఈ విషయమై నేటికీ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సీరియస్ గా స్పందించకపోవడమే దానికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి, సీఎం కార్యాలయంతోపాటు, ఇతర కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం అంతా పొందు పరిచి దేశవ్యాప్తంగా తెలియజేయాల్సి వుంది. అటు కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని పీఐబిలో చేర్చి.. అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన గౌరవమే ఆంధ్రప్రదేశ్ కి కూడా ఇవ్వాల్సి వున్నా ఆంధ్రప్రదేశ్ లోని రాష్ట్ర సమాచారశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మన రాష్ట్రానికి చోటు దక్కలేదు. పీఐబీలో ఆంధ్రప్రదేశ్ కి చోటు దక్కితే రాష్ట్రంలోని ప్రధాన మంత్రిత్వ శాఖల్లోని అంశాలను, అభివ్రుద్ధి కార్యక్రమాలను, జాతీయస్థాయి ప్రాజెక్టులను మనం తెలియజేయకుండానే దేశంలోని అన్ని రాష్ట్రాలు, ఐఏఎస్ అధికారులు పీఐబి న్యూస్ వెబ్ సైట్ ద్వారా వీక్షించే వీలుంటుంది. గతంలో టిడిపి హయాంలో ఆంధ్రప్రదేశ్ ని పీఐబీ వెబ్ సైట్ లో చేర్చి, ఏపీ సీఎంఓ దగ్గరే ప్రత్యేక కార్యాలయలయం ఏర్పాటు చేయాలని సూచించినా అది పలించలేదు. ఆ తరువాత కేంద్రం ఔట్ రీచ్ బ్యూరోలను ఏర్పాటు చేసినా.. అవి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అదేవిధంగా పీఐబీ కూడా రాష్ట్రంలోనీ మీడియా సంస్థలకు పీఐబీలో వచ్చిన వార్తల న్యూస్ లింకులనే షేర్ చేయడం విశేషం. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి సర్కారు కూడా పీఐబీలో ఏపీకి స్థానం సంపాదించలేకపోయింది. విశేషం ఏంటంటే రాష్ట్ర పీఐబీ కార్యాలయం విజయవాడలో ఉన్నప్పటికీ అందులో సీఎం, సీఎంఓకి చెందిన ముఖ్య సమాచారం మాత్రం అందులో కనిపించడం లేదు. దీనితో ఏపీ సమాచారశాఖకు, రాష్ట్రప్రభుత్వానికి పీఐబీ వెబ్ సైట్ లో ప్రాధాన్యత లేకుండా పోయింది. ఈ వెబ్ సైట్ లో రాష్ట్రాలకు చోటు దక్కడం ద్వారా రాష్ట్రంలో జరిగే అభివ్రుద్ధి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అధికారిక వర్గాలు, కేంద్రప్రభుత్వం చూసే వీలుంటుంది. ఈ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పీఐబీ వెబ్ సైట్ లో అధికారికంగా చోటు కల్పించాల్సిన బాధ్యత, దానికోసం కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా వుంది. లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ స్థాయిలో చేపట్టే పోలవరం లాంటి ప్రాజెక్టులు, గ్రామ సచివాలయ వ్యవస్థ లాంటి ప్రభుత్వ శాఖల పనితీరు కేంద్ర స్థాయిలో అన్ని రాష్ట్రప్రభుత్వాలకి తెలియజేసే అవకాశం ఉండదు. ఆంధ్రప్రదేశ్ కంటే చిన్న 12 రాష్టాలకు పీఐబీలో చోటు ఉండటాన్ని ఇప్పటికైనా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఏపీ ప్రభుత్వం, ముఖ్య సలహాదారులు గుర్తించాల్సిన అవసరం ఆశన్నమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ నియమించిన ప్రభుత్వ సలహాదారుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ కి కేంద్రప్రభుత్వ పీఐబీలో స్థానం కల్పించే విషయంలో చొరవ తీసుకోలేదు. నేడో రేపో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వున్న ఆదిత్యనాధ్ దాస్ సైతం మరో ఏపీ ప్రభుత్వ సలహాదారుగా డిల్లీ కేంద్రంగా పని ప్రారంభించనున్నారు. కనీసం ఇప్పటికైనా రాష్ట్రానికి పీఐబీలో దక్కాల్సిన చోటు విషయమై ద్రుష్టిపెట్టకపోతే వచ్చే రెండున్నరేళ్లు, పరిపాలన, రాజకీయాలు తప్పా ఇలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకొని, అమలు చేసే తీరిక రాష్ట్రప్రభుత్వానికి కూడా ఉండకపోవచ్చు. చూడాలి ఏం జరుగుతుందనేది..!

New Delhi

2021-10-01 03:01:43

విఐపి బ్రేక్‌ దర్శనానికి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు..

తిరుమలలో శ్రీ‌వారి వార్షిక‌ బ్ర‌హ్మోత్స‌వాల సందర్భంగా అక్టోబ‌రు 7 నుంచి 15వ తేదీ వ‌ర‌కూ జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో అక్టోబ‌రు 5వ తేదీ మంగ‌ళ‌వారం శ్రీవారి ఆల‌యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వ‌హించ‌నున్నారు.  ఈ కార‌ణంగా అక్టోబ‌రు 4వ తేదీన విఐపి బ్రేక్‌ దర్శనాల కొరకు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఒకప్రకటనలో తెలియజేశారు. ఈ విషయాన్నిభక్తులు ఈ  గమనించి టిటిడికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. 

Tirumala

2021-09-28 12:07:46

అన్న‌మ‌య్య‌ సంకీర్త‌న‌ల‌పై నిరంత‌ర ప‌రిశోధ‌న‌లు..

పదకవితా పితామహుడు శ్రీతాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్త‌న‌ల‌పై నిరంత‌రం ప‌రిశోధ‌న‌లు నిర్వ‌హించేందుకు తిరుప‌తిలోని కేంద్రీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యంలో " అన్న‌మ‌య్య పీఠం " ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఈ విష‌య‌మై  సంస్కృత విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తితో చ‌ర్చించాల‌న్నారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శుక్ర‌వారం టిటిడి ధార్మిక ప్రాజెక్టుల‌పై ఈవో అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ డిజిటలైజేషన్ చేసిన అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల‌ను టిటిడి వెబ్‌సైట్‌లో ఉంచాల‌న్నారు. అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల‌కు విస్తృత ప్ర‌చారం క‌ల్పించేందుకు " అదివో అల్ల‌దివో "  కార్య‌క్ర‌మాన్ని ప‌టిష్టంగా నిర్వ‌హించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అన్న‌మ‌య్య‌, వెంగ‌మాంబ సంకీర్త‌న‌ల‌పై త్వ‌ర‌లో వ్యాస ర‌చ‌న‌, వక్తృత్వ, క్వీజ్ పోటీలు నిర్వ‌హించాల‌న్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ల‌భ్య‌మైన 14 వేల అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లకు అర్థ‌, తాత్ప‌ర్య విశేషాంశాల‌తో "  అన్న‌మ‌య్య సాహిత్య‌ లహ‌రి " పేరుతో భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకురావాల‌ని చెప్పారు.  అదేవిధంగా దాస సాహిత్యంలోని 5 నుండి 10 వేల దాస సంకీర్త‌న‌ల‌ను సేక‌రించేందుకు కృషి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. దాస సాహిత్య‌నికి విస్తృత ప్ర‌చారం క‌ల్పించేందుకు క‌ర్ణాట‌క‌లోని బెంగూళూరు విశ్వ‌విద్యాల‌యంతో ఒప్ప‌దం చేసుకోవాల‌ని సూచించారు. దాస సాహిత్య కీర్త‌న‌లు ప్ర‌చారం చేసేందుకు ఎస్వీబీసిలో ప్ర‌త్యేక టైం స్లాట్ కేటాయించాల‌న్నారు. ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు రికార్డు చేసిన 300 దాస సంకీర్త‌న‌ల‌తో "  దాస న‌మ‌నం "  పేరుతో క‌ర్ణాట‌క‌లో పాటల‌ పోటీలు నిర్వ‌హించాల‌ని ఈవో ఆదేశించారు. అనంత‌రం నాళాయిర దివ్యప్రబంధ ప్రాజెక్టు, ఆళ్వార్ దివ్య ప్ర‌బంధ ప్రాజెక్టు, ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టుల‌పై ఈవో స‌మీక్షించారు.  అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, ఎఫ్ఎ అండ్ సిఏవో  బాలాజి, టిటిడి ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రాం అధికారి  విజ‌య‌సార‌ధి, అన్న‌మాచార్య‌, వెంగ‌మాంబ ప్రాజెక్టుల సంచాల‌కులు ఆకెళ్ల విభీష‌ణ శ‌ర్మ‌, దాస‌సాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి  పి.ఆర్‌.ఆనంద తీర్థాచార్యులు ఈ స‌మీక్ష స‌మావేశంలో పాల్గొన్నారు.

Tirumala

2021-09-24 12:17:19

7నుంచి శ్రీవారిసాలకట్ల బ్రహ్మోత్సవాలు..

తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు అక్టోబ‌రు 7 నుంచి 15వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హిస్తామ‌ని, ఇందుకోసం ఏర్పాట్లు జ‌రుగుతున్నాయ‌ని డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి చెప్పారు.  ఈవో మీడియాతో మాట్లాడుతూ  కోవిడ్ మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు ఈ బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఏకాంతంగా నిర్వ‌హిస్తామ‌న్నారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఆహ్వానిస్తామ‌న్నారు. ఇదివ‌ర‌కు ప్ర‌క‌టించిన‌ట్టుగానే అంజ‌నాద్రిలో హ‌నుమాన్ జ‌న్మ‌స్థ‌లాన్ని అభివృద్ధి చేస్తామ‌ని తెలిపారు. నూత‌నంగా బాణీలు క‌ట్టిన అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల‌కు విస్తృత ప్ర‌చారం క‌ల్పించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని, ఇందులో భాగంగా అక్టోబ‌రులో రాష్ట్రవ్యాప్తంగా యువ‌త‌కు పోటీలు నిర్వ‌హిస్తామ‌ని వెల్ల‌డించారు. అక్టోబ‌రు 24,25వ తేదీల్లో చిత్తూరు జిల్లాలోని యువ‌త‌కు పోటీలు నిర్వ‌హిస్తామ‌ని, తిరుప‌తిలోని ఎస్వీబీసీ స్టూడియోలో వీటిని రికార్డు చేస్తామ‌ని తెలిపారు. ఆ త‌రువాత అద‌న‌పు ఈవో, సివిఎస్వోతో క‌లిసి బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల‌ను ఈవో ప‌రిశీలించారు. ఆల‌యంలో భ‌క్తుల ప్ర‌వేశించే, వెలుప‌లికి వ‌చ్చే క్యూలైన్లు, పారిశుద్ధ్యం, విద్యుత్ అలంక‌ర‌ణ ఏర్పాట్లు, సివిల్ ప‌నుల‌ను త‌నిఖీ చేశారు. నిర్దేశిత స‌మ‌యంలోపు బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్లు పూర్తి చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను ఈవో ఆదేశించారు. ఈవో వెంట చీఫ్ ఇంజినీర్ నాగేశ్వ‌ర‌రావు, ఇఇలు  జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి,  ర‌విశంక‌ర్‌రెడ్డి, విజివో బాలిరెడ్డి త‌దిత‌రులు ఉన్నారు.

Tirumala

2021-09-24 12:02:16

25న ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్ల విడుదల

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం సెప్టెంబర్ 25 వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో సర్వ దర్శనం టోకెన్లు విడుదల చేస్తామని టీటీడీ చైర్మన్  వై వి సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబరు  26 నుంచి అక్టోబరు 31వ తేదీ దాకా రోజుకు ఎనిమిది వేల సర్వ దర్శనం టోకెన్లు  ఆన్లైన్లో విడుదల చేస్తామని ఆయన తెలిపారు. సర్వదర్శనం టోకెన్లు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చిన తర్వాత,  సెప్టెంబరు 26 వ తేదీ నుంచి తిరుపతి లో ఆఫ్ లైన్లో సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపి వేస్తామని ఆయన తెలిపారు. తిరుపతితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు సర్వదర్శనం టోకెన్ల కోసం గుమికూడుతుండటం వల్ల కరోనా వేగంగా సంక్రమించే ప్రమాదం ఉన్నందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ కానీ, దర్శనం సమయానికి మూడు రోజుల ముందు కరోనా పరీక్ష చేయించుకుని తెచ్చుకున్న నెగిటివ్ సర్టిఫికెట్ గానీ తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుందని చైర్మన్ వివరించారు. కోవిడ్ నియంత్రణ కోసం టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని  వైవి సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. అక్టోబరు నెలకు సబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ 300 టికెట్లు సెప్టెంబరు 24వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తామని చైర్మన్ తెలిపారు.

Tirumala

2021-09-22 07:33:16

బ‌ర్డ్ ట్ర‌స్టుకు రూ.1.10 కోట్లు విరాళం..

తిరుమల తిరుపతి దేవస్థానం బ‌ర్డ్ ట్ర‌స్టుకు శ‌నివారం రూ.1.10 కోట్లు విరాళంగా అందింది. చెన్నైకి చెందిన  బాలు రామ‌జ‌య‌న్ ఈ మేర‌కు విరాళం డిడిని తిరుమ‌ల‌లోని అద‌న‌పు ఈవో బంగ‌ళాలో  ఎవి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు.  ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ శ్రీ‌వారి భ‌క్తుడైన  బాలు రామ‌జ‌య‌న్ ఇదివ‌ర‌కే టిటిడిలోని ప‌లు ట్ర‌స్టుల‌కు విరాళాలు అందించార‌ని, రెండు నెల‌ల క్రితం ఎస్వీబీసీ ట్ర‌స్టుకు కోటి రూపాయ‌లు అంద‌జేశార‌ని తెలిపారు. క‌రోనా రెండో విడ‌త‌లో బ‌ర్డ్ ఆసుప‌త్రికి అవ‌స‌ర‌మైన మందుల‌ను కూడా అందించార‌ని చెప్పారు. ప్ర‌స్తుతం బ‌ర్డ్ ట్ర‌స్టుకు రూ.1.10 కోట్లు విరాళంగా అందించార‌ని, ఈ మొత్తంతో 200 స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మాన్యువ‌ల్ బెడ్ ఫైవ్ ఫంక్ష‌న్ డీల‌క్స్ మంచాలు కొనుగోలు చేస్తామ‌ని వివ‌రించారు. ఒక నెల‌లో ఈ మంచాలు కొనుగోలు చేసి బ‌ర్డ్ ఆసుప‌త్రిలో రోగుల‌కు అందుబాటులో ఉంచుతామ‌ని, ఇవి ఎంతో సౌక‌ర్య‌వంతంగా ఉంటాయ‌ని తెలిపారు. దాత కుటుంబానికి శ్రీ‌వారు సంప‌ద‌లు, ఆయురారోగ్యాలు ప్ర‌సాదించాల‌ని కోరుకుంటున్న‌ట్టు చెప్పారు.

Tirumala

2021-09-18 10:10:40