జర్నలిస్టుల ముసుగులో జర్నలిజానికి మచ్చతెచ్చే నకిలీలను ఏరి పారేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అందుకే అక్రిడేషన్ల జారీ ప్రక్రియ ఆలస్యం అవుతోందని విశాఖపట్నంలో మీట్ ది ప్రెస్ లో పాల్గొన్న ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ అధ్యక్షులు దేవిరెడ్డి శ్రీనాధ్ ప్రకటించటాన్ని అల్ ఇండియా న్యూస్ పేపర్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (న్యూ ఢిల్లీ) జాతీయ సీనియర్ ఉపాధ్యక్షులు,ఏపీజేయు వ్యవస్థాపక కార్యదర్శి సీహెచ్.పూర్ణచంద్ర రావు, అధ్యక్షులు జాలే వాసుదేవ నాయుడు లు ఇక్కడ విడుదల చేసిన ఒక సంయుక్త ప్రకటనలో స్వాగతించారు. నకిలీలను ఏరివేసే ప్రక్రియ అన్నిరాష్ట్రాలకు మార్గదర్శకం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ యూనియన్ తొలినుండి అధికారులు జారీచేసే అక్రిడేషన్ల కమిటీలో జర్నలిస్టు సంఘాలకు సభ్యత్వం కల్పించటం వలనే జి.ఓ నిబంధనలు నిర్ల్యక్షం చేయబడి కొందరు క్రిమినల్స్ సైతం జర్నలిజం ముసుగులోకి వచ్చి ఈరంగానికి మచ్చ తెస్తున్నారన్నార ఆరోపించారు. ఎట్టకేలకు ఈ విషయం గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం,సమాచార శాఖా మంత్రి పేర్ని నాని, కమిషనర్ టి వి కె రెడ్డి,ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాధ్ సంయుక్తంగా అలాంటివారిని ఏరివేసే చర్యలు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్టు వివరించారు. పత్రికలు, చానెళ్లు కొన్ని ఏదొక పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నాయి, అలాగే వాటికి అనుకూలంగా వుండే వారిని లేక ఉండేందుకు అంగీకరించిన వారినే విలేకర్లుగా నియమించుకుంటాయని వేరే చెప్పాల్సిన పని లేదు.ఈ నియామకంలో భాగంగా చేరిన ఎవరైనా నేర చరిత్ర వున్నవారి వివరాలు ఇంటిలిజెన్స్,స్పెషల్ బ్రాంచ్ ద్వారా సేకరించి మాత్రమే అక్రిడేషన్లు జారీచెయ్యలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అసలు పత్రికలు ఎన్నడూ కనపడని వారు అక్రిడేషన్లేకాదు,ఆఖరికి కమిటీలోకి కూడా నియమించబడుతున్నారని ఇది ఎలా సాధ్యం అని సందేహం వ్యక్తం చేశారు. తమ ఏపీజేయు తొలినుండి ప్రభుత్వం జారీచేసే అక్రిడేషన్ల కమిటీలో యూనియన్లను నియమించవద్దని కోరుతోందని, అయితే కొన్ని రోజులుగా ఎంతో చరిత్ర ఉన్న ఒక యూనియన్ తమ యూనియన్ని గుర్తించలేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర పదజాలం తో ప్రకటనలు చేసి జి.ఓ 98 రద్దుచేయాలని కోరుతూ ఉద్యమాలు చెయ్యటం,కొందరు నాయకులు ముఖ్యమంత్రి గారికి పరిశీలించమని కోరడం జరిగిందని,ఆయన పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు వార్తల్లో వచ్చిందనన్నారు. నిజంగానే చరిత్రవున్న ఆ యూనియన్ కి ఈ విషయం సానుభూతితో పరిశీలించాలని ఒక సోదర యూనియన్ పక్షాన తమ యూనియన్ కూడా మా సోదర యూనియన్ ని గుర్తించేందుకు అవసరమైన అవకాశాలు సానుభూతితో పరిశీలించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈనెల మొదటి నుండి అక్రిడేషన్లు రెన్యూవల్ చెయ్యకపోవటం తో విషయం తెలిసిన కొందరు నకిలీలు ఈ రంగంపై నిరాసక్తి కనబర్చుతున్నట్లు తెలుస్తోందని, డిసెంబర్ వరకు ఇదే పొజిషన్ ఉంటే నకిలీలు స్వచ్చందంగా తప్పుకునే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఇక వేరే వడబోత పోయాల్సిన అవసరం ఉండకపోవచ్చని పూర్ణచంద్ర రావు,వాసుదేవ నాయుడు అభిప్రాయపడ్డారు. అలాగే నిజమైన జర్నలిస్టులకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి మేలు చెయ్యాలని ఉన్నట్లు కూడా ప్రెస్ అకాడమీ అధ్యక్షులు దేవిరెడ్డి శ్రీనాధ్ ఆ మీట్ ది ప్రెస్ లో వెల్లడించడం,అలాగే కోవిడ్ భారిన పడి మరణించిన పాత్రికేయుల కుటుంబాలకు 5 లక్షలు పరిహారం కోరినట్టు,ఆమేరకు మంజూరైనట్లు కూడా మంగళవారం విశాఖలోనే ఆయన పాత్రికేయుల సమావేశంలో పేర్కొనటం పట్ల పూర్ణచంద్ర రావు,వాసుదేవ నాయుడులు కృతజ్ఞతలు తెలిపారు.
లోక సంక్షేమం కోసం, కరోనా వ్యాధిని అరికట్టాలని శ్రీవారిని ప్రార్థిస్తూ టిటిడి చేపట్టిన షోడశదిన సుందరకాండ దీక్ష అక్టోబరు 14న బుధవారం ముగియనుంది. తిరుమలలోని వసంత మండపంలో సెప్టెంబరు 29న ఈ దీక్ష ప్రారంభమైంది. "రాఘవో విజయం దద్యాన్మమ సీతా పతిఃప్రభుః " అనే మహామంత్రం ప్రకారం సుందరకాండలోని మొత్తం 68 సర్గల్లో గల 2,821 శ్లోకాలను 16 మంది సుందరకాండ ఉపాసకులు 16 రోజుల పాటు అత్యంత దీక్షాశ్రద్ధలతో పారాయణం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి ఒక గంట పాటు ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. వసంత మండపంలో శ్లోక పారాయణంతోపాటు ధర్మగిరి వేద పాఠశాలలో మరో 16 మంది ఉపాసకులు 16 రోజుల పాటు జప, హోమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
రాష్ట్రంలో కరోనావైరస్ భారిన పడి మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి రూ. 5లక్షలు ఆర్థిక సహాయం చెల్లించడానికి నిర్ణయించడం అభినందనీయమని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు అన్నారు. మంగళవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, జర్నలిస్టులను కూడా “ఫ్రంట్ లైన్ వారియర్స్”గా గుర్తించడం శుభ సూచికమన్నారు. ఈ సందర్భంగా థాంక్యూ సీఎం సర్ అంటూ తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. కరోనా సమయంలో జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచారన్నారు. ఎన్నో ఆందోళనలు తరువాత ప్రభుత్వం జర్నలిస్టులు కరోనా మ్రుతిచెందితే రూ.5లక్షలు ఇవ్వడానికి ఒప్పుకుందని అన్నారు. ఈ భరోసా జర్నిస్టులకు కాస్త స్వాంతన నిస్తుందన్నారు. ఇప్పటి వరకూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని విధినిర్వహణ చేసిన జర్నలిస్టులకు సీఎం వైఎస్ జగన్ ప్రకటన ఎంతో దైర్యాన్ని ఇస్తుందన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మ్రుతిచెందిన జర్నలిస్టులకు సత్వరమే ప్రకటించిన మొత్తాన్ని అందజేయాలని ఈ సందర్భంగా గంట్లశ్రీనుబాబు ప్రభుత్వాన్ని కోరారు.
రాష్ట్రంలో కోవిడ్ బారిన పడి మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి రూ. 5లక్షలు ఆర్థిక సహాయం చెల్లించడానికి నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ తెలిపారు. మంగళవారం నాడు స్థానిక వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం సమావేశ మందిరంలో ఆయన పత్రికా విలేఖరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ పై పోరాటంలో “ఫ్రంట్ లైన్ వారియర్స్” గా వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ద్య సిబ్బంది, పోలీసులతో పాటు జర్నలిస్టులు కూడా ముందు వరసలో వుండి విపత్కర పరిస్థితులను ఎదుర్కొని ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఎంతోమంది పాత్రికేయులు విధి నిర్వహణలో భాగంగా కోవిడ్ వైరస్ బారిన పడి మృతి చెందారని తెలిపారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని ప్రెస్ అకాడమీ తరపున, జర్నలిస్టులందరి తరపున ముఖ్యమంత్రి గారిని కోరగా, ఆయన తక్షణం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం మృతి చెందిన ఒక్కొక్క కుటుంబానికి రూ. 5 లక్షలు ఇవ్వడానికి అంగీకరించారని ఆయన తెలిపారు. ఇందుకు గాను ప్రెస్ అకాడమీ తరపున, జర్నలిస్టుల తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. అలాగే కోవిడ్ బారిన పడి చికిత్స పొందుతున్న జర్నలిస్టులకు ఇప్పటికే ఆరోగ్య శ్రీ పథకం ద్వారా వైద్యం అందిస్తున్నారని తెలిపారు. వారికి కూడా సత్వరం మెరుగైన వైద్య సౌకర్యం అందించాలని కూడా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారని తెలిపారు. ఇంకా ప్రతి జిల్లాలోను కోవిడ్ బారిన పడిన జర్నలిస్టులకు వైద్యం అందించేందుకు ప్రభుత్వ , ప్రైవేటు ఆసుపత్రులలో ప్రత్యేకంగా బెడ్ లను కేటాయించినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి జర్నలిస్టుల విజ్ఞప్తిని మన్నించి, వారి కష్టాన్ని గుర్తించి జర్నలిస్టులను ఆదుకోవడానికి అన్నిరకాలుగా ప్రభుత్వం ముందుంటుందని, సానుకూల ధృక్పథంతో వ్యవహరిస్తుందని తెలిపారని అన్నారు. కోవిడ్ బారిన పడి మృతి చెందిన జర్నలిస్టులకు కొన్నిరాష్ట్రాలలో మినహా చాలా రాష్ట్రాలలో పరిహారం చెల్లించలేదని, మన రాష్ట్రంలో జర్నలిస్టులు కోరగానే సానుకూలంగా స్పందించినందుకు ముఖ్యమంత్రికి ఆయన మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు వి.మణిరామ్, జిల్లా పౌర సంబంధాల అధికారి పి.వెంకటరాజు గౌడ్, వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, ఇతరులు పాల్గొన్నారు.
తిరుపతి ఎస్వీ జూపార్క్ లోని జంతువులు, పక్షులు, మ్రుగాలు తదితర వణ్యప్రాణులను దత్తత తీసుకోవాలని జూ క్యురేటర్ హిమ శైలజ కోరుతున్నారు. ఈ మేరకు జూలో దత్తత తీసుకోవాలనే జంతువులు, పక్షుల వివరాలను నేరుగా ఈ నెంబరులో 9440810066 సంప్రదించవచ్చునని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా జూకి విరాళాలు అందించాలనుకునే దాతలు నేరుగా బ్యాంకు నగదును కూడా సమర్పించి ఆ వివరాలు జూ క్యూరేటర్ కు తెలియజేయాలని కోరుతున్నారు. బ్యాంకు వివరాలు తెలుసుకుంటే..Syndicate Bank a/c 31712210040128, IFSC Code:SYNB0003171, MICR Code: 517025002 ఖాతాకు నేరుగా విరాళాలు పంపించవచ్చునని కోరుతున్నారు. విరాళాలు పంపించిన వారు ఎంత మొత్తం పంపారో వారి వివరాలు ఫోను ద్వారా తెలియజేయాలన్నారు. లాక్ డౌన్ లో జూలోని జంతువుల సంరక్షణ భారంగా ఉన్న కారణంగా ఈ దత్తత కార్యక్రమం చేపట్టినట్టు క్యూరేటర్ వివరించారు. దాతలు ముందుకొచ్చి జూలోని జంతువులను దత్తత తీసుకోవాలని ఆమె కోరుతున్నారు.
వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి విద్యుత్ శాఖ, వైయస్సార్ ఉచిత విద్యుత్పై సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, వ్యవసాయ మోటర్లకు మీటర్లు అమర్చినంత మాత్రాన రైతులపై ఒక్క రూపాయి కూడా భారం పడబోదన్న విషయాన్ని గట్టిగా ప్రచారం చేయాలన్నారు. మీటర్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి 15 నిమిషాలకు ఒకసారి విద్యుత్ సరఫరాను తెలుసుకునే వీలు కలుగుతుందన్న సీఎం దీని వల్ల ఎలాంటి అంతరాయం లేకుండా 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయవచ్చునన్నారు. అంతేకాకుండా ఆ విద్యుత్ బిల్లు మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని, ఆ తర్వాత రైతులు అదే నగదును విద్యుత్ బిల్లు కింద డిస్కమ్లకు చెల్లిస్తారని పేర్కొన్నారు ఈ కార్యక్రంమలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ సీఎండీ జి.సాయిప్రసాద్, ఏపీ ట్రాన్స్కో సీఎండీ ఎన్.శ్రీకాంత్, ఏపీ జెన్కో ఎండీ బి.శ్రీధర్తో పాటు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
తిరుపతి వన్యప్రాణి సంరక్షణా కేంద్రం(తిరుపతి జూ)లో ప్రాణులను దత్తత తీసుకోవడానికి దాతలు ముందు కు రావాలని చిత్తూరు జిల్లాకలెక్టర్ నారాయణ భరత్ గుప్తా కోరారు. సోమవారం ఈ మేరకు కలెక్టరేట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. లాక్ డౌన్ కారణంగా జూలోని వణ్యప్రాణులు పక్షులు సంరక్షణ కష్టంగా వున్న తరుణంలో దాతలు ముందుకి వచ్చి రోజుకి రూ.20 నుంచి ఎంత మొత్తముతోనైనా జంతువులు, పక్షులు, మ్రుగాలను దత్తత తీసుకోవాలని కోరారు. జూలోని జీవచరాలకు తోచినంత సహాయం చేయడానికి కూడా చిన్న పిల్లలు, జంతు ప్రేమికులు ముందుకి రావాలని కోరారు. లాక్ డౌన్ కారణంగా జూనిధులు అయిపోవడంతో వాటి సంరక్షణ కష్టంగా ఉన్నందున దాతలు ముందుకు వస్తే వారి పేరుతో జంతువులు, పక్షులను పెంచడానికి ఆస్కారం వుంటుందన్నారు. దేశంలోనే అతి పెద్ద జంతు సంరక్షణా కేంద్రంలో ఒకటిగా వున్న తిరుపతి జూని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందనే విషయాన్ని గుర్తించి ప్రతీ ఒక్కరూ జంతు సంరక్షణకి ముందుకి రావాలని కలెక్టర్ కోరారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దండి కొడుతున్నాయి. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దీంతో నదులు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. ఏపీలో కురుస్తున్న అధిక వర్షాల కారణంగా అన్ని జిల్లా కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. తహశీల్దార్లు, ఎంపీడీలను అత్యవసర సమయాల్లో సేవలు అందించడానికి సిద్దంగా వుంచినట్టు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తెలిపారు. వార్షాలపై ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్సులు నిర్వహించి వర్షాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశాలు జారీచేశారు. అంతేకాకుండా నదులు, బ్యారేజిలు ఉన్నచోట దిగువ ప్రాంతాలను ముందస్తుగా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లాకలెక్టర్లను ఆదేశించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అన్ని బ్యారేజీలు పూర్తిస్థాయి నీటితో నిండుకుండలా కనిపిస్తున్నాయి.
ఆనందంగా ఉన్నప్పుడు ఎవరికీ ఎవరూ గుర్తుకు రారు... ఆపద వస్తే మాత్రం అందరికీ దేవుడు గుర్తొస్తాడు... కాని మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని జర్నలిస్టులకు మాత్రం వారి కష్టకాలంలో మాత్రం గుర్తొచ్చేది జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు. అంతటికీ ఒకటే కారణం... జర్నలిస్టులు ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే పిలవకుండానే వెళ్లి మరీ సహాయం చేసి వస్తాడు. నేనున్నానే భరోసా కల్పిస్తాడు. ఇటీవల ప్రమాదం గాయపడి ఇంటికే పరిమితం అయిన కంచరపాలెం సాక్షివిలేఖరి సాయిని స్వయంగి ఇంటిదగ్గరకు వెళ్లి పరామర్శించి మరీ, వైద్యానికి ఆర్ధిక సహాయం చేశాడు. చేతనైనంత వరకూ వైద్యసహాయానికి దోహద పడ్డాడు. కరోనా కష్టకాలంలో ఎందరికో తన సొంత నిధులతో సేవలు చేసిన గంట్ల, నిత్యం జర్నలిస్టుల సేవల్లోనే తరిస్తున్నారు. అధికారంలో ఉండే నాయకులే తోటి వారికి సహాయం చేయడానికి ముందుకురాని రోజుల్లో, అడగకపోయినా బాధల్లో వున్న జర్నలిస్టులను గుర్తించి తనవంతు బాధ్యతగా తనకున్న పరిధిలో ఆర్ధిక సహాయం చేస్తున్నాడు శ్రీనుబాబు. సాయం చేసేవాడిని అర్ధం చేసుకోని సమాజం నిష్టూరంగా ఎన్ని మాటలు అన్నా..అవన్నీ సింహాచల అప్పన్నే చూసుకుంటారంటూ సున్నితంగా తిరస్కరిస్తూనే తన సేవలను కొనసాగిస్తున్నారు గంట్లశ్రీనుబాబు. జర్నలిస్టు నేతగా ఉండి బాధల్లో ఉన్న జర్నలిస్టును కనీసం ఆదుకోకపోతే ఎవరికోసం యూనియన్ పదవులంటూ తనదైన శైలిలో సహాయం చేస్తూ ముందుకు సాగుతున్నారు గంట్ల. విశాఖ మహానగర పరిధిలో కష్టాల్లో ఉన్న ఏ జర్నలిస్టుని కదిపినా నాకు శ్రీనుబాబు సహాయం చేయకపోతే నా పరిస్థితి ఏంటనే సమాధానమే వస్తుంది. అంతలా జర్నలిస్టు కుటుంబాల్లో ఒకటిగి కలిసిపోయారు శ్రీనుబాబు. ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే పదానికి నిలువెత్తు రూపం విశాఖ జర్నలిస్టుల పక్షపాతి శ్రీనుబాబు అంటే అతిశయోక్తి కాదేమో..!
కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు అందించిన గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని సిబ్బందిని గుర్తించి మరీ ప్రభుత్వం జీతాలు నిలిపివేశారు. కరోనా సమయంలో విధినిర్వహణలో కరోనా పాజిటివ్ భారిన పడిన ఉద్యోగులకు జీతాల్లో కోత పెట్టడానికి అధికారులు ఉపక్రమించారు.తూర్పుగోదావరి జిల్లాతో పాటు అన్నిజిల్లాల్లోనూ కరోనా పాజిటివ్ వచ్చి 14 రోజులు సెలవుతో వున్నవారి పేరుతో రెండు దఫాలుగా పెట్టిన సాలరీ బిల్లులు ఖజానా శాఖ గ్రామసచివాలయాలకు తిప్పిపంపేసింది. కరోనా పాజిటివ్ వచ్చిన ప్రభుత్వ సచివాలయ ఉద్యోగులకు 14 రోజుల పాటు, విధులకు రానట్టుగా చూపి బిల్లులు పెట్టాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అలాకాకుండా బిల్లులు పెడితే ఎన్నిసార్లు పెట్టినా తిప్పిపంపేస్తామని తేల్చిచెప్పింది. అలా చేస్తే ఒక్కో ఉద్యోగికి ప్రభుత్వం ఇచ్చే రూ.15వేల జీతంలో సగం కోతపడి చేతికి 7500 మాత్రమే వస్తుంది. ఈ విధానంపై క్లారిటీ లేక చాలా గ్రామసచివాలయాల్లోని కార్యదర్శిలు కరోనా పాజిటివ్ వచ్చిన వారికి నేటికీ జీతాల బిల్లులు పెట్టలేదు. ఈ 14రోజుల సెలవులు తేలేంత వరకూ ఎంపీడీఓలు వారి సేలరీ బిల్లులు పెట్టొద్దని కార్యదర్శిలను ఆదేశించడమే దీనికి ఒకప్రధాన కారణంగా కాగా, ఖజానా శాఖ కూడా ప్రభుత్వం ఎలాంటి జీఓ లేకుండా 14 రోజులు సెలవు తీసుకున్న సమయానికి పూర్తి సాలరీ బిల్లు చేయలేమని చేతులెత్తేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో నేటికీ కరోనా పాజిటివ్ వచ్చిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగలకు నేటికీ జీతాలు అందలేదు. ఈ విషయంలో అటు జిల్లా కలెక్టర్లు సైతం ద్రుష్టిపెట్టకపోవడంతో పరిస్థితి మరింత జటిలమైంది. కరోనా సమయంలో గ్రామాల్లో ప్రాణాలకు తెగించి సేవలు చేసి, ఆఖరికి కరోనా వైరస్ కి గురైనందుకు చాలా మంచి గౌరవం దక్కిందంటూ గ్రామసచివాలయ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామసచివాలయాలకు ప్రజల ద్వారా వచ్చిన వైరస్ కారణంగా తాము ఈ వైరస్ బారిన పడి చచ్చి బతికే.. ప్రభుత్వం తమను ఆదుకోవాల్సింది పోయి ఇచ్చే కొద్దిపాటి జీతాల్లో కోతవిధిస్తే..తాము ఏని బ్రతకాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంతవరకూ వీరికి జీతాలు వచ్చే పరిస్థితి లేకపోగా, వచ్చినా సగం జీతం మాత్రమే చేతికి వచ్చేలా ఖజానాశాఖ స్పష్టం చేస్తుంది...ఏం జరుగుతుందో వేచి చూడాలి..
'బాలికే భవిష్యత్తు' పేరుతో వినూత్న కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీకారం చుట్టారు. బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలనే లక్ష్యంతో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన బాలికలకు అపురూపమైన అవకాశం కల్పించారు. అక్టోబర్ 11 న అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా 'బాలికే భవిష్యత్తు' పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. శనివారం జాయింట్ కలెక్టర్ లు , సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, జిల్లా అధికారులు, మునిసిపల్ కమిషనర్ లు తదితరులతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ 11 వ తేదీన ఆదివారం అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అక్టోబర్ 11 వ తేదీన ప్రతి కార్యాలయంలో కార్యాలయపు అధికారిగా బాలికకు పదవీ అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత కార్యాలయపు అధికారిగా ఒక రోజు పదవీ బాధ్యతలు నిర్వహించే విధంగా ఒక బాలికను ఎంపిక చేసుకుని అవకాశం కల్పించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఆ శాఖకు సంబంధించిన కార్యక్రమాల్లో ఏదైనా అమలు చేయాలనుకుంటే నిర్ణయం తీసుకునే అవకాశాన్ని కూడా కల్పించాలని సూచించారు.కార్యాలయపు అధికారిగా బాలిక తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడైనా ఆ శాఖకు సంబంధించి తనిఖీలు, సందర్శనలు చేస్తానంటే అందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు, జిల్లా అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు..ఇలా అన్ని స్థాయిల్లోనూ కార్యాలయపు అధికారులుగా ఆదివారం ఉదయం 11 గంటలకు ఎంపిక చేసుకున్న బాలికలు పదవీ బాధ్యతలు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.. జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిల్లో అంతటా అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఒకరోజు బాలికా అధికారులు పదవీ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. కోవిడ్ నేపథ్యంలో నియమ నిబంధనలు పాటిస్తూ జిల్లా వ్యాప్తంగా కార్యక్రమం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
తిరుమల శ్రీవారి సేవ చేసే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతమని శ్రీవారి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డా.కెఎస్.జవహర్ రెడ్డి అన్నారు. స్వామివారి ఆలయం లో ఈఓగా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందని నూతన ఆనందం వ్యక్తం చేశారు. ఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీవారి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఒక భక్తుడిలాగా స్వామివారికి సేవ చేయాలని చాలాకాలంగా అనుకుంటున్నానని చెప్పారు. తిరుపతిలో తాను వెటర్నరీ సైన్సు విద్యను పూర్తి చేశానన్నారు. అలాంటి స్వామివారి ఆలయానికి ఈఓగా రావడం నిజంగా స్వామివారి కరుణగానే భావిస్తున్నానని చెప్పారు. భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ఇప్పుడున్న వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిటిడి జెఈఓ పి.బసంత్ కుమార్, జెఈఓ(విద్య మరియు ఆరోగ్యం) ఎస్.భార్గవి, సివిఎస్వో గోపీనాథ్ జెట్టి, బోర్డు సభ్యులు శివకుమార్, అదనపు సివిఎస్వో శివకుమార్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, డెప్యూటి ఈవో ఆర్-1 బాలాజి, విజివో మనోహర్ తదితరులు పాల్గొన్నారు.