ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న నాడు-నేడు కార్యక్రమానికి తమవంతు విరాళంగా లారస్ ల్యాబ్స్ రూ.4కోట్లు విరాళం ఇచ్చింది. ఈమేరకు ఆ మొత్తాన్ని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిసి కంపెనీ ప్రతినిధులు అందజేశారు. నాడు నేడు పధకం మొదటి విడతలో భాగంగా నాలుగు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో (తెనాలి, కంచికచర్ల, వీరులపాడు, అచ్యుతాపురం) ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం వీటిని అందజేసినట్టు కంపెనీ ప్రతినిధులు తెలియజేశారు. అంతేకాకుండా.. రెండు, మూడో విడతల్లో అదే మండలాల్లోని మిగిలిన పాఠశాలల్లో నేరుగా లారస్ ల్యాబ్స్ మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేయనున్నట్లు సీఎం జగన్ కి కంపెనీ ప్రతినిధిలు వివరించారు. సీఎంని కలిసిన వారిలో లారస్ ల్యాబ్స్ వైస్ ప్రెసిడెంట్ చావా నరసింహరావు, సీనియర్ మేనేజర్ రామకృష్ణ , పాల్గొన్న కనెక్ట్ టూ ఆంధ్ర సీఈవో వి. కోటేశ్వరమ్మ తదితరులు ఉన్నారు.
కలియుగంలో మోక్ష సాధనకు యజ్ఞాలు, యాగాలు, తపస్సు చేయనవసరం లేదని, హరినామస్మరణ చేస్తే చాలని కొక్కె సుబ్రహ్మణ్య మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాప్రసన్నతీర్థ స్వామీజీ ఉద్ఘాటించారు. శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు బుధవారం తిరుమలలోని ఆస్థానమండపంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ విద్యాప్రసన్నతీర్థ స్వామీజీ మంగళాశాసనాలు చేస్తూ శ్రీవేంకటేశ్వరుడు శ్రీ వైకుంఠం నుంచి తిరుమలపై కాలుమోపి సకల జీవరాశులను రక్షిస్తున్నారని అన్నారు. శ్రీ పురందరదాసులవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన ప్రతిసారి సహస్ర దళ సంకీర్తన రత్నాలతో స్వామివారి పాదపద్మాలను సేవించినట్లు తెలిపారు. శ్రీగిరి పర్వతానికి అధిపతి అయిన శ్రీనివాసుడిని ఉదయం ఏళు నారాయణ....ఏళు లక్ష్మీ రమణ ....అనే సంకీర్తనతో స్వామివారిని మేల్కొలిపే వారన్నారు. శ్రీవారి అనుగ్రహం కొరకు ఆకాశరాజు శ్రీ పద్మావతి అమ్మవారిని స్వామివారికి సమర్పించినట్లు, మనము సంకీర్తనలు, మంత్ర, స్త్రోత్ర పారయణంతో శ్రీనివాసుడి అనుగ్రహం పొందవచ్చన్నారు. కావున సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో చెడు విషయాలపై దృష్టి పెట్టకుండా భగవన్నామస్మరణ చేస్తే సత్ఫలితాలు వస్తాయన్నారు. దాససాహిత్య ప్రాజెక్టు హైందవ సనాతనధర్మ ప్రచారానికి విశేషంగా కృషి చేస్తోందన్నారు. ఇక్కడ స్వామివారిని దర్శిస్తే కష్టాలు తొలగిపోతాయని వివరించారు.
అంతకుముందు దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగర సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ''గురుపురందర దాసరే...., వండిదే పురందరదాసర....దేవ బంధ నమ్మ స్వామి బంధ....'' తదితర సంకీర్తనలను భజన మండళ్ల సభ్యులు చక్కగా ఆలపించారు. కోవిడ్ - 19 మార్గదర్శకాల మేరకు ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి 300 మంది భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 11వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాలకు వేంచేపు చేస్తారు. అక్కడ పురందరదాసుల సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తారు.
రాష్ట్రంలో పంచాయతీ మొదటిదశ పోలింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని రాష్ట్ర పంచాయతీరాజ్ రూరల్ డవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ మరియు రూరల్ డవలప్మెంట్ కమీషనర్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను గోపాలకృష్ణ ద్వివేది వివరించారు. ఈ సందర్భంగా ద్వివేది మాట్లాడుతూ మొదటి దశ ఎన్నికలకు సంబంధించి 3,249 గ్రామ పంచాయతీ సర్పంచ్లకు గాను 525 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని, 32,502 వార్డు మెంబర్లకు గాను 12,185 వార్డు స్దానాలు ఏకగ్రీవం అయ్యాయని ద్వివేది వివరించారు. ఇంకనూ మిగిలిన 2,723 సర్పంచ్ స్ధానాలకు 20,157 వార్డు మెంబర్ల స్థానాలకు 43,601 మంది అభ్యర్దులు పోటీలో ఉన్నారన్నారు. ఈనెల 9న పోలింగ్ జరుగుతుందని నిర్వహణకు అన్ని ఏర్పాటు పూర్తిచేశామని ఆయన అన్నారు. రాష్ట్రంలో మంగళవారం నిర్వహించే మొదటి దశ పోలింగ్ 12 జిల్లాలో జరుగుతుందని, విజయనగరం జిల్లాలో మొదటి దశ పోలింగ్ లేదని ఆయన వివరించారు. ఈ పోలింగ్ నిర్వహణకు సంబంధించి 29,732 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని అందులో 3,458 సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లకుగాను, 3,594 హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లుగా గుర్తించి పటిష్టమైన శాంతి భద్రతలు నిర్వహణకు అవసరమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశామని ఆయన అన్నారు.
పోలింగ్ సిబ్బంది సోమవారం సాయంత్రానికే ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారని ఆయన అన్నారు. పోలింగ్ నిర్వహణకు సంబంధి స్టేజ్ -1 రిటర్నింగ్ ఆఫీసర్లుగా 1,130 మంది, స్టేజ్-2 రిటర్నింగ్ ఆఫీసర్లుగా 3,249 మందిని, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా 1,432 మందిని, ప్రెసైడింగ్ ఆఫీసర్లుగా 33,533 మందిని ఇతర పోలింగ్ సిబ్బందిగా 44,392 మందిని మొదటి దశ పోలింగ్ నిర్వహణలో విధులు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. పోలింగ్ నిర్వహణకు సంబంధించి జోనల్ అధికారులుగా 519 మందిని, రూట్ అధికారులుగా 1,121 మందిని, పోలింగ్ సరళిని పర్యవేక్షించుటకు మైక్రో అబ్జర్వర్లుగా 3,047 మందిని నియమించి వీరందరికి సమర్దవంతంగా ఎన్నికలు నిర్వహించుటకు అవసరమైన శిక్షణ ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు. మొదటి దశ పోలింగ్ లో 16,688 పెద్ద బ్యాలెట్ బాక్స్లు, 8,503 మీడియం బ్యాలెట్ బ్యాక్స్లు, 21,338 చిన్న బ్యాలెట్ బాక్స్లు ఈ పోలింగ్ లో వినియోగిస్తున్నామని గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. పోలింగ్ సామాగ్రిని ఆయా పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేయుటకు 215 డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేశామని, అవసరమైన పోలింగ్ సామాగ్రిని పోలింగ్ స్టేషన్ల వారీగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో సిద్దంగా ఉంచి సోమవారం సాయంత్రానికి
పోలింగ్ మెటీరియల్తో పాటు ఆయా పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకొనేలా ఏర్పాట్లు చేశామని ఆయన అన్నారు. 5 కి.మీల కన్నా ఎక్కువ దూరం ఉన్న పోలింగ్ స్టేషన్లకు పోలింగ్ సిబ్బందిని, సామాగ్రిని తరలించుటకు 2,216 పెద్ద వాహనాలను, 5 కి.మీ ల కన్నా తక్కువ ఉన్న పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 1,412 చిన్న వాహనాలను పోలింగ్ సిబ్బందిని, సామాగ్రి తరలించుటకు ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి మొదటి సారిగా “నోటా”ను తీసుకువచ్చామని గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారం ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి, మాస్కులు, శానిటైజర్లు, హ్యాండ్ గ్లౌజులు అన్ని పోలింగ్ కేంద్రాల్లోను సిద్దంగా ఉంచామని ఆయన అన్నారు. చివరి గంట పిపిఇ కిట్లతో కోవిడ్ బాధితులు ఓటు వినియోగించుకోవచ్చుః- కోవిడ్ పాజిటివ్ వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే వారికి పిపి ఇ కిట్లను ఏర్పాటు చేశామని వారు పోలింగ్ చివరి గంటలో వారి ఓటు హక్కును వినియోగించు కోవచ్చని గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. పోలింగ్ సిబ్బంది అందరికీ కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం తగు రక్షణ కల్పించామని, మహిళా పోలింగ్ సిబ్బందికి తగిన వసతులు ఏర్పాటు చేశామని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, పోలింగ్ స్టేషన్ల వద్ద పోలింగ్ సిబ్బందికి అవసరమైన అల్పాహార, భోజన వసతిని ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. మొదటిదశ పోలింగ్ సందర్భంగా అదేరోజు కౌంటింగ్ నిర్వహణకు కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, కోవిడ్ రక్షణకు చర్యలు తీసుకున్నామని గోపాలకృష్ణ ద్వివేది అన్నారు.
మొదటి దశ కౌంటింగ్ కు సంబంధించి 14,535 సూపర్ వైజర్లను, 37,750 మంది కౌంటింగ్ సిబ్బందిని ఏర్పాటు చేసి కౌంటింగ్ నిర్వహణకు అవసరమైన శిక్షణ కూడా ఇచ్చామని ఆయన తెలిపారు. ఎన్నికల నిర్వహణ కొరకు జిల్లాలో జరుగుతున్న ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఇందుకుగాను రాష్ట్ర స్దాయిలో 13 మంది అధికారులతో కమీషనర్, పంచాయతీరాజ్ కార్యాలయంలో కమాండ్ అండ్ కంట్రోల్ సెంట.ర్ ఏర్పాటు చేశామని, అన్ని జిల్లాలోను ఆయా జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లు పనిచేస్తున్నవని ఆయన అన్నారు. రాష్ట్రంలో మంగళవారం జరగనున్న మొదటి దశ పోలింగ్ గ్రామ పంచాయతీలోని ఓటర్లు ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్య స్పూర్తితో ఈఎన్నికల్లో పాల్గొని తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. ఈ పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ కమీషనర్ గిరిజాశంకర్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు కష్టపడి బాగా చదువుకుని అనేక రకాల బాషలు నేర్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ తెలిపారు. ఆదివారం భారత రాష్ట్రపతి మదనపల్లె సమీపంలోని సత్సంగ్ ఫౌండేషన్ లో ఆశ్రమం నిర్మాణానికి శంకుస్థాపన, భారత్ యోగా విద్యాకేంద్రను ప్రారంభించారు. ఆశ్రమం లోని శివాలయం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి హారతి ఇచ్చారు. అలాగే విశ్వ విద్యాలయ ఆవరణ లో మొక్కలు నాటారు, 38 పడకల స్వాస్థ్య ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం సత్సంగ్ విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి విద్యాలయంలో 6 నుండి 10 వ తరగతి వరకు చదివే విద్యార్థులను వారి పేర్లు, వారి తల్లిదండ్రుల పేర్లు, వృత్తి వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. భారత రాష్ట్రపతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మీరు మంచి విద్యాలయంలో చదువుతున్నారని, విద్యార్థులు తనలా గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నానన్నారు. అంతకు మునుపు సత్సంగ్ ఫౌండేషన్ లో ఆశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ సత్సంగ్ ఫౌండేషన్ కు రావడం సంతోశంగా ఉందని, సత్సంగ్ నిర్వాహకులు తమ విద్యార్థుల అభ్యున్నతి కోసం చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాల వైపు వెళ్లారని తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి విద్యార్థులు మదనపల్లెకి వచ్చి విద్యను అభ్యసించడం ఈ సంస్థ పై ఉన్న నమ్మకాన్ని తెలుపుతోందన్నారు. ఆ తరువాత భారత రాష్ట్రపతి భారత్ యోగా విద్యాకేంద్రను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ విద్యతో పాటు వ్యాయామం ఎంతో అవసరమని, ప్రతి రోజు ఉదయం యోగా చేయడం విద్యార్థులు అలవాటు చేసుకోవాలన్నారు. యోగా, ధ్యానం చేయడం వల్ల ఆలోచనా శక్తి మరింత మెరుగుపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖామాత్యులు కె. నారాయణస్వామి, జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్, అనంతపురం రేంజ్ డిఐజి క్రాంతి రాణా టాటా, ఎస్.పి సెంథిల్ కుమార్, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) వి. వీరబ్రహ్మం, అసిస్టెంట్ కలెక్టర్ విష్ణు చరణ్, పద్మభూషన్ అవార్డ్ గ్రహీత మరియు సత్సంగ్ ఫౌండేర్ ఎం (ముంతాజ్ అలీ) సత్సంగ్ విద్యాలయ డైరెక్టర్ స్టీఫెన్, స్కిల్ డెవలప్మెంట్ కేంద్ర హెడ్ కృష్ణ, అధికారులు, విద్యాలయ టీచర్ లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఘన స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రులు నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. రాష్ట్రపతి మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో హెలికాఫ్టర్ ద్వారా మదనపల్లెకి సమీపంలోని చిప్పిలిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి మదననపల్లెలోని సత్సంగ్ ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ సత్సంగ్ ఆశ్రమం, శంకుస్థాపన, భారత యోగా విద్యా కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికార యంత్రంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎన్నికల కమిషన్ చైర్మన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలను కొట్టివేసింది. ఈనెల 21 వరకూ ఇంటికే పరిమితం కావాలని ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవంటూ గ్రామీణాభివ్రుద్ధి శాఖ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రా రెడ్డి వేసిన హైస్ మోషన్ పిటీషన్ పై హై కోర్టు ఈ ఉత్తర్వులు వెలువరించింది. అంతేకాకుండా మంత్రిని మీడియాతో మాట్లాడొద్దని సమర్ధించి ఆ ఆదేశాలు జారీచేసింది. దీనితో మంత్రికి ఊరట లభించినట్టు అయ్యింది. హైకోర్టు ఆదేశాలతో మంత్రి ఇంటికే కాకుండా ప్రజల్లోకి తిరిగే అవకాశం వచ్చినట్టు అయ్యింది.
తెలుగు భాష, సాహిత్యాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని తెలుగు అకాడమి చైర్పర్సన్ ఎన్.లక్ష్మీపార్వతి అన్నారు. శనివారం ఉదయం ఆమె ఏయూ తెలుగు విభాగాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు.ముందుగా తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాల వేసి నమస్కరించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పరిశోధనల్లో నాణ్యత, ప్రమాణాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రాచీన సాహిత్యంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. తెలుగు అకాడమి ఆధ్వర్యంలో పరిశోధనలు నిర్వహించే విధంగా కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటూ విశిష్ట పరిశోధనలు జరపాలని తెలిపారు. కార్యక్రమంలో ఏయూ రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, ప్రిన్సిపాల్ ఆచార్య పి.రాజేంద్ర కర్మార్కర్, తెలుగు విభాగాధిపతి ఆచార్య జర్రా అప్పారావు, విశ్రాంత ఆచార్యులు యోహాన్ బాబు తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీపార్వతిని విభాగం తరపున సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఫైబర్ గ్రిడ్ను విస్తరించుట ద్వారా ప్రజలందరికీ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోనికి తీసుకువస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ (ఏపియస్యఫ్యల్) ఛైర్మన్ పునూరి గౌతమ్రెడ్డి అన్నారు. విజయవాడ ఏపియస్ఆర్ టిసి అడ్మినిస్ట్రేటివ్ 3వ బ్లాక్లో గల ఏపియస్యఫ్యల్ కార్యాలయంలో శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్గా పునూరి గౌతమ్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సర్వమత ప్రార్ధనల అనంతరం ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన పునూరి గౌతమ్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏఒక్కరూ ఇవ్వలేనివిధంగా ఏ.పి. ఫైబర్ నెట్ ద్వారా నాణ్యమైన ఇంటర్నెట్, కేబుల్ ప్రసారాలు ప్రజలకు అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ (ఏపియస్యఫ్యల్) ఛైర్మన్ పునూరి గౌతమ్రెడ్డి అన్నారు. ఫైబర్ గ్రిడ్ను విస్తరించుట ద్వారా రాష్ట్రంలో 660 మండలాల్లో, 6300 గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఫైబర్ నెట్ సేవలను తీసుకువచ్చామని దీనిలో భాగంగా త్రిపుల్ ప్లే సర్వీసెస్ అందిస్తున్నామని, రూ. 599/- లకే అన్లిమిటెడ్ ప్లాన్తో కేబుల్ కనెక్షన్, ఇంటర్నెట్, టెలిఫోన్ సౌకర్యం అందిస్తున్నామని గౌతమ్రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని ప్రతీ గ్రామానికీ ఇంటర్నెట్ సౌకర్యం అందాలనే ఉద్ధేశ్యంతో ప్రతీగ్రామంలోనూ ఇంటర్నెట్ పార్క్లను ఏర్పాటుచేస్తున్నామని ఆయన అన్నారు. మారుమూల గిరిజన గ్రామాలకు సైతం ఫైబర్ నెట్ ద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్, టివి, టెలిఫోన్ సర్వీసులు అందిస్తున్నామని ఇప్పటివరకు ఐటిడిఏ పాడేరు, ఐటిడిఏ రంపచోడవరం పరిధిలో రిమోట్ గిరిజన గ్రామాలకు సైతం ఫైబర్ నెట్ సేవలు అందించామని ఆయన అన్నారు. ఫైబర్ నెట్కు ప్రజల నుండి మంచి ఆదరణ ఉన్నదని, రాష్ట్రంలో ఇప్పటికే 10 లక్షల కేబుల్, ఇంటర్నెట్, టెలిఫోన్ కనెక్షన్లు పనిచేస్తున్నవని ఆయన అన్నారు. విద్యార్ధులకు ప్రభుత్వం ఇప్పటికే ల్యాప్టాప్లను అందించిందని, ఫైబర్ గ్రిడ్ ద్వారా విద్యార్ధులకు ఉచితంగా ఇంటర్నెట్ అందిస్తామని ఆయన అన్నారు. కేబుల్, ఇంటర్నెట్, టెలిఫోన్ ప్రజలకు విడిగా అందించడానికి కూడా చర్యలు తీసుకున్నామని అన్నారు. రూ. 499/- లకే అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అందిస్తున్నామని, రూ. 300/- లకే కేబుల్ కనెక్షన్ అందిస్తామని, రూ. 99/- లకే టెలిఫోన్ ల్యాండ్ కనెక్షన్ను అందిస్తున్నామని గౌతమ్రెడ్డి అన్నారు. ప్రస్తుతం, రాబోయే తరాలకు కూడా ఇంటర్నెట్ అవసరం ఎ ంతో ఉందని దీన్ని దృష్టిలోపెట్టుకుని రానున్న రోజుల్లో ఫైబర్ గ్రిడ్ను మరింత విస్తరించి సులభతరమైన సేవలను ప్రజలకు అందుబాటులోనికి తీసుకువస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఏపి ఫైబర్ నెట్ ద్వారా సాంకేతిక విప్లవం మొదలైందని గ్రామగ్రామాన ఫైబర్ గ్రిడ్ ద్వారా సేవలు అందిస్తున్నామని గౌతమ్రెడ్డి అన్నారు. గ్రామ, మండల స్ధాయిలో అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేస్తున్నామని, త్వరలో క్రొత్త సెట్ టాప్ బాక్స్లు తీసుకువస్తున్నామని గౌతమ్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రానున్న 3 సంవత్సరాల్లో ఫైబర్ నెట్ ద్వారా 70 లక్షల కుటుంబాలకు ఇంటర్నెట్ సౌకర్యం అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని గౌతమ్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో సాంకేతిక సామాజిక విప్లవానికి నాందిపలికిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆశయాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ సంస్ధ నెట్ వర్క్ సేవలను మరింత పటిష్టపరిచి, రాష్ట్రంలో ప్రజల డిమాండ్కు అనుగుణంగా డిజిటల్ సేవలను అందించేవిధంగా ఈసంస్ధను తీర్చిదిద్దుతున్నామని ఛైర్మన్ గౌతమ్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం ఫైబర్ నెట్ సర్వీస్లను నిర్వీర్యం చేసిందని, గత ప్రభుత్వం చేసిన అవినీతిని కూడా వెలికితీస్తామని, సిబిఐ విచారణ చేస్తున్నదని, అవినీతికి పాల్పడిన ఏఒక్కరినీ ప్రభుత్వం వదలబోదని గౌతమ్రెడ్డి అన్నారు. ఈసమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ యండి యం. మధుసూధనరెడ్డి, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
తిరుమలలోని గుబ్బా సత్రం 33వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గుబ్బా ట్రస్టు ఛైర్మన్ అశ్వనీకుమార్, మేనేజింగ్ ట్రస్టీ జీవన్కుమార్ శనివారం బర్డ్ ట్రస్టుకు రూ.5 లక్షల విరాళాన్ని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డికి అందించారు. అనంతరం సత్రం వార్షికోత్సవానికి టిటిడి ఛైర్మన్ను ఆహ్వానించారు. సత్రంలో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బర్డ్ ట్రస్టుకు తమవంతుగా విరాళం అందించడం ఆనందంగా వుందన్నారు. తిరుమల గిరులపై ఏ సహాయం చేసినా అది శ్రీవారికే చెందుతుందనే భావనతో ఈ మంచి కార్యక్రమానికి పూనుకున్నట్టు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు చిప్పగిరి ప్రసాద్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోపంచాయతీ ఎన్నికల పోరులో వార్తలను కవర్ చేసే అక్రిడేటెడ్ జర్నలిస్టులకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చే కవరేజీ పాసుల విషయంపై ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక యాప్ ఈఎన్ఎస్ లైవ్ ప్రచురించిన ప్రత్యేక కథనంపై ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించాయి. గాల్లో జర్నలిస్టుల ఎలక్షన్ కమిషన్ పాసులు శీర్షికన వచ్చిన న్యూస్ కార్డ్ అంశం ఎన్నికల కమిషన్ వరకూ చేరడంతో, కాలం చెల్లిన అక్రిడిటేషన్ల ఆధారంగానే ఎలక్షన్ కమిషన్ పాసులు జారీచేయాలని ప్రభుత్వం సమాచారశాఖకు ఆదేశాలిచ్చింది.. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్నిజిల్లాల డిపీఆర్వోలకు ఆదేశాలు జారీచేసింది. దీనితో జర్నలిస్టుల వివరాలు సమాచారశాఖ సేకరిస్తోంది. స్టేట్ రిపోర్టర్లకు జిల్లా పాసులు, మండల విలేకరులకు మండలస్థాయి ఎలక్షన్ కమిషన్ పాసులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి ఎన్నికల వార్తలను కవర్ చేయడానికి అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులకు మాత్రమే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రభుత్వం పాసులు జారీచేస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లోని వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ల కాలపరిమితి తీరిపోయి 2021వ సంవత్సరంలో రెండవ నెల వచ్చినా నేటికీ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు మంజూరు చేయలేదు. దీనితో ఎన్నికల వార్తలు కవర్ చేసే జర్నలిస్టులకు ఎలక్షన్ కమిషన్ పాసుల విషయమై సందిగ్దత ఏర్పడింది. అదే సమయంలో జర్నలిస్టుల సమస్యలను, అక్రిడిటేషన్ లేకపోతే ఎలక్షన్ కమిషన్ పాసులు రావనే విషయాన్ని ప్రత్యేక కథనం ద్వారా ఈఎన్ఎస్ లైవ్ న్యూస్ యాప్ ద్వారా న్యూస్ కార్డు ప్రచురించింది. దీంతో ఈ విషయాన్ని అన్నిజిల్లాల రిటర్నింగ్ అధికారులు ప్రభుత్వ ద్రుష్టికి తీసుకెళ్లడంతో ప్రభుత్వం స్పందించి. అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులకు ఎలక్షన్ కమిషన్ పాసులు జారీ చేయాలని నిర్ణయించి ఆ మేరకు పాలసును సిద్ధం చేస్తున్నారు. ఈ ఎన్నికల కమిషన్ పాసులు లేకపోతే ఎన్నికల ప్రక్రియ, ఓట్ల లెక్కింపును జర్నలిస్టులు కవర్ చేయడానికి గానీ, అక్కడ జరిగే విషయాలను తెలుసుకోవడానికి గానీ వీలుపడదు. అదే సమయంలో ఎన్నికల సిబ్బంది కూడా పోలింగ్ స్టేషన్ల దగ్గరకు రానీయరు సరికదా, జర్నలిస్టులని కూడా చూడకుండా పోలీసులు చాలా దారుణంగా వ్యవహరిస్తారు. వర్కింగ్ అక్రిడేటెడ్ జర్నలిస్టుల విధులకు ఎక్కడా ఆటంకం రాకుండా ప్రభుత్వమే ఎలక్షన్ కమిషన్ పాసులను మంజూరు చేయాలని నిర్ణయించడం విశేషం. ప్రభుత్వానికి సంబందించిన విషయాలను కవర్ చేసే జర్నలిస్టులకు, ప్రాధాన్యతను గుర్తించి కొత్త అక్రిడిటేషన్లు ప్రభుత్వం తక్షణమే మంజూరు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.