అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర క్రీడా వేదికలపై జిల్లా ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసే విధంగా క్రీడాకారులు ముందుకుసాగాలని మాజీ ఉపముఖ్యమంత్రి, నరసన్నపేట శాసన సభ్యులు మరియు రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ క్రీడాకారులకు పిలుపునిచ్చారు. హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, సెట్ శ్రీ, నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవ ర్యాలీ కార్యక్రమం స్థానిక డే అండ్ నైట్ జంక్షన్ వద్ద సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ తో కలిసి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. కోడి రామ్మూర్తి స్టేడియం వరకు కొనసాగిన ఈ ర్యాలీలో పాల్గొన్న ఆయన అక్కడ ఏర్పాటుచేసిన సభలో పాల్గొని ధ్యాన్ చంద్ చిత్రపటానికి పులమాలను వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ హాకీలో దేశానికి వరుసగా మూడుసార్లు బంగారు పతకాలు సాధించిన ధ్యాన్ చంద్ జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు.
ఇటువంటి లెజెండరీలను స్మరించుకుంటూ నేటి తరానికి గుర్తుచేయడం క్రీడాస్ఫూర్తికి నిదర్శనమన్నారు. శ్రీకాకుళం వెనుకబడిన జిల్లా అయినప్పటికీ క్రీడాకారులకు కొదవలేదని అన్నారు. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించిన క్రీడాకారులు ఈ జిల్లాలోనే ఉన్నారని, ఇండియన్ హెర్క్యూలెస్ గా పేరుగాంచిన కోడి రామమూర్తిని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆర్ధికస్తోమత లేని కారణంగా మరెందరో క్రీడాకారుల నైపుణ్యాలు వెలుగులోకి రావడం లేదన్నారు. అటువంటి వారికోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలామంది క్రీడ ప్రోత్సహాకులు ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నారని, వారందరిని ఈ సందర్భంగా అభినందించారు. తాను కూడా క్రీడాకారుడునని, క్రీడాకారుల కష్టాలు తనకు తెలుసునని, క్రీడాకారుల సహాయార్ధం తన వంతుగా 50వేల రూపాయలను ఆర్ధిక సహాయాన్ని ప్రకటిస్తూ నగదును వేదికపై అందించారు. క్రీడాకారులకు సరైన శిక్షణ, సౌకర్యాలు కల్పిస్తే మరిన్ని విజయాలు సాధిస్తారని తెలిపారు.
పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రోత్సహిస్తూనే, ఔత్సాహిక క్రీడాకారులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా క్రీడలు పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు మంచి సత్ఫలితాలు ఇస్తున్నాయని ఫలితంగా గేమ్స్,స్పోర్ట్స్ లలో అంతర్జాతీయ క్రీడా వేదికలపై మన వాళ్లు గొప్పగా రాణించగలుగుతున్నారని అన్నారు. క్రీడాకారులకు గోల్స్, టార్గెట్స్ ఉండాలని అపుడే వాళ్ళు అనుకున్నది సాదించగలుగుతారని చెప్పారు. అన్నిరంగాల్లో కాకుండా ప్రావీణ్యం గల రంగాన్ని ఎంచుకొని ముందుకువెళ్లడం ద్వారా తప్పక విజయం సాదించవచ్చని ఉద్బోధించారు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలని, క్రీడలతో శారీరక దారుడ్యం, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని వివరించారు. క్రీడాకారులకు, పాదచారులకు నిలయమైన కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరుచేసిందని, త్వరలోనే ఆ పనులు పూర్తిచేసి క్రీడాకారులకు అందిస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం జాతీయ స్థాయిలో సబ్ జూనియర్ నేషనల్ జ్యూడో ఛాంపియన్ షిప్ నందు బంగారు పతకం సాధించిన కడపల సౌమ్య రాణి, హ్యాండ్ బాల్ బంగారు పతక విజేత తామడ దినేష్, బాక్సింగ్ నందు తామ్ర పతక విజేతలైన గంధం ఢిల్లీశ్వర్, పెద్ద అప్పలరాజు, జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కబాడ్డి, బాక్సింగ్, అథ్లెటిక్స్, హాకీ విజేతలకు దుశ్శాలువ, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి పి.సుందరరావు, బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం.ఎస్.ఆర్.కృష్ణమూర్తి, స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షులు హారిక ప్రసాద్, వాకర్స్ క్లబ్ గవర్నర్ గుప్తా, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎం.మాధురీలత, సెట్ శ్రీ ముఖ్యకార్యనిర్వహణ అధికారి బి.వి.ప్రసాదరావు, నెహ్రు యువ కేంద్ర జిల్లా సమన్వయకర్త కె.వి.ఉజ్వల్, జిల్లా పర్యాటక అధికారి ఎన్. నారాయణరావు, జిల్లా ఉపాధి అధికారి జి.శ్రీనివాసరావు, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు డి.వి.రమణ, అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు సాంబమూర్తి, జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు.